
విదేశాల్లో ఉద్యోగాలంటూ కన్సల్టెన్సీల మోసం
► 8 మంది అరెస్ట్
► 42 పాస్పోర్టులు స్వాధీనం
సాక్షి, సిటీబ్యూరో: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న కన్సల్టెన్సీలపై సైబరాబాద్ జంట కమిషనరేట్ల స్పెషల్ ఆపరేషన్ టీమ్లు దృష్టి సారించాయి. సైబరాబాద్ ఈస్ట్ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాల ప్రకారం చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో శనివారం వివిధ ప్రాంతాల్లోని నాలుగు సంస్థపై దాడులు చేసి మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 42 ఒరిజినల్ పాస్పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండానే ఈ కన్సల్టెన్సీలు నిర్వహిస్తున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
♦ చైతన్యపురి ఠాణా పరిధిలోని అల్కాపురిలో సిరి ఓవర్సీస్ సొల్యూషన్స్ను నిర్వహిస్తున్న రవీందర్ రెడ్డి, రమేశ్కుమార్లు గల్ఫ్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ డబ్బు వసూలుచేస్తున్నారు. ఆ తర్వాత కేరళలోని బీపీ టూర్స్ అండ్ ట్రావెల్స్, ముంబైలోని అంకిత ట్రావెల్స్, న్యూఢిల్లీలోని ఓవన్నీ ట్రావెల్స్ ద్వారా పంపించే ఏర్పాట్లను చేస్తున్నారు. ఇది గుర్తించిన పోలీసులు సంస్థ నిర్వాహకుడు రవీందర్ రెడ్డిని అరెస్టు చేశారు. అతని భాగస్వామి రమేశ్కుమార్ పరారీలో ఉన్నాడు.
♦ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి పాస్పోర్టులు, డబ్బు వసూలు చేస్తున్న దిల్సుఖ్నగర్లో స్టీడ్ ఫాస్ట్ సర్వీసెస్ నిర్వాహకుడు శ్రీహర్షను అరెస్టు చేశారు. అతని భాగస్వామి సంగంకన్నా పరారీలో ఉన్నాడు.
♦ మౌలాలీ ఆర్టీసీ కాలనీలోని మహమ్మద్ తఫీజ్ ‘సమ్మయ్య టూర్స్ అండ్ ట్రావెల్స్’ పేరిట ఖతార్, దుబాయ్, కువైట్,దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేస్తున్నాడన్న సమాచారం పోలీసులకు అందింది. ఈ మేరకు దాడులు చేసి అతన్ని అదుపులోకి తీసుకుని పది ఒరిజినల్ పాస్పోర్టులు, 11,120 నగదును, ల్యాప్టాప్, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
♦ పహడీషరీఫ్ ఠాణా పరిధిలోని షాహీన్ నగర్లో ఓమర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరిట విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని డబ్బులు వసూలు చేసి టోలిచౌకిలోని మాస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ద్వారా అక్రమంగా పంపేందుకు ప్రయత్నిస్తున్న నిర్వాహకులు ఓమర్, సయ్యద్ అక్రమ్, అమీర్లను కూడా అరెస్టు చేశారు.32 ఒరిజినల్ పాస్పోర్టులతో పాటు ఓ వీసాను స్వాధీనం చేసుకున్నారు.
♦ కార్వాన్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ తహెర్ మాసబ్ట్యాంక్లో న్యూగల్ఫ్ ట్రావెల్ ఏజెన్సీ, కూకట్పల్లికి చెందిన బి.రాఘవేంద్ర ఇంజినీయస్ ఎంటర్ప్రైజెస్ పేరుతో పంజాగుట్టలో కన్సల్టెన్సీలను నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులకు ఇంట ర్వూ్యలు నిర్వహించి తరువాత ఉద్యోగాలు వచ్చాయంటూ నమ్మించేవారు. వీసాలు ఇప్పించి, గల్ఫ్ దేశాలకు పంపించాలంటే రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షలు ఖర్చువుతుందని డబ్బు వసూలుచేసేవారు. తరువాత వీసాల ప్రక్రియ నడుస్తుందం టూ నాలుగు నెలల వరకు తిప్పించుకునేవారు.
ఎవరైనా ఒత్తిడి తేస్తే వారి వీసా, చెల్లించిన డబ్బు లో కొంత మొత్తం వెనక్కి ఇచ్చి చేతులు దులుపుకునేవారు. హైదరాబాద్తో పాటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో సబ్ ఏజెంట్లను ఏర్పాటుచేసుకొని దందా సాగించేవారు. అయితే కొంత మంది నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించడంతో మహమ్మద్ అబ్దుల్ తహెర్, రాఘవేంద్రలను అరెస్టు చేసి తదుపరి విచారణ కోసం సైఫాబాద్, పంజాగుట్ట పోలీసులకు అప్పగించామనివెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి తెలి పారు. వీరి నుంచి రెండు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, 165 బయోడేటా ఫామ్లు స్వాధీనం చేసుకున్నారు.