జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ
Published Thu, Jun 29 2017 3:05 AM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM
- అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్
- అంటు వ్యాధులు ప్రబలకుండా తక్షణ చర్యలు
కాకినాడ సిటీ: జిల్లాలో నెలకొన్న ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని బుధవారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో జరుగుతున్న పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా వచ్చే మూడు రోజులు ప్రత్యేక పారిశుద్ధ్య పనులను అత్యవసరంగా చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని మున్సిపాల్టీలు గ్రామ పంచాయతీల్లో చెత్తను తొలగించడం, మంచినీటి వనరులు ఓవర్ హెడ్ ట్యాంక్లు, బావుల్లో క్లోరినేషన్, బోర్ల మరమ్మతులు చేపట్టాలని, దోమలు ప్రబలకుండా నీటి నిల్వలు ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు, యాంటీ లార్వల్ ఆపరేషన్లు చేపట్టాలని సూచించారు. ప్రత్యేక పారిశుద్ధ్య పనులను మండల ప్రత్యేకాధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, అవసరమైన చోట్ల ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.
.డెంగీ పట్ల అప్రమత్తం...
ప్రజలు డెంగీ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా విజ్ఞప్తి చేశారు. దోమలు కుట్టకుండా, పుట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎడిస్ ‘ఈజిప్టి’ దోమ పగటి పూట మాత్రమే కుడతాయని, దీనివల్ల డెంగీ వ్యాధికి గురవుతారన్నారు. సరైన సమయంలో చికిత్స చేయించుకోకపోతే వ్యాధి సోకిన 50 మందిలో ఒకరు మరణించే ప్రమాదం ఉందన్నారు. ఈ వ్యాధి లక్షణాలు తీవ్రమైన జ్వరం, శరీరంపై దద్దుర్లు చర్మం ద్వారా రక్తస్రావం, తీవ్రమైన తలనొప్పి, కీళ్ల నొప్పులు, ఆకలి మందగించడంవంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఈ లక్షణాలున్న వారు దగ్గరలోని ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వాసుపత్రుల్లో తగిన వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలన్నారు.
Advertisement
Advertisement