నెలాఖరుకు పక్కాఇళ్ల నిర్మాణం మొదలు కావాలి
-
హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి
రామాపురం(తడ): మండలానికి మంజూరైన పక్కా ఇళ్లకు సంబంధించి ఈ నెలాఖరుకల్లా బేస్మెంట్ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి స్థానిక అధికారులకు సూచించారు. రామాపురం ఎస్సీ కాలనీవాసుల కోసం ఏర్పాటు చేసిన లేఔట్లో 42 ఇళ్లు మంజూరైనప్పటికీ ఇంతవరకు ఎవరూ ముందుకు రాకపోవడంపై పీడీ అధికారులను కారణాలు అడిగారు. మండలంలో 167 ఇళ్లు మంజూరు అయినప్పటికీ కేవలం 18 మంది లబ్ధిదారులు మాత్రమే పనులు ప్రారంభించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత రూ.2.5 లక్షలు ఇస్తామని చెప్పి ప్రస్తుతం రూ.1.5 లక్షలు ఇస్తామనడంతో లబ్ధిదారులు ఆలోచనలో పడ్డారని అధికారులు తెలిపారు. ఆయన వెంట ఈఈ సాయిరాంనాయుడు, డీఈ నటరాజ్, ఏఈ మురళి ఉన్నారు.