swachh bharat
-
అతిపెద్ద ప్రజా ఉద్యమం
న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ మిషన్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. 21వ శతాబ్దంలో అతిపెద్ద, అత్యంత విజయవంతమైన ప్రజా ఉద్యమం స్వచ్ఛ భారత్ అని స్పష్టంచేశారు. ప్రజా ఆరోగ్యం, ప్రజా సంక్షేమంపై ఈ కార్యక్రమం ఎనలేని ప్రభావం చూపిందని అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమై పదేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. చీపురు చేతబట్టి చిన్నారులతో కలిసి పరిసరాలు శుభ్రం చేశారు. స్వచ్ఛభారత్లో ప్రజల భాగస్వామ్యం దేశానికి సౌభాగ్యాన్ని చేకూర్చే సరికొత్త మార్గంగా రూపాంతరం చెందిందని ప్రశంసించారు. ప్రజల చొరవతోనే ఈ కార్యక్రమం విజయవంతం అయ్యిందన్నారు. సేవా పఖ్వాడాలో భాగంగా కేవలం 15 రోజుల్లో 27 లక్షలకుపైగా స్వచ్ఛతా వేడుకలు జరిగాయని, 28 కోట్ల మందికిపైగా జనం భాగస్వాములయ్యారని తెలిపారు. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించారని వివరించారు. నిరంతర ప్రయత్నాలే మన దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతాయని తేల్చిచెప్పారు. మరో వెయ్యి సంవత్సరాల తర్వాత అప్పటి మనషులు 21వ శతాబ్దం నాటి భారతదేశం గురించి మాట్లాడుకుంటే, అందులో స్వచ్ఛ భారత్ ప్రస్తావన తప్పనిసరిగా ఉంటుందని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్, అమృత్ 2.0 మిషన్ల కింద రూ.10,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. ఇందులో తాగునీరు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. -
ఎటు చూసినా చెత్తే..!
సాక్షి, హైదరాబాద్: పారిశుధ్యానికి కేంద్రం ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. స్వచ్ఛభారత్ పేరుతో దేశవ్యాప్తంగా ఈ మేరకు చర్యలు చేపట్టి అమలు చేస్తోంది. నిత్యం లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే రైళ్ల విషయంలోనూ ‘స్వచ్ఛతా పక్వారా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ ప్రయాణికుల్లోనే మార్పు రావటం లేదని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని పక్షం రోజుల పాటు రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిసరాలు, వర్క్షాపులు, రైల్వే ఉద్యోగులు నివాసం ఉండే కాలనీల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించారు. పక్షం రోజుల్లో ఏకంగా 544 టన్నుల చెత్త పోగవడం చూసి అధికారులు నివ్వెరపోయారు. పారిశుధ్యంపై రైల్వే ప్రత్యేక దృష్టి గత కొంతకాలంగా రైళ్లు, రైల్వే స్టేషన్లలో చాలా మార్పులు సంతరించుకుంటున్నాయి. అధునాతన రైళ్లతో పాటు స్టేషన్లలో అన్నిరకాల వసతులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటున్నాయి. రైళ్లు, స్టేషన్లు పరిశుభ్రంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా ఆదేశించారు. అంతేగాక స్వయంగా చీపురు పట్టి స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో రైల్వే అధికారులూ అప్రమత్తంగా ఉంటున్నారు. స్టేషన్లను శుభ్రపరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా, ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించి క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా చూస్తున్నారు. రైళ్లలో కూడా శుభ్రపరిచే సిబ్బందిని ఉంచి, ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రాకముందే క్లీన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రయాణికుల నుంచి మాత్రం దీనికి ఎలాంటి సహకారం లభించడం లేదని రైళ్లు, స్టేషన్లలో దర్శనమిచ్చే చెత్త స్పష్టం చేస్తోంది. పట్టించుకోని ప్రయాణికులు కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు, మిగిలిపోయిన తినుబండారాలు, కాఫీ/టీ కప్పులు, భోజన ప్యాకెట్లు, విస్తరాకులు.. ఇలాంటి వాటన్నిటినీ ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ విసిరేస్తున్నారు. దీంతో రైళ్లు, రైల్వే స్టేషన్లు, పరిసరాలు చెత్తతో నిండిపోతున్నాయి. సిబ్బంది ఎన్నిసార్లు శుభ్రం చేసినా మళ్లీ చెత్త పోగవుతోంది. ఇటీవల పక్షం రోజుల పాటు 639 రైల్వే స్టేషన్లు, 180 రైళ్లలో స్వచ్ఛతా పక్వారా కార్యక్రమాలను అధికారులు నిర్వహించారు. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో చెత్త వేసేందుకు ప్రత్యేకంగా డస్ట్బిన్లు ఉన్నా, విచ్చలవిడిగా చెత్త విసురుతున్నట్టు అధికారులు గుర్తించారు. మొత్తం 544 టన్నుల చెత్తను పోగేసిన అధికారులు.. చెత్తను విసురుతూ పట్టుబడ్డ 857 మంది నుంచి రూ.4.5 లక్షల జరిమానా వసూలు చేశారు. 