
పదమూడేళ్ల విరామం తర్వాత విజయశాంతి మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారు! మహేశ్బాబు హీరోగా 2020 లో విడుదల కాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఆమెను మనం చూడవచ్చు. నిజానికి ఆరు నెలల క్రితమే విజయశాంతి సినిమాల్లోకి రావలసి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటించవలసి ఉన్నందున సినిమాల్లోకి రాలేకపోయారు. అయితే ఇప్పుడు సినిమాల్లోకి వస్తున్నందున రాజకీయాలకు దూరమైనట్లేనని భావించనక్కర్లేదని విజయశాంతి అంటున్నారు. ఆమె నటించిన చివరి చిత్రం ‘నాయుడమ్మ’. విజయశాంతి మొదటి చిత్రం తెలుగు కాదు.
అది ‘కల్లుక్కుళ్ ఈరమ్’ అనే తమిళ చిత్రం. విజయశాంతి రాజకీయ రంగ ప్రవేశం చేసింది కూడా ప్రాంతీయ పార్టీ కాదు. అది భారతీయ జనతా పార్టీ. అయితే ఆమె ఎలాగైతే తమిళ, తెలుగు భాషలకు మాత్రమే పరిమితం కాలేదో, అలాగే ఒక పార్టీలోనే ఉండిపోలేదు. బీజేపీలోంచి బయటికి వచ్చి సొంతంగా ‘తల్లి తెలంగాణ’ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత తల్లి తెలంగాణను టి.ఆర్.ఎస్. లో విలీనం చేశారు. తర్వాత టి.ఆర్.ఎస్.నుంచి బయటికి వచ్చి కాంగ్రెస్లో చేరారు. ఆ క్షణం నుంచే విజయశాంతి మళ్లీ బీజేపీలోకి వెళ్లిపోతారనీ, లేదంటే తెలుగుదేశంలో చేరతారనీ వార్తలు మొదలయ్యాయి. తర్వాత ఆమె అన్నాడీయెంకేలో చేరబోతున్నారనే మాట కూడా వినిపించింది. అయితే ఆమె కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment