
విద్యాసాగర్ రావు కన్నుమూత
ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు, తెలంగాణ ప్రభుత్వ సాగునీటి సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావు కన్నుమూశారు. ఎక్స్టెన్సివ్ మెటస్టాటిక్ బ్లాడర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఉదయం 11.23 గంటలకు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గత కొంత కాలంగా గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమంగానే ఉండటంతో కొన్నాళ్లుగా వెంటిలేటర్ మీద ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొని, సాగునీటి విషయంలో రాష్ట్రం ఆవశ్యకత గురించి ఆయన ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఆయన అత్యంత సన్నిహితులు. ఇటీవలే ఆయనను కేసీఆర్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. 'విద్యన్నా.. నేను కేసీఆర్ను' అంటూ పలకరించారు.
సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ)లోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించి రిటైరైన విద్యాసాగర్ రావు.. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆయనను కేసీఆర్ సర్కారు సాగునీటి ముఖ్య సలహాదారుగా నియమించింది. కాగా విద్యాసాగర్ రావు రెండేళ్లుగా కేన్సర్తో బాధ పడుతున్నారు. ఏడాది క్రితం అమెరికాకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. తిరిగి నగరానికి వచ్చినతర్వాత కూడా ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. దాంతో ఈనెల 22న గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్చి అప్పటినుంచి కీమోథెరపీ అందించారు. అయినా ఫలితం లేకపోయింది.