21,685 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. పోగైన చెత్తలో 42 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలుండటం విశేషం. ఇక రైల్వే ప్రాంగణాల్లో 436 టన్నుల తుక్కును సేకరించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్తగా చెత్త కుండీలను ఏర్పాటు చేశారు. 3,510 కి.మీ. నిడివిగల ట్రాక్ను కూడా ఈ సందర్భంగా శుభ్రం చేశారు. అయితే స్వచ్ఛతా పక్వారా పేరుతో ఎప్పుడో ఓసారి నిర్వహించే కార్యక్రమాలతో ఫలితం అంతగా ఉండదని, రైళ్లు, రైల్వే స్టేషన్లలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ చెత్త వేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, వారికి కౌన్సెలింగ్ ఇవ్వటం ద్వారా మార్పు తెచ్చేందుకు ప్రయతి్నంచాలనే సూచనలు వస్తున్నాయి. -
స్వచ్ఛ భారత్లో మరోసారి తెలంగాణ సత్తా
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ప్రకటిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. రెండు వేర్వేరు విభాగాల్లో మొదటి మూడు స్థానాలకుగాను రెండు స్థానాలు సాధించి దేశంలోనే నంబర్వన్గా మళ్లీ నిలిచింది. 2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి, స్వచ్ఛ భారత్ మిషన్ ఎంపిక చేసిన రెండు విభాగాల్లోనూ తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. స్టార్ త్రీ విభాగంలో తెలంగాణలోని సిద్దిపేట జిల్లా, జగిత్యాల జిల్లాలు దేశంలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. మూడో స్థానంలో కేరళలోని కొట్టాయం జిల్లా నిలిచింది. స్టార్ ఫోర్ విభాగంలో తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా, 2వ స్థానంలో మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లా నిలవగా, 3వ స్థానాన్ని తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా దక్కించుకుంది. గతంలోనూ స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రకటించిన ప్రతి అవార్డు విభాగంలోనూ తెలంగాణ మొదటి మూడు స్థానాల్లో నిలిచింది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అనేక అవార్డులు సాధించింది. మంగళవారం హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. నిధులు ఇవ్వకున్నా, అవార్డులు ఇస్తున్నందుకు కేంద్రానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. పల్లెప్రగతి వంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే ఈ అవార్డులు దక్కుతున్నాయన్నారు. ఈ అవార్డులు రావడంలో ఉన్నతాధికారుల నుంచి గ్రామ సిబ్బంది వరకు అందరి కృషి ఉందని కొనియాడారు. కాగా, అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కె గ్రామ సర్పంచ్ మీనాక్షికి మార్చి 4న ఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు అందజేస్తారని ఎర్రబెల్లి తెలిపారు. -
స్వచ్ఛ అవార్డుతో అభివృద్ధికి బాటలు
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, నగరాలలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు.. ప్రజల్లో అవగాహన కల్పించే పట్టణాలు, నగరాలకు స్వచ్ఛతా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అందులో భాగంగా పొదిలి నగర పంచాయతీ జాతీయ స్థాయి అవార్డు అందుకుంది. దీంతో స్వచ్ఛ పొదిలి దిశswachh awardsగా మరిన్ని చర్యలు తీసుకునేందుకు నిధుల లభ్యత కలగనుంది. పొదిలి(ప్రకాశం జిల్లా): నగర పంచాయతీగా ఉన్న పొదిలికి స్వచ్ఛ పురస్కారం వరించింది. సుమారు 40 వేల జనాభా, 20 వార్డులతో ఉన్న నగర పంచాయతీలో 12 వేల గృహాలు ఉన్నాయి. మేజర్ పంచాయతీ నుంచి 2021లో నగర పంచాయతీగా అప్గ్రేడ్ అయిన పట్టణంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఏటా రూ.1.30 కోట్ల ఇంటి పన్నుల డిమాండ్ ఉంది. ప్రత్యేక కేటగిరీలో అవార్డు: స్వచ్ఛత లీగ్లో భాగంగా ప్రత్యేక కేటగిరీలో పొదిలి జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికైంది. 15 వేల జనాభా విభాగం కింద అవార్డు ఇచ్చారు. గత నెల 30వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కౌశల్ కిషోర్ చేతుల మీదుగా నగర పంచాయతీ కమిషనర్ డానియేల్ జోషెఫ్ అవార్డు అందుకున్నారు. జాయిన్ ద ఫైట్ ఫర్ గార్బేజ్ సిటీస్ నినాదంతో ముందుకు సాగేందుకు అవార్డు ఉపకరిస్తుంది. టీమ్కు నచ్చటంతోనే సర్వే ప్రారంభం: పట్టణంలో పారిశుధ్య పనులు ఊపందుకున్నాయి. నగరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. ఈక్రమంలో ఇంటింటికీ చెత్తబుట్టల పంపిణీ, పరిశుభ్రతపై నిర్వహించే అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేకంగా ఆగస్టులో నిర్వహించిన స్వచ్ఛత మహోత్సవ ర్యాలీలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారు. దీంతో కేంద్రం నుంచి వచ్చిన టీమ్ సభ్యులు సర్వే ప్రారంభించారు. నిబంధనల మేర అన్నీ జరుగుతున్నాయని టీమ్ సభ్యులు ఇచ్చిన నివేదికల ఆధారంగా నగర పంచాయతీకి అవార్డు వరించింది. నీటి సమస్య తీర్చాలనే లక్ష్యంతో... నగర పంచాయతీ పరిధిలో మంచినీటి సమస్య తీర్చాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సాగర్ నీరు పెద్ద చెరువుకు చేర్చి, దాని ద్వారా ఇంటింటికీ కొళాయిల ద్వారా పంపిణీ చేయనున్నారు. దీని కోసం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయటంతోపాటు, నీటి కేటాయింపులు కూడా పూర్తయ్యాయి. శుద్ధీకరణ ప్లాంట్ల ఏర్పాటు దిశగా... కాలుష్య నివారణ, నీరు కలుషితం కాకుండా చేయటానికి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉద్యమంగా జరుగుతోంది. ఎస్టీపీ, ఎఫ్ఎస్టీపీ కేంద్రాలు ఏర్పాటు చేయటానికి అవకాశాలపై టీం సభ్యులు సర్వే నిర్వహించారు. సీవేజ్ ట్రాన్స్పోర్ట్ ప్లాంట్ (ఎస్టీపీ) ఏర్పాటు చేయటం ద్వారా మురుగునీటిని శుద్ధి చేస్తారు. మరో వైపు ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ ద్వారా మల, మూత్రాలను ఒకే చోటికి చేర్చి శుద్ధీకరణకు ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. అయితే ఇవి ఏర్పాటుకు మురుగునీరు, మలం రెండు వేరు వేరుగా ఒకే చోటకు చేరే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసేందుకు టీమ్ చేసిన సర్వేలో అనువుగా ఉందని గుర్తించటంతో ప్లాంట్ల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. దీని ఏర్పాటుకు కోట్ల రూపాయల నిధులు మంజూరవుతాయి. అభివృద్ధి లక్ష్యంతో సమన్వయంతో పనిచేస్తున్నారు నగర పంచాయతీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సమన్వయంతో అందరూ పనిచేస్తున్నారు. తొలి ప్రాధాన్యతగా మంచినీటి సమస్య పరిష్కారం కోసం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయించుకున్నాం. మరో వైపు నగర పంచాయతీ కార్యాలయం భవనాల కోసం స్థల పరిశీలన తుది దశకు చేరుకుంది. సీపేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేస్తున్నాను. శుద్ధీకరణ ప్లాంట్లు ఏర్పాటు దశకు వస్తాయి. అన్ని విధాలుగా నగర పంచాయతీ అభివృద్ధి చేసేందుకు అవసరమైన పథకాలను, నిధులు మంజూరు చేయిస్తాం. – కేపీ.నాగార్జునరెడ్డి, ఎమ్మెల్యే. అవార్డుతో అభివృద్ధికి బాటలు జాతీయ అవార్డు అందుకోవటం ఆనందంగా ఉంది. ప్రతి విషయంలోనూ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి ప్రోత్సాహంతోనే అవార్డుకు అర్హత సాధించాం. దీని వల్ల పట్టణానికి భవిష్యత్లో ఎంతో మేలు జరుగుతుంది. శుద్ధీకరణ ప్లాంట్లు కార్యరూపం దాల్చితే కోట్ల నిధులు రావటంతో పాటు, కాలుష్యం లేకుండా పోతుంది. ప్రస్తుతానికి కంపాక్ట్ వాహనం (8 టన్నుల చెత్తను రవాణా చేసే వాహనం) అందిస్తారు. దీంతో పాటు చెత్త రవాణా కోసం అవసరమైన వాహనాలను సమకూర్చుతారు. ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, నగర పంచాయతీ అధికారులు, పారిశుధ్య కార్మికులు అందరికీ కృతజ్ఞతలు. – డానియేల్ జోషెఫ్, కమిషనర్ -
మూడు పట్టణాలకు ‘స్వచ్ఛత’ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మరో మూడు పట్టణాలకు స్వచ్ఛత అవార్డులు దక్కాయి. ఇండియన్ స్వచ్ఛత లీగ్ (ఐఎస్ఎల్) పోటీల్లో రాష్ట్రంలోని పీర్జాదిగూడ, కోరుట్ల, అలంపూర్ పట్టణాలు ఈ అవార్డులు సాధించాయి. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి రూపా మిశ్రా రాష్ట్రానికి సమాచారం ఇచ్చారు. ఈ నెల 17న ఐఎస్ఎల్ పోటీని నిర్వహించగా, దేశంలోని 1,850 పట్టణాలు ఇందులో పాల్గొన్నాయి. వీటిలో తెలంగాణకు మూడు అవార్డులు రాగా, ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్ కింద వచ్చిన 16 అవార్డులతో కలిపి రాష్ట్రానికి మొత్తం 19 అవార్డులు దక్కినట్లయింది. ఐఎస్ఎల్ పోటీల్లో భాగంగా అన్ని పట్టణాలు తాము చేపట్టిన ఫ్లాగ్ రన్, పరిశుభ్రంగా మార్చిన ప్రదేశాలు, చారిత్రక, జియోగ్రాఫికల్ ప్రదేశాలు, ర్యాలీలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు సమర్పించారు. మూడు కేటగిరీల్లో అవార్డులు జనాభా ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా జరిగిన పోటీలో 15వేల లోపు జనాభా గల పట్టణాల కేటగిరీలో అలంపూర్ అవార్డుకు ఎంపికైంది. 25 వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న కేటగిరీలో కోరుట్ల ఎంపికయ్యాయి. ఈ మూడు పట్టణాలకు ఈ నెల 30న ఢిల్లీలోని టల్కటోరా స్టేడియంలో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డులు పొందిన పీర్జాదిగూడ, కోరుట్ల, అలంపూర్ పురపాలికలకు మంత్రి కె.తారకరామారావు అభినందనలు తెలిపారు. కేంద్రం నుంచి సహకారం లేకపోయినా... కేంద్రం నుంచి సహకారం లేకపోయినా తెలంగాణ అవార్డులు సాధించిందని మంత్రి అన్నారు. కాగా దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు, అభివృద్ధి చేస్తున్న సీఎంలకు సహకరిస్తే దేశం బాగుపడుతుందన్నారు. అధికారం శాశ్వతం కాదని... అధికారం ఉన్నపుడు మంచి చేస్తే చరిత్రలో నిలుస్తారన్న విషయం బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రానికి అవార్డులకు బదులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. -
ఆ దేశాలతోనే పర్యావరణానికి ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులకు, భారీగా కర్బన ఉద్గారాల విడుదలకు సంపన్న దేశాలే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. భూమిపైనున్న సహజ వనరుల్ని విపరీతంగా దోపిడీ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున కర్బన ఉద్గారాలు ఆ దేశాల నుంచే విడుదల అవుతున్నాయన్నారు. వాతావరణ మార్పుల్లో భారత్ ప్రమేయాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదని అన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ , నమామి గంగ, ఒకే సూర్యుడు–ఒకే ఇంథన వ్యవస్థ వంటి పథకాలతో బహుహుఖంగా పర్యావరణ పరిరక్షణకు భారత్ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రపంచపర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం సద్గురు జగ్గీ వాసుదేవ్ ఏర్పాటు చేసిన మట్టిని కాపాడుకుందాం ఉద్యమంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. సారవంతమైన మట్టిపై భారత్ రైతుల్లో అవగాహన అంతగా లేదన్న ప్రధాని సాయిల్ హెల్త్ కార్డుల్ని ఇవ్వడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని మోదీ తెలిపారు. ముందుగానే లక్ష్యాలను చేరుకున్నాం పర్యావరణ పరిరక్షణ కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను మనం ముందే సాధించామని ప్రధాని చెప్పారు. పెట్రోల్లో 10శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని గడువు కంటే అయిదు నెలల ముందే సాధించినట్టు ప్రకటించారు. శిలాజేతర ఇంధనాల ద్వారా 40 శాతం విద్యుత్ ఉత్పత్తిని డెడ్లైన్ కంటే తొమ్మిదేళ్లు ముందే సాధించామని తెలిపారు. ‘సేవ్ సాయిల్ మూవ్మెంట్’ ద్వారా నేలలో సారం క్షీణించడంపై అవగాహన పెంచడానికి, సారాన్ని మెరుగుపరచడానికి ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్ చేపట్టిన ప్రపంచ వ్యాప్త ఉద్యమాన్ని ప్రధాని అభినందించారు. మట్టిని రక్షిస్తేనే జీవ మనుగడ: జగ్గీ వాసుదేవ్ మట్టిని రక్షిస్తేనే జీవ మనుగడ సాధ్యమని ఈషా ఫౌండేషన్ సద్గురు జగ్గీ వాసుదేవ్ తెలిపారు. భవిష్యత్తు తరాల కోసం మట్టిని రక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని చెప్పారు. లైఫ్స్టైల్ ఉద్యమం ప్రారంభం పర్యావరణహితంగా మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి ఉద్దేశించిన లైఫ్స్తైల్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ (లైఫ్) ఉద్యమాన్ని ప్రధాని ప్రారంభించారు. పర్యావరణాన్ని కాపాడడానికి తమ వంతుగా లైఫ్స్టైల్ మార్చుకుంటే వారిని ప్రోప్లానెట్ పీపుల్ అని పిలుస్తారని అన్నారు. మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ మాట్లాడుతూ.. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో భారత్ చర్యలు స్ఫూర్తిదాయకమన్నారు. వాతావరణ మార్పుల నివారణతోపాటు వాతావరణ లక్ష్యాల సాధనలో భారత్ పాత్ర, నాయకత్వం చాలా కీలకమైందని బిల్గేట్స్ పేర్కొన్నారు. -
చెత్తకు యూజర్ చార్జీ కొత్తకాదు
సాక్షి, అమరావతి: చెత్త సేకరణకు యూజర్ చార్జీలు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయడం లేదు. గతం నుంచి ఈ యూజర్ చార్జీల వసూళ్లు కొనసాగుతున్నాయి. పట్టణాల్లో ఘనవ్యర్థాల సమస్యకు పరిష్కారం కోసం 2014 అక్టోబర్లో స్వచ్ఛభారత్ మిషన్ను కేంద్రం ప్రారంభించింది. ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. పెరిగిపోతున్న ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేసేందుకు, పరికరాల నిర్వహణకు ప్రజల నుంచి వినియోగ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఇంటింటి చెత్త సేకరణ కోసం స్థానిక పాలన సంస్థలు యూజర్ చార్జీ వసూలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను 2016 సెప్టెంబర్లో ఆదేశించింది. కేంద్రం అమలు చేస్తున్న స్వచ్ఛ కార్యక్రమాలకు నిధులు కావాలంటే ‘వినియోగ రుసుం’ తప్పనిసరని చెప్పింది. దీంతో ఆనాటి టీడీపీ ప్రభుత్వం ప్రజల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయడం ప్రారంభించింది. గుంటూరులో 2015లో అమలు వీధుల్లో పారిశుధ్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు, ఇళ్ల నుంచి ప్రతిరోజు చెత్త తరలింపు వంటి పనులకోసం గుంటూరు నగరంలోని దుకాణాలు, థియేటర్లు, ప్రైవేట్ హాస్టళ్లు, ఫంక్షన్హాళ్లు, సూపర్ మార్కెట్లు, టీస్టాళ్ల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలని ఆ నగరపాలక సంస్థ 2015 ఏప్రిల్లో తీర్మానించింది. సముదాయం విస్తీర్ణం, అక్కడ ఉండే జనాభాను బట్టి గరిష్టంగా రూ.6 వేలు, కనిష్టంగా రూ.200 వసూలు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ)లో 2018 డిసెంబర్ నుంచి యూజర్ చార్జీల వసూలు ప్రారంభించారు. ప్రతి ఇంటి నుంచి నెలకు రూ. 50 చొప్పున, వాణిజ్య సముదాయాలైతే రూ. 5 వేలు, ఇతర సంస్థల నుంచి రూ. 1,500 వసూలు చేశారు. ఇతర రాష్ట్రాల కంటే మనకే తక్కువ చార్జీలు గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రతి ఇంటికి రోజుకు తొలుత రూ.3 చొప్పున వసూలు చేయగా ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 5కు పెంచారు. ఇండోర్లోను ప్రతి ఇంటికీ నెలకు రూ. 150 వరకు వసూలు చేస్తున్నారు. వాణిజ్య సముదాయాలకు సైతం ఏపీ కంటే ఆయా రాష్ట్రాల్లో అధికంగా చార్జీలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. రోజుకు ఇంటికి రూ.1 మాత్రమే.. ఘన వ్యర్థాల సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ రాష్ట్రాలు వినియోగ రుసుంను వసూలు చేస్తున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్లో ప్రజలపై భారం పడకుండా 2021 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ప్రారంభించిన ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’ (క్లాప్) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నామమాత్రపు రుసుం వసూలు చేయాలని నిర్ణయించారు. దారిద్య్రరేఖకు దిగువున ఉన్న ప్రజల నుంచి నెలకు రూ. 30, దారిద్య్రరేఖకు పైన ఉన్న వారి నుంచి మున్సిపల్ కార్పొరేషన్లలో రూ. 90, స్పెషల్/ సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీల్లో రూ. 60 చొప్పున, నగర పంచాయతీల్లో రూ. 30 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. దుకాణాలు, ఫంక్షన్ హాళ్ల స్థాయిని బట్టి రూ. 150 నుంచి ఆ పైన చార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, క్లాప్ కార్యక్రమం గత ఏడాది అక్టోబర్లో ప్రారంభించినా.. తొలుత ప్రజలకు ఇంటింటి చెత్త సేకరణపై అవగాహన కల్పించి, మెరుగైన సేవలతో ఫలితాలను చూపించిన అనంతరం గత ఏడాది డిసెంబర్ నుంచి చార్జీల వసూలు ప్రారంభించారు. అదీ మొత్తం 123 మున్సిపాలిటీల్లో తొలి విడతగా పూర్తిస్థాయిలో చెత్త సేకరణ వాహనాలను అందించిన 17 మున్సిపాలిటీల నుంచే ఈ వసూళ్లు చేపట్టారు. ఈ విధంగా నాలుగు నెలల్లో ఆయా మున్సిపాలిటీల నుంచి సుమారు రూ. 12 కోట్లు వసూలైంది. -
పథకాలకు ప్రాచుర్యంలో... మీడియాది కీలకపాత్ర
కోజికోడ్: రాజకీయాలకు అతీతంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడంలో మీడియాది కీలకపాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. దేశ 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుగుతున్న సందర్భంగా స్వాతంత్య్ర సమరంలో ఇప్పటిదాకా పెద్దగా వెలుగులోకి రాని ఘట్టాలను, స్ఫూర్తిదాయకమైన స్వాతంత్య్ర యోధుల జీవిత విశేషాలను ప్రచురించాలని మీడియాకు సూచించారు. ప్రముఖ మలయాళ పత్రిక మాతృభూమి శతాబ్ది ఉత్సవాలను మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మంచి పథకాల రూపకల్పనతో పాటు వాటి గురించి సమాజంలోని అన్ని వర్గాలకు తెలిసేలా చేయడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా అన్నారు. ఈ పాత్రను మీడియా అత్యంత సమర్థంగా పోషించిందన్నారు. ‘‘స్వాతంత్య్ర సమరంలో చిన్న గ్రామాలు, పట్టణాలూ పాల్గొన్నాయి. వాటి గురించి అందరికీ తెలిసేలా కథనాలు ప్రచురించి దేశ ప్రజలంతా ఆ గ్రామాలకు వెళ్లేలా చేయాలి’’ అని మీడియా సంస్థలకు ప్రధాని సూచించారు. హోలీ శుభాకాంక్షలు న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందాల్ని నింపాలని ఆకాంక్షిస్తున్నానని ట్విట్టర్లో మోదీ అన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తదితరులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. -
చెత్తే బంగారమాయనె!
చెత్తే కదా అని నిర్లక్ష్యం చేయలేదు.. ఆ చెత్త నుంచే ఆదాయం గడించడంపై దృష్టిసారించారు. రోజూ వెలువడే వ్యర్థాల ద్వారా సంపద సృష్టిస్తున్నారు. కిలో పొడి చెత్త రూ.2 చొప్పున విక్రయిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ గత ఏడాది డిసెంబర్ నుంచి డ్రై వేస్ట్ ప్లాంట్ను తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. దశాబ్దాల నుంచి గత యంత్రాంగం చెత్తను నిర్లక్ష్యం చేసింది. తాజా నిర్ణయంతో పొడిచెత్త బంగారంలా అమ్ముడుపోతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నగరం జనాభా సుమారు 4 లక్షలకు పైమాటే. రోజూ 60 నుంచి 80 వేల మంది యాత్రికులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రముఖ యాత్రాస్థలం కావడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార కేంద్రాలు వెలిశాయి. ఈ క్రమంలో తిరుపతి నగరంలో ప్రతిరోజూ 197 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇందులో 123 టన్నుల తడిచెత్త(కూరగాయల వ్యర్థాలు, హోటల్ వేస్ట్తో కలపి) కాగా పొడి చెత్త 50 టన్నుల వరకు ఉత్పత్తి అవుతోంది. భవన నిర్మాణ వ్యర్థాలు ప్రతిరోజు 25 టన్నుల వరకు ఉంటున్నాయి. ఈ చెత్త నిర్వహణకు రేణిగుంట సమీపంలోని తూకివాకం గ్రీన్సిటీలో అనేక ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి. తడిచెత్త నుంచి బయోగ్యాస్, సేంద్రియ ఎరువులు తయారు చేస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు. ఇటీవల భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ను ప్రారంభించారు. గత ఏడాది డిసెంబర్లో పొడిచెత్త నిర్వహణ ప్లాంట్ను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించగా.. అనతికాలంలోనే ఈ ప్లాంట్ కాసుల వర్షం కురిపిస్తోంది. చెత్తనిర్వహణలో అగ్రస్థానం కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన జీవనాన్ని కల్పించేందుకు 2016లో స్వచ్ఛభారత్ మిషన్ను ప్రారంభించింది. 2017 నుంచి నగరాల మధ్య స్వచ్ఛపోటీలను నిర్వహిస్తూ వివిధ అంశాల్లో జాతీయ, రాష్ట్రస్థాయి ర్యాంకులు ప్రకటిస్తూ ప్రోత్సాహకం అందిస్తోంది. స్వచ్ఛతలో టాప్–3లో మెరవగా చెత్తనిర్వహణలో తిరుపతి జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గడిచిన మూడేళ్లుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో తిరుపతి తన పరపతిని కొనసాగిస్తూ అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఇక్కడి అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు, పటిష్టమైన నిర్వహణ వ్యవస్థలతో తిరుపతికి జాతీయ స్థాయిలో కీర్తికిరీటాన్ని తెచ్చిపెట్టాయి. దశాబ్దాలుగా నిర్లక్ష్యం తిరుపతి మున్సిపాలిటీ 1886లో ఏర్పాటైంది. 2007లో మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయ్యింది. పురపాలక సంఘంగా ఏర్పాటై 136 ఏళ్లు పూర్తిచేసుకుంది. గడిచిన దశాబ్దాల నుంచి తిరుపతిలో ఉత్పత్తి అయ్యే చెత్తను పూడ్చిపెట్టడం, కాల్చడం, ఆపై రామాపురం డంపింగ్ యార్డుకు తరలించారు. గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల మేరకు స్వచ్ఛభారత్ మిషన్ చెత్తను పూడ్చిపెట్టడం, తగలపెట్టడాన్ని నిషేధించింది.ఈ క్రమంలో చెత్త నిర్వహణపై అడుగులు పడ్డాయి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సరికొత్తగా ఆలోచించి చెత్త నుంచి సంపదను సృష్టించడంపై దృష్టిసారించింది. కిలో 2 రూపాయలు తిరుపతి నగరంలో ఉత్పత్తి అయిన చెత్త బంగారంలా అమ్ముడుపోతోంది. ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే చెత్త నుంచి 50 టన్నుల మేర పొడి చెత్త వేరుచేస్తున్నారు. ఈ చెత్తను డ్రైవేస్ట్ ప్లాంట్కు తరలించి సెగ్రిగేషన్ చేస్తున్నారు. ఈచెత్తను కొనుగోలు చేసేందుకు వివిధ సంస్థలు ముందుకు రాగా బెంగళూరుకు చెందిన ఎంఎం ట్రేడర్స్ కిలో చెత్తను రూ.2కు కొనేందుకు ముందుకొచ్చింది. రోజూ 50 టన్నుల చెత్తను మున్సిపల్ కార్పొరేషన్ ఆ సంస్థకు విక్రయించి తద్వారా రోజుకు లక్ష రూపాయలు, నెలకు రూ.30 లక్షల ఆదాయాన్ని గడిస్తోంది. ఏడాదికి రూ.3.6 కోట్ల ఆదాయాన్ని పొందనుంది. ప్లాంట్ నిర్వహణకు ఖర్చుచేసిన రూ. 8 కోట్లను కేవలం రెండు సంవత్సరాల, రెండు నెలల్లోనే ఆర్జించనుంది. ఆపై పూర్తిగా ఆదాయం తెచ్చిపెట్టనుంది. తొలిసారిగా ఆదాయం గడిచిన మూడు నెలలుగా పొడి చెత్త నుంచి రోజూ లక్ష ఆదాయం అందుతోంది. చెత్తను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేస్తున్నాం. దేశంలో ఎక్కడాలేని చెత్తనిర్వహణ ఒక్క తిరుపతిలోనే పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశాం. చెత్తను అనేక రకాలుగా రెడ్యూజ్, రీ యూజ్, రీసైకిల్ చేస్తూ తద్వారా రోజూ లక్షల్లో ఆదాయం సమకూరుస్తున్నాం. – పీఎస్ గిరీష, కమిషనర్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ వందశాతం నిర్వహణ టిప్పర్ల ద్వారా తరలించే ఈ చెత్తను కాటా వేసి విక్రయిస్తాం. కొనుగోలు చేసిన ట్రేడర్స్ అందులో నుంచి ప్లాస్టిక్, ఐరన్, గాజు,వుడ్,టైర్, స్టోన్ వంటి వాటిని వేరుచేసి బయట ప్రాంతాల్లో విక్రయిస్తోంది. కార్పొరేషన్కు ప్రతి కిలో చెత్తకు 2రూపాయలు జమ చేస్తోంది. ప్లాంట్ నిర్వహణలో 100 మందికి ఉపాధి దొరికింది. – ఎ.విజయ్కుమార్రెడ్డి, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ -
స్వచ్ఛ సర్వేక్షణ్లో ఏపీకి అవార్డుల పంట
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో ఏపీ మరోసారి సత్తా చాటింది. స్వచ్ఛ సర్వేక్షన్–2021 వివిధ విభాగాల్లో రాష్ట్రానికి 11 అవార్డులు దక్కాయి. పట్టణ, నగర ప్రాంత ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడంలో భాగంగా పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై సీఎం వైఎస్ జగన్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’ (క్లాప్) వంటి కార్యక్రమాన్ని చేపడుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ నేపథ్యంలో గత ఏడాది స్వచ్ఛ సర్వేక్షన్ కింద రాష్టానికి ఆరు అవార్డులు వస్తే ఈసారి ఆ సంఖ్య 11కు పెరిగింది. అలాగే, ఈ అంశంలో గత ఏడాది రాష్ట్రం 6వ స్థానంలో ఉంటే ఈ ఏడాది 5వ స్థానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది దేశంలోని పరిశుభ్ర నగరాల ర్యాంకింగ్లో విజయవాడకు 3వ ర్యాంక్, విశాఖపట్నానికి 9వ ర్యాంకు దక్కాయి. తొలిస్థానంలో ఇండోర్, రెండో స్థానంలో సూరత్ నిలిచాయి. ఈ విభాగంలో టాప్–10లో నిలిచిన దక్షిణాదికి చెందిన ఏకైక రాష్ట్రంగా కూడా ఏపీ ఘనత సాధించింది. అలాగే, చెత్త రహిత నగరాల విభాగంలో విజయవాడకు 5స్టార్ రేటింగ్, విశాఖకు 3స్టార్ రేటింగ్లు దక్కాయి. 1–3 లక్షల జనాభా విభాగంలో కడప నగరానికి 3స్టార్ రేటింగ్ వచ్చింది. ఏపీకి ప్రత్యేక గుర్తింపు వాటర్ ప్లస్ (వ్యర్థ జలాల రీసైక్లింగ్) సిటీ విభాగాన్ని ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాలు ఈ గుర్తింపు పొందాయి. ఇలా ఒక రాష్ట్రం నుంచి ఒకటి కంటే ఎక్కువ నగరాలు ఈ గుర్తింపు దక్కించుకున్న ఏపీ జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు దేశంలోనే 3వ పరిశుభ్ర నగరంగా విజయవాడ గుర్తింపు పొందడంతో ఇందుకు సంబంధించిన అవార్డును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారం ఢిల్లీలో ప్రదానం చేశారు. విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ పి. సంపత్కుమార్, విజయవాడ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్, సీఎంహెచ్ఓ డాక్టర్ జి. గీతాబాయి రాష్ట్రపతి నుంచి ఈ అవార్డు అందుకున్నారు. రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాలకు అందిన అవార్డులు.. ► సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్లో 1–10 లక్షల జనాభా విభాగంలో నెల్లూరు కార్పొరేషన్కు మొదటి ర్యాంక్ లభించింది. ► 1–3 లక్షల విభాగంలో తిరుపతికి 3వ ర్యాంక్ వచ్చింది. ► పుంగనూరు, తాడేపల్లి, పలమనేరు పట్టణాలను చెత్త రహిత నగరాల్లో 1 స్టార్ రేటింగ్ పొందాయి. ► సిటిజన్ ఫీడ్బ్యాక్ 10–40 లక్షల విభాగంలో విశాఖపట్నంకు, 1–3 లక్షల జనాభా విభాగంలో తిరుపతికి ఉత్తమ నగరాల అవార్డు లభించింది. ► సౌత్జోన్లో సిటిజన్ ఫీడ్బ్యాక్ 50వేల నుంచి ఒక లక్ష జనాభా విభాగంలో పుంగనూరు పట్టణానికి అవార్డు వచ్చింది. ► సౌత్జోన్లో ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ 50వేల నుంచి ఒక లక్ష విభాగంలో పిఠాపురం మున్సిపాలిటీకి అవార్డు దక్కింది. ► మంత్రిత్వ శాఖ కొత్తగా ప్రారంభించిన ప్రేరక్ దౌర్లో తిరుపతికి ప్లాటినం, విజయవాడ, రాజమండ్రిలకు స్వర్ణం, కడప, కర్నూలు, మదనపల్లికి రజతం.. విశాఖ, కాకినాడ, కందుకూరు, సత్తెనపల్లి మున్సిపాలిటీలకు కాంస్యం అవార్డులు దక్కాయి. చదవండి: ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. ‘స్మార్ట్’ బిల్లు నెలకు 194 కోట్లు -
భూదేవి పేట భేష్.. అభినందించిన ప్రధాని మోదీ
సాక్షి, గజపతినగరం: విజయనగరం జిల్లాలో మంచినీటి సదుపాయం, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో మండలంలోని భూదేవి పేట స్పందన కలిగిన గ్రామంగా ఎంపికైందని ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ కె.శివానంద కుమార్ తెలిపారు. శనివారం గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గ్రామంలో ఉన్న 144 కుటుంబాలకు పూర్తిగా మంచి నీటి కొళాయి కనెక్షన్ ఇచ్చామని తెలిపారు. సమావేశానికి హాజరైన డీపీఓ సుభాషిణి గ్రామాన్ని ఒకసారి పరిశీలించి పచ్చదనం పరిశుభ్రత, మంచినీటి కనెక్షన్లలో ముందంజలో ఉండడంతో భూదేవి పేట గ్రామ సర్పంచ్ కనకల ప్రవీణ, ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందిని అభినందించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూదేవి పేట గ్రామాన్ని అభినందిస్తూ చేసిన ప్రసంగాన్ని అధికారులతో పాటు గ్రామస్తులు విన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ అరుణ కుమారి, ఎంపీడీఓ కిశోర్ కుమార్ ఎంపీపీ బెల్లాన జ్ణానదీపిక, సర్పంచ్ కె.ప్రవీణ, వైఎస్సార్సీపీ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి కనకల సుబ్రహ్మణ్యం, సీనియర్ నేతలు బెల్లాన త్రినాథరావు, మండల సురేష్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: (ఈసీ గంగిరెడ్డి సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్) -
గాంధీ జయంతి రోజు స్వచ్ఛ కార్యక్రమాలతో అలరించిన నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గాంధీ జయంతి తోపాటు స్వచ్ఛ భారత్ అభియన్ 4వ వార్షికత్సవం సందర్భంగా బీచ్ క్లినింగ్ మిషన్ కార్యక్రమాలు చేపట్టింది. ఆమెకు సంబంధించిన యోలో ఫౌండేషన్ సాయంతో మిథి నది ఒడ్డున శుభ్రపరచడమే కాకా తాను చేసిన స్వచ్ఛ కార్యక్రమాల ఫోటోలతో పాటు మీరు కూడా ఈ విధంగా చేయండి అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దీంతో ఒకే రోజు రెండు ప్రత్యేకతలు సంతరించుకున్న రోజున ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలతోనే వారికి నివాళులర్పించాలంటూ నటి ఫెర్నాండ్జ్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. (చదవండి: ఎయిర్ అంబులెన్స్ కూలి నలుగురు మృతి) అంతేకాదు ఇన్స్టాగ్రాంలో మాట్లాడుతూ......"ఆమె ఈ రోజు నావంతు పని నేను స్వచ్ఛందంగా చేశాను, అలాగే మీరు మీ వంతు భాగస్వామ్యంకండి. ఈ బీచ్ క్లీన్ క్యాంప్లనూ సేవా సంస్థలు ఎల్లప్పుడూ నిర్వహిస్తారు. అందులో మీరు కూడా స్వచ్ఛందంగా పాల్గోండి. ఇప్పుడూ అందరం మన నగరాన్ని, మన దేశాన్ని మన మాతృభూమిని పరిశుభ్రంగా ఉంచుకుంటాం అని ప్రతిజ్ఞ చేయండి " అంటూ పిలుపు నిచ్చింది. (చదవండి: రెండో పెళ్లి కోసం తొమ్మిది నెలల పసికందుని 'అమ్మే'సింది) -
ఆలోచనాత్మకం సర్కార్ బడి విద్యార్థుల ‘జాగో’ షార్ట్ ఫిల్మ్
కామారెడ్డి క్రైం: స్వచ్ఛత ఫిల్మోంకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జాతీయస్థాయిలో షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల కోసం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఎక్కపల్లి పాఠశాల ఉపాధ్యాయుడు అఖిల్ ఓ లఘుచిత్రాన్ని రూపొందించారు. స్వచ్ఛ భారత్ ప్రాధాన్యం తెలుపుతూ ‘జాగో’ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించారని జిