
లండన్ : మితంగా మద్యం తీసుకుంటే మేలని ఇప్పటికే పలు అథ్యయనాలు వెల్లడించగా, బీరు, వైన్, చాక్లెట్లతో అకాల మరణం ముప్పు గణనీయంగా తగ్గుతుందని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. మద్యంతో పాటు పండ్లు, కూరగాయలను పుష్కలంగా తీసుకుంటేనే వీటి ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉంటాయని వార్సా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.
రెడ్ మీట్, శీతల పానీయాలు, ప్రాసెస్డ్ ఆహారం తీసుకునేవారితో పోలిస్తే పండ్లు, కూరగాయలతో పాటు వైన్, బీరు, చాక్లెట్లను పరిమితంగా తీసుకున్నవారిలో అకాల మరణాల ముప్పు 15 నుంచి 20 శాతం తక్కువగా ఉన్నట్టు తమ పరిశోధనలో తేలిందని అథ్యయన రచయిత ప్రొఫెసర్ జొన్నా కలూజా చెప్పారు. పండ్లు, కూరగాయలు, రెడ్ వైన్, బీర్, చాక్లెట్లలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులకు దారితీసే ఇన్ఫ్లమేషన్ (వాపు)ను నివారిస్తాయని ఫలితంగా అకాల మరణం ముప్పు తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు.
45 నుంచి 83 ఏళ్ల సంవత్సరాలున్న 68,273 మందిపై జరిపిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారం తీసుకున్న వారిలో అకాల మరణాలు వీటిని తక్కువ మోతాదులో తీసుకున్న వారితో పోలిస్తే 18 శాతం తక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. వీరిలో గుండె జబ్బుల మరణాల ముప్పు 20 శాతం, క్యాన్సర్ మరణాలు 13 శాతం తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment