ముందస్తు ప‍్రణాళికతోనే చాందిని హత్య | Chadini Jain Murder case: it's a pre-planned murder, says Cyberabad Police Commissioner | Sakshi
Sakshi News home page

చాందిని వేరేవాళ్లతో క్లోజ్‌గా ఉందని..

Published Wed, Sep 13 2017 5:32 PM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM

ముందస్తు ప‍్రణాళికతోనే చాందిని హత్య - Sakshi

ముందస్తు ప‍్రణాళికతోనే చాందిని హత్య

సాక్షి, హైదరాబాద్‌ : ముందస్తు ప‍్రణాళికతోనే ఇంటర్‌ విద్యార్థిని చాందిని జైన్‌ను సాయికిరణ్‌ రెడ్డి హతమార్చాడని సైబరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య తెలిపారు. ఈ కేసులో నిందితుడు సాయి కిరణ్‌ను బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీపీ సందీప్‌ శాండిల్య ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.

‘ఈ నెల 9న చాందిని ఇంటి నుంచి వెళ్లింది. అదేరోజు సాయంత్రం ఆమె మిస్‌ అయినట్లు మాకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు రాగానే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. 11న అమీన్‌పూర్‌లో ఓ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే చాందిని తల్లిదండ్రులను పిలిపించాం. ఆ మృతదేహం చాందినిదేనని వారు నిర్థారించారు. అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లేవు.

చాందినిది కేవలం హత్య మాత్రమే. పోస్టుమార్టం నివేదికలో వైద్యులు తేల్చారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే హత్య ఏ సమయంలో జరిగిందో చెప్పగలం. ఫిర్యాదు అందిన సమయానికి ముందే చాందిని హత్యకు గురైంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించాం. సీసీ పుటేజ్‌ను చాందిని తండ్రితో పాటు సాయికిరణ్‌ తండ్రికి చూపించాం. ఫుటేజ్‌  చూపిన తర్వాత నిందితుడి తండ్రి ఒప్పుకున్నారు.

కాల్‌ డేటా వివరాలతో పాటు, స్నేహితులను విచారణ చేశాం. వారు  ఆ సమయంలో ఎక్కడున్నారో ప్రశ్నించారు. అలాగే సాయి కిరణ్‌ను కూడా ప్రశ్నించాం. నిందితుడు మొదట తప్పించుకునేందుకు యత్నించాడు. హత్య జరిగిన సమయంలో తాను క్రికెట్‌ ఆడినట్లు తెలిపాడు. అయితే మా విచారణలో అతడు అసలు క్రికెట్‌ ఆడలేదని తేలింది. దీంతో అతడు అబద్ధం చెప్పాడని తేలిపోయింది. సాయికిరణ్‌ రెండు నెలల క్రితమే హత్య జరిగిన అడ్డగుట్ట ప్రాంతానికి వెళ్లి పరిశీలించి వచ్చాడు.  చాందిని, నిందితుడు ఇద్దరూ ఆటోలో అక్కడకు వెళ్లారు.


చాందిని స్నేహితులు ఎక్కువ. సెప్టెంబర్‌ 1 నుంచి 3 వరకూ జరిగిన గెట్‌ టు గెదర్‌లో మరో వ్యక్తితో చాందిని సన్నిహితంగా మెలిగింది. అలాగే 9న సోహైల్‌ అనే వ్యక్తితో పబ్‌కు వెళ్లాలని చాందిని అనుకుంది. కానీ సాయికిరణ్‌ పిలవడంతో పబ్‌కు రావడం లేదని సోహైల్‌కు చెప్పింది.  ఇక తనతో పాటు మరో ఇద్దరితో చాందిని సన్నిహితంగా ఉండటం సాయికిరణ్‌కు నచ్చలేదు. అంతేకాకుండా పెళ్లి చేసుకోవాలని చాందిని...అతడిని ఒత్తిడి చేసింది. అయితే సెటిల్‌ అయిన తర్వాత పెళ్లి చేసుకుందామని సాయికిరణ్‌ చెప్పాడు. ఈ సందర్భంగా మాటా మాటా పెరిగింది. దీంతో కోపంతో చాందిని చెంప మీద కొట్టి మెడకు చున్నీ బిగించి ఉరి వేసి చంపేశాడు.

అనంతరం మృతదేహాన్ని గుట్ట మీద నుంచి కిందకు తోసేశాడు.  హత్య చేసిన తర్వాత వేరే దారి నుంచి వెనక్కి వచ్చాడు.’ అని తెలిపారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సీపీ సూచించారు. ప్రతిదానికి ఫేస్‌బుక్‌పైనే ఆధారపడుతున్నారని, అంతేకాకుండా సోషల్‌ మీడియాపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఫేస్‌బుక్‌లో లైక్స్‌ తక్కువ వచ్చాయని కూడా బాధపడుతున్నారన్నారు. మృతి చెందిన చాందినితో పాటు సాయి కిరణ్‌ కూడా మైనరేనని సీపీ సందీప్‌ శాండిల్య తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement