
అబద్ధాల్లో పోటీపడుతున్న మోదీ, కేసీఆర్
- డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎక్కడ: కపిల్ సిబల్
- మోదీది నకిలీ హిందూయిజం
సాక్షి, హైదరాబాద్: ఆచరణ సాధ్యంకాని హామీలు, అబద్ధాలతో అటు ప్రధాని మోదీ, ఇటు కేసీఆర్ పోటీపడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ విమర్శించారు. శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్వి జయ్సింగ్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, ఆర్.సి.కుంతియాతో కలసి గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడారు. రైతులకు మద్దతు ధర ఇస్తామని హామీని ఇచ్చి, ఇప్పుడు పంట ను కొనుగోలు చేసేవారు లేకున్నా ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని కపిల్ సిబల్ ఆరోపించారు. రుణాలు, ఇన్పుట్ సబ్సిడీలు అందక, పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ రైతులను పట్టించుకోవడం లేదన్నారు. ఏడాదికి కోటి ఉద్యోగాలని మోదీ, లక్ష ఉద్యోగాలని కేసీఆర్ చెప్పారని.. ఇప్పటిదాకా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్వన్నీ ఉత్త మాటలే...
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మాటలే తప్ప చేతలు లేవని కపిల్ సిబల్ విమర్శించారు. రాష్ట్రంలో రెండు పడక గదుల ఇళ్లు ఎక్కడ నిర్మించారో, ఎంతమంది పేదలకు ఇచ్చారో చెప్పాలన్నా రు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ ఏమైందని ప్రశ్నించారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ మోసం చేస్తున్నా రని.. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీం తీర్పు ఉందని, అయినా షెడ్యూల్ 9లో చేర్పిస్తా, రాష్ట్రపతికి పంపిస్తా అంటూ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీజేపీయే దీనిని వ్యతిరే కిస్తుంటే ముస్లింలకు రిజర్వేషన్లు ఎలా సాధ్య మని ప్రశ్నించారు.
దేశ పరిస్థితి దిగజారింది...
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీతో దేశంలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. బ్యాంకులు కనీసం రుణాలిచ్చే పరిస్థితుల్లో లేవన్నారు. పేదరికం, ద్రవ్యోల్బణం పెరిగాయని, ఆర్థిక స్థితి దిగజారిందని పేర్కొన్నారు. ఇదేనా మోదీ హయాంలో జరిగిన అభివృద్ధి అని ప్రశ్నిం చారు. నిజమైన హిందువు అయితే సత్యం, అహింసలను ఆచరిస్తారని.. మోదీ మాత్రం హింసను నమ్ముతున్నారని ఆరోపించారు. మోదీది నకిలీ హిందూయిజమని, ఆయన నకిలీ హిందువని సిబల్ విమర్శించారు. సామాన్యుడు ఏం తినాలో, ఏం తినద్దో, ఏ వ్యాపారం చేయాలో నిర్ణయించడాన్ని ఏ ఇతిహాసం నేర్పిందని ప్రశ్నించారు.