
ఆశలు నెరవేర్చుకున్న 'సహన'...
సహన అక్కల బాధ్యత తీసుకున్న సర్వ నీడీ వాలంట్రీ ఆర్గనైజేషన్
మారేడుపల్లి : నిరుపేద చిన్నారి సహనపై ‘సాక్షి’లో వచ్చిన కథనం పలువురి మనసులను కదిలించింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆ చిన్నారి మనసులో ఆనందం వెల్లివిరిసేలా చేసేందుకు ముందుకు వచ్చారు. ఆసుపత్రికి తప్ప ఇంటి నుంచి బయటకు రాని సహనను ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించి బయటకు తీసుకువచ్చారు. చిన్నారి తన ఆలోచనలను వారితో పంచుకుంది. తన పుట్టిన రోజు జరుపుకొని, దీపావళి కాంతులను చూసి, ఆ దేవుని దర్శనం చేసుకోవాలని ఉందని వారికి తన కోర్కెలను తెలియజెప్పింది.
సహనను వారి కుటుంబ సమేతంగా కార్ఖాన జూపిటర్ కాలనీలోని సర్వ నీడీ ఆర్గనైజేషన్కు శుక్రవారం తీసుకువెళ్లారు ఆర్గనైజేషన్ ప్రతినిధులు. ఫౌండేషన్లోని చిన్నారులుమొదట కొత్త వస్త్రాలతో ఆమెను అలంకరించారు. కేక్ కట్ చేయాలన్న సహన కోరిక మేరకు న్యూ ఇయర్ వేడుకలనే ఆమె పుట్టిన రోజుగా మార్చారు. అనంతరం కుటుంబ సభ్యుల మధ్య బర్త్డే కేక్ కట్చేసింది. దీపావళి క్రాకర్స్ కాల్చి న ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది. అనంతరం దగ్గర్లోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రెక్కాడితే కాని డొక్క నిండని వారి పరిస్థితిపై చలించిన ఆర్గనైజేషన్ డెరైక్టర్ గౌతమ్లు సహన అక్కయ్యలు మేఘన, సంధ్యరాణి బాధ్యతలను తీసుకున్నారు. వారి చదువుతోపాటు సర్వ నీడీ ఫౌండేషన్లోనే ఉండేందుకు వారికి రూంను ఏర్పాటు చేశారు. సహన ఆపరేషన్ అనంతరం తమ వద్దకు వస్తే ఆశ్రయం కల్పించి, విద్యాబుద్ధులు నేర్పుతామని హామీ ఇచ్చారు ఆర్గనైజేషన్ నిర్వహకుడు వెంకట్ రామరెడ్డి. సహన పుట్టిన రోజు వేడుకల్లో ఆమె కుటుంబసభ్యులతో పాటు ఆర్గనైజేషన్ నిర్వహకులు లలిత, అనుప, హిందు పాల్గొన్నారు.