![Minister KTR Participates in Swachh Survekshan 2018 at Bagh Lingampally - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/12/Swachh-Survekshan.jpg.webp?itok=Zd1OJhUm)
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఖాతాలో మరో రికార్డు నమోదైంది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్వచ్చ సర్వేక్షన్ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా బాగ్ లింగంపల్లిలో సోమవారం 15 వేల మందితో రోడ్లను ఊడ్చి, స్వచ్ఛతకై పది సూత్రాల ప్రతిజ్ఞ నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛభారత్లో భాగంగా గుజరాత్లోని వడోదర మున్సిపల్ కార్పొరేషన్ గత ఏడాది మే నెలలో 5,058 మంది విద్యార్థులతో రోడ్లను రికార్డు సృష్టించింది.
ఇప్పుడు జీహెచ్ఎంసీ ఆ రికార్డును బ్రేక్చేసింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వివేక్, కార్పొరేటర్ శ్రీనివాస్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. వివిధ కళాశాలల నుంచి వేలాదిగా విద్యార్థులు తరలివచ్చారు. జీహెచ్ఎంసీ కార్మికులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
నగరాన్ని అగ్రస్థానంలో ఉంచుదాం
కేటీఆర్ మాట్లాడుతూ స్వచ్చ సర్వేక్షన్ 2017 లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందన్నారు. మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్వచ్చ భారత్ మొదలు కాకముందే తెలంగాణ సీఎం నగరాన్ని నాలుగు వందల యూనిట్లుగా చేసి స్వచ్చ కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. తడి, పొడి చెత్తను వేరుచేయడం కోసం 45 లక్షల చెత్త బుట్టలు పంపిణీ చేసామన్నారు. నగరం బాగుంటనే మనమంతా బాగుంటమన్నారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏది సాద్యం కాదని.. స్వచ్చ సర్వేక్షణలో అందరు పాల్గొని నగరాన్ని అగ్రస్థానంలో ఉంచాలని కేటీఆర్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment