నూతన డోనార్ మేనేజ్మెంట్ ఆన్లైన్ విధానాన్ని ప్రారంభిస్తున్న టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు
–దాతల ప్రోత్సాహానికి సన్నాహాలు
–డోనార్ మేనేజ్మెంట్ ఆన్లైన్ ప్రారంభంలో టీటీడీ ఈవో
తిరుపతి అర్బన్:
తిరుమల– తిరుపతి దేవస్థానాల ద్వారా విద్య, వైద్య రంగాల సేవలకు మరింత ప్రాధాన్యత ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతల సౌకర్యార్థం డోనార్ మేనేజ్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ విధానాన్ని సోమవారం ఈవో ప్రారంభించారు. ఈసందర్భంగా తిరుపతిలోని ఏడీ బిల్డింగ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీటీడీ ట్రస్టులకు ఎక్కువ మంది దాతలు విరాళాలు అందిస్తున్న నేపధ్యంలో విద్య, వైద్యరంగాలతో పాటు భక్తులకోసం మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తద్వారా దాతల సంఖ్య పెరిగేందుకు అవకాశముంటుందన్నారు. ఈ కొత్త ఆన్లైన్ విధానం ద్వారా టీటీడీ లోని 9 ట్రస్టులు, ఒక పథకానికి విరాళాలు ఇచ్చే దాతలకు 48 గంటల్లోపు డిజిటల్ పాస్పుస్తకాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే దాతలుగా వున్న వారు తమ డోనార్ గుర్తింపు సంఖ్య, పాస్పుస్తకం సంఖ్యను ఆన్లైన్లో పొందుపరచి డిజిటల్ పాసుపుస్తకాన్ని పొందవచ్చునన్నారు. దాతల విభాగం ద్వారా కల్పించే దర్శనం, బస తదితర ప్రయోజనాలను ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా బుక్ చేసుకోవచ్చునని వివరించారు. ప్రస్తుతానికి టీటీడీలో 40వేలమంది దాతలు వున్నారని వారందరికీ ఈ కొత్త విధానం ద్వారా ఎన్నో ఆధునిక సేవలను అందించేందుకు వీలుకలుగుతుందన్నారు. ఇదే తరుణంలో కొత్త విధానం అమలవుతున్న తొలినాళ్లలో ఏవైనా లోటుపాట్లు ఎదురైతే వాటిని తక్షణం సరిదిద్ది ఆన్లైన్ వి«ధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
– వెబ్సైట్లో వివరాలు :
దాతలు ఇచ్చే విరాళాల సొమ్ముతో చేపడుతున్న కార్యక్రమాల గురించి ఆయా ట్రస్టులకు చెందిన అ«ధికారులు పూర్తి వివరాలను టీటీడీ వెబ్సైట్లో పొందుపరచాలన్నారు. ట్రస్టుల సేవా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు విజువల్స్ తీయించి ఎస్వీబీసీలో ప్రసారం చేస్తూ వెబ్సైట్లో వుంచడం ద్వారా మరింత మంది భక్తులు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ–హుండీ ద్వారా భక్తులు సమర్పించే కానుకలు నేరుగా శ్రీవారి హుండీ అకౌంట్కు జమ అవుతాయని పూర్తిస్థాయిలో తెలియబరచాలన్నారు. ఈ–డొనేషన్ విధానాన్ని కూడా డోనార్ మేనేజ్మెంట్ అప్లికేషన్కు అనుసంధానం చేయాలని టీటీడీ ఈవో ఐటీ విభాగం అ«ధికారులకు సూచించారు. ఇప్పటి వరకు పాస్పుస్తకాలు అందని దాతల వివరాలు సేకరించి మూడు రోజుల్లోపు డిజిటల్ పాస్పుస్తకాలను దాతలే స్వయంగా వచ్చి పొందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈవో పోల భాస్కర్, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్, టీటీడీ ఎఫ్ఏ అండ్ సీఏవో బాలాజీ, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్రెడ్డి, ఐటీ విభాగాధిపతి శేషారెడ్డి, దాతల విభాగం డిప్యూటీ ఈవో రాజేంద్రుడు, టీసీఎస్ అధికారులు పాల్గొన్నారు.