‘శివటెక్’ నష్టం రూ.10 కోట్లు
కర్నూలు(అర్బన్): శివటెక్ పరిశ్రమలో ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో దాదాపు రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పరిశ్రమ ఎండీ శివకుమార్, ఈడీ అమిత్కుమార్ ఢిల్లీలో ఉండటం, ఫోన్లో అందుబాటులోకి రాకపోవడంతో ఆర్థికంగా జరిగిన నష్టంపై ఖచ్చితమైన సమాచారం సేకరించేందుకు సంబంధిత పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జరిగిన అగ్ని ప్రమాదంలో 22 ట్యాంకర్లలో నిల్వ ఉన్న 950 మెట్రిక్ టన్నుల హైడ్రో క్లోరైడ్ ఆయిల్కు సంబంధించిన రా మెటీరియల్ కాలిపోయింది. ఈ రా మెటీరియల్తో క్లోరిన్ యాడ్ చేసి క్లోరినేటెడ్ ప్లోరాపిన్ వ్యాక్స్ తయారు చేస్తారు. అలాగే బై ప్రాడక్ట్గా హైడ్రో క్లోరైడ్ యాసిడ్ను కూడా తయారు చేస్తున్నట్లు సమాచారం. పూర్తిగా అగ్నికి ఆహుతి అయిన మెటీరియల్ విలువ దాదాపు రూ.6 కోట్లు ఉంటుందని, పరిశ్రమకు జరిగిన నష్టం రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఉంటున్నట్లు తెలిసిందని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి భూపాల్రెడ్డి సోమవారం తెలిపారు. పరిశ్రమకు చెందిన యజమానులు వస్తే పూర్తి సమాచారం అందుతుందన్నారు.