- విజయవంతానికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు పిలుపు,
- వైఎస్ఆర్సీపీ పిలుపునకు అనూహ్య స్పందన
- మద్దతు ప్రకటించిన వామపక్షాలు
హోదాపై నేడు బంద్ హోరు
Published Fri, Sep 9 2016 10:33 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
కాకినాడ:
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించకుండా దగా చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో బంద్ విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుదేశం, బీజేపీ తీరుపై ఆగ్రహంతో ఉన్న అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో బంద్ను విజయవంతం చేయడం ద్వారా ప్రత్యేక హోదా ఆవశ్యకతను దిల్లీ వరకు చాటి చెప్పాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తున్నాయి. హోదాతోనే భవిష్యత్తు తరాలకు వెలుగు, పారిశ్రామికీకరణతో ముందడుగు వేయగలం, అప్పుల బారిన పడకుండా రాష్ట్రం ఆర్థిక పరిపుష్టిత చేకూరగలదని, ప్రాజెక్టులకు ఓ రూపు వస్తుందనే అంశాలను ప్రజలకు వివరించడానికి పార్టీ నేతలు తమ శ్రేణులను సమాయత్తం చేస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ కో ఆర్డినేటర్లతో సమావేశాలు నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. మండలం, గ్రామ స్థాయిలో కూడ ప్రజలను చైతన్యం చేసే దిశలో కార్యకర్తలు శుక్రవారం ప్రతర్శనలు చేశారు. ఉదయాన్నే ఆర్టీసీ బస్సులను నిలుపుదల చేయడం నుంచి వ్యాపార, వాణిజ్య వర్గాలను కూడా సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను బంద్లో పాల్గొనేలా ఆయా సంస్థలతో చర్చించారు. మరో వైపు వామపక్ష పార్టీలు కూడా వైఎస్ఆర్సీపీ తలపెట్టిన బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
బంద్ను విజయవంతం చేయండి: కన్నబాబు
బంద్ను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కార్మిక సంఘాలు, ఆటో యూనియన్లు, ధియేటర్ల యాజమాన్యాలు, విద్యాసంస్థలు, ఆర్టీసీ, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఇందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదాకు మద్దతుగా ప్రత్యేక ప్యాకేజీల ప్రకటనను నిరసిస్తూ చేపట్టిన బంద్లో అన్ని వర్గాలు స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు. ప్రజలను మభ్యపెడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న కపట నాటకాన్ని ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement