
అధికారులు కావలెను
♦ 20 శాఖలకు సారథులు లేరు
♦ అధికార పార్టీ పెద్దలంటే భయం
ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే పాలన సక్రమంగా జరగాలి. పాలన సక్రమంగా జరగాలంటే నడిపించే సారథులుండాలి. ఇదేం చోద్యమో గాని జిల్లాలో ఉన్నతాధికారి పోస్టులు ఖాళీగా ఉండిపోతున్నాయి. ఉన్న కొద్దిమందీ అధికార పార్టీ పెద్దలు, వారిదగ్గర పనిచేస్తున్న వారిపెత్తనం భరించలేక..తప్పులు చేయలేక వెళ్లిపోతున్నారు. మరికొందరు ఇటీవల కలెక్టరు ఆగ్రహానికి గురై నిష్ర్కమించారు. ఈ విధంగా జిల్లాలో 20 శాఖలకు ఉన్నతాధికారులు లేరు. ప్రస్తుతం ఇన్చార్జిలతోనే కొనసాగిస్తున్నారు. ద్వితీయశ్రేణి అధికారుల పోస్టుల్లో ఖాళీలు ఉండనే ఉన్నాయి. దీనివల్ల పనుల్లో పురోగతి ఉండటంలేదు.
శ్రీకాకుళం టౌన్: జిల్లావ్యాప్తంగా రెవెన్యూ, పంచాయితీరాజ్,ఇంజినీరింగ్, గృహ నిర్మాణం, సంక్షేమ,ఐటీడీఏ ఇలా 69 శాఖలున్నాయి. వాటికి అనుబంధ శాఖలు కొనసాగుతున్నాయి. ఈశాఖల్లో కలెక్టరేటు కీలకమైనది. కలెక్టరు, జాయింట్ కలెక్టరు,జేసీ-2 తర్వాత కీలక స్థానం డీఆర్ఓదే. ఇక్కడి డీఆర్ ఓ వెంకటరావు ఇటీవల ఆర్థిక వ్యవహరాల్లో విమర్శలకు గురవడంతో సెలవుపై వెళ్లాలంటూ కలెక్టరు ఆదేశించారు. దీంతో రెవెన్యూశాఖలో అతికీలకమై న పోస్టు ఖాళీ అయ్యింది. ఇటీవల కలెక్టరు మాట ను ధిక్కరించిన కారణంగా బీసీ సంక్షేమ అధికారి రవిచంద్రను ప్రభుత్వానికి సరెండరు చేశారు. ఆయన స్థానంలో వచ్చేందుకు ఎవరూ సుముఖం గా లేరు. సామాజిక అటవీశాఖ డిఎఫ్ఓ వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన్ను కూడా ప్రభుత్వానికి సరెండరు చేశారు. డిఎస్ఓ ఆనంద్కుమార్నూ కలెక్టరు సరెండర్ చేశారు. ఐటీడీఏ పరిధిలోని డెప్యూటీ డెరైక్టరును దీర్ఘకాలిక సెలవుపై పంపించా రు. ఆర్థిక లావాదేవీల వివాదంలో చిక్కుకున్న ఆర్వీఎం పీఓ రామచంద్రారెడ్డిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు.
ఖాళీగా ఉన్న పోస్టులివి
డీఆర్ఓ: దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు
డీబీసీడబ్య్లు: ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు
ఆర్వీఎం పీఓ: ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు.
జిల్లా పౌరసరఫరాల అధికారి: ఆనంద్కుమార్ను బదిలీపై పంపారు. ఆయన స్థానంలో ఎఎస్ఓ స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించారు.
బిసికార్పోరేషన్ ఈడీ: బదిలీతో ఖాళీ ఏర్పడింది.
ఎస్డీసీ ఆమదాలవలస: అనారోగ్యకారణంతో సెలవుపై వెళ్లారు
నెడ్ క్యాప్ జిల్లా మేనేజరు: బదిలీపై వెళ్లారు..
డిడి ట్రెజరీస్: బదిలీపై వెళ్లారు( ఇన్చార్జిగా విజయనగరం డిడి)
డీపీఓ: వివాదాలవల్ల బదిలీపై వెళ్లారు.
డిఎఫ్ఓ సోషల్ ఫారెస్టు: రేంజ్ అధికార్లను వేధించారంటూ సరెండరయ్యారు.
ఐసిడిఎస్ పిడి: చక్రధరరావు సస్పెండయ్యారు
పరిశ్రమల శాఖ: జిల్లా జనరల్ మేనేజరు
డ్వామా ఏపీడీ: మాతృశాఖకు వెళ్లిపోయారు.
వాటర్షెడ్ ఏపీఎం:కొంతకాలంగా పోస్టు ఖాళీ
అరసవల్లి ఈఓ: రథసప్తమి వేడుకల ముందు బదిలీ అయ్యారు.
జిల్లా రిజిస్ట్రార్: కొన్నేళ్లుగా పోస్టు ఖాళీ.
జిల్లాపరిషత్: డిప్యూటీ సీఈఓ బదిలీపెవైళ్లారు.
జిల్లా పరిషత్: అకౌంట్స్ ఆఫీసరు పోస్టుఖాళీ.
జలవనరులశాఖ ఈఈ: ఇక్కడున్న ఇఇ పదోన్నతిపై వెళ్లిపోవడంతో వంశధార ప్రాజక్టులో డిఈఈ రవీంధ్రబాబుకు పూర్తిబాద్యతలు అప్పగించారు.
ఐటీడీఏ డీడీ: అవినీతి ఆరోపణల నేపథ్యంలో బదిలీ.
వీరికితోడు ద్వితీయశ్రేణి అధికారులు ఇలా జిల్లా వదిలి వెళ్లిన సందర్భాలు లేక పోలేదు. నచ్చని వారికి ఏదో కారణం చూపి బయటకు పంపిస్తున్న జిల్లాకు చెందిన నాయకులు, ఉన్నతాధికారులు తిరి గి ఆస్థానంలో మరొకరిని తీసుకురావడంలో అంత గా శ్రద్ధ తీసుకోక పోవడం వల్ల ప్రభుత్వశాఖల్లో దిగువస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా తయారైంది. అసలే మార్చినెల, ఆపై ఆర్థిక లావాదేవీలు జోరందుకున్న కాలం. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా ఉన్నతాధికారులు లేక దిగువస్థాయి ఉద్యోగులే చక్కబెడుతున్నారన్న విమర్శులున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చెపుతున్న రెండెంకల అభివృద్ధి ఎలాసాధ్యమవుతుందో..