
రాష్ట్రంలో రాక్షస పాలన
రాష్ట్రంలో రాక్షస పాలన
రాష్ట్రం, రాక్షస, పాలన, rastram, rakshasudu, palana
అధికార పార్టీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళుతున్నందుకే ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు ఆదివారం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకులు, నాయకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. వంద పేజీల ఎన్నికల మెనిఫెస్టోలో వెయ్యి అబద్ధాలను చెప్పిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ దురాగతాలను ఎండగట్టేందుకు చేపట్టిన గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమంతో అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. రాబోయే కాలం తమదేనని, కార్యకర్తలు అధైర్యపడకుండా మనోధైర్యంతో ఉండాలన్నారు. కార్యకర్తలందరికీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నగరి మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపును టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. అందుకే తెలుగుదేశం నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. కేసులతో నాయకులను భయపెట్టాలనుకుంటే అది భ్రమ మాత్రమేనన్నారు. నగరిలో చాలామంది కార్యకర్తలపై కేసులు పెట్టారని వారిలో కొంత మంది కూడా టీడీపీ చేరలేదని గుర్తుచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. టీడీపీ అక్రమాలకు ఎదురు నిలిచి పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజలు తమ వెంటే ఉన్నారనీ.. కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదని వైఎస్సార్సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నారాయణ స్వామి అన్నారు. కేసులకు భయపడే ప్రసక్తేలేదని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను మానుకోకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీ పూర్తిగా కనుమరగవుతుందని హెచ్చరించారు. టీడీపీ నాయకులు అధికార మదంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. అవినీతిపై పోరాటం చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నాయకులపై టీడీపీ ద్వితీయ శ్రేణి కూడా దాడులకు తెగబడుతున్నా పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారని వాపోయారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పారు. పూతల పట్టు ఎమ్మెల్యే సునీల్కుమార్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో కుప్పం తరువాత నగరి, పూతలపట్టు నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలుస్తుందని ఆశించి భంగపడ్డంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఆగడాలు మితిమీరుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు అటవిక పాలన సాగిస్తున్నారని అన్నారు. సీఎం ప్రతి పక్షాన్ని గౌరవించే పద్ధతిని నేర్చుకోవాలని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.