
‘ఆపరేషన్ ఆర్కే కాదు...ఆపరేషన్ మైనింగ్’
హైదరాబాద్ : మైనింగ్ కంపెనీలతో చేసుకున్న ఎంవోయులో భాగంగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆపరేషన్ ఆర్కే కొనసాగిస్తోందని విరసం నేత వరవరరావు ఆరోపించారు. ‘ఆపరేషన్ ఆర్కే కాదు... ఆపరేషన్ మైనింగ్. ఆధారాలు లేకుండా మేం ఎప్పుడూ ఆరోపించం. లొంగిపోయిన దళ సభ్యుడు ఇచ్చిన సమచారం మేరకే ఈ ఆపరేషన్ జరిగింది. పేర్లు ఏవైనా చంపడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆపరేషన్ కొనసాగిస్తోంది. మావోయిస్టు మృతదేహాల పోస్టుమార్టంలో స్పష్టం లేదు’ అని అన్నారు.
ఏవోబీలో బూటకపు ఎన్కౌంటర్తో హత్య చేసి కట్టు కథలు అల్లడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆర్కేతో పాటు రవిలను తక్షణమే కోర్టులో హాజరు పరచాలన్నారు. అడవి సంపదను దోచుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్హంట్ను ప్రవేశపెట్టాయని, అందులో భాగంగానే ప్రజల కోసం పోరాడుతున్న విప్లవకారులపై ఎన్కౌంటర్ హత్యలకు పాల్పడుతున్నారన్నారు. మావోయిస్టులు కాలిస్తే పోలీసులకు గాయాలయ్యాయని, పోలీసుల కాల్పుల్లో మావోయిస్టుల ప్రాణాలు పోయాయన్నారు. మల్కన్గిరి ఘటనలో కాల్పులు ఏకపక్షంగా జరిగాయని ఆరోపించారు.