
నోట్ల రద్దుపై కాంగ్రెస్ నిరసనలు
2 నుంచి 11 వరకు కార్యక్రమాలు: ఉత్తమ్
► జనవరి రెండో వారంలో రాష్ట్రానికి రాహుల్గాంధీ!
► గాంధీభవన్లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం
► హాజరైన ఏఐసీసీ పరిశీలకులు కేబీ కృష్ణమూర్తి, కర్ణాటక మంత్రి శివకుమార్
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుపై జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చేపట్టనున్న నిరసనల్లో భాగంగా రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రకటించారు. జనవరి 2న జిల్లా కేంద్రాల్లో, పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మీడియా సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. తర్వాత జనవరి 5, 6, 7 తేదీల్లో కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని, 9న మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతామని వివరించారు.
అనంతరం 11వ తేదీన ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగే సభకు భారీ సంఖ్యలో తరలి వెళ్లాలని నిర్ణయించామని, మండల, జిల్లా కేంద్రాల నుంచి నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం గాంధీభవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అనంతరం సమావేశం వివరాలను ఉత్తమ్ మీడియాకు వివరించారు. జనవరి రెండో వారంలో రాష్ట్రానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. జనవరి 11 తర్వాత 24 గంటల సత్యాగ్రహ దీక్ష చేస్తామని తెలిపారు.
ప్రజల డబ్బుపై ఆంక్షలెందుకు..?
పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏఐసీసీ తరఫున పీసీసీ సమావేశానికి పరిశీలకుడిగా హాజరైన కర్ణాటక మంత్రి శివకుమార్ అన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులపై 15 రోజుల పాటు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరిం చారు. ప్రజలు కష్టపడి సంపాదించుకుని బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుల పై ఎందుకు ఆంక్షలు పెట్టారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. నల్ల ధనాన్ని వెలికితీయడానికి తాము వ్యతిరేకం కాదని, చిన్న వ్యాపా రులకు పన్నుల్లో మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొ న్నారు. పీసీసీ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకుడు కేబీ కృష్ణమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత జానారెడ్డి, నేతలు షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వి.హన్మంతరావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, వంశీచంద్రెడ్డి, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారు
అసెంబ్లీలో టీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన భూసేకరణ చట్టం, బలవంతపు భూసేకరణ చట్టమేనని, సభలో సీఎం కేసీఆర్ అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని పీసీసీ సమా వేశంలో నేతలు పేర్కొన్నారు. అసెంబ్లీలో సీఎం వ్యవహారశైలి తెలంగాణ పరువు తీసేలా ఉందని, 2013 భూసేకరణ చట్టాన్ని యూపీఏ సర్కార్ పార్లమెంట్ లో తీసుకొచ్చినప్పుడు, ఆరోజు కేసీఆర్ ఎం దుకు వ్యతిరేకించలేదని నేతలు మండిపడ్డారు. కొత్త భూసేకరణ చట్టంపై కాంగ్రెస్ న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు.