
'బాబు భూదందాలో మునిగితేలుతున్నారు'
రైతుల పట్ల ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ధ్వజమెత్తారు.
వేంపల్లె: రైతుల పట్ల ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం సిరులు పండే భూములను రాజధాని పేరుతో రైతుల నుంచి లాక్కుంటోందని ఆరోపించారు. ఆయన సోమవారం వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించే భూమిలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి రాజధానులను నిర్మించవచ్చని తెలిపారు. అగ్రరాజ్యం అమెరికా రాజధాని వాషింగ్టన్ విస్తీర్ణం 7వేల ఎకరాలేనని తెలిపారు.
భూ దందా కార్యక్రమంలో మునిగి తేలుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను విస్మరించారన్నారు. రెండేళ్ల నుంచి ఇన్పుట్ సబ్సిడీ పైసా విడుదల చేయలేదని, కనీసం రైతులకు సరిపడా విత్తనాలను కూడా పంపిణీ చేయలేక పోయారని ఆరోపించారు. మొత్తం 9 వేల క్వింటాళ్లు అవసరం కాగా 1500 క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే అందజేశారని వివరించారు. సర్కారు నిర్లక్ష్యం కారణంగా రాష్ర్ర్టంలో వ్యవసాయం చతికిలపడిందని తులసిరెడ్డి అన్నారు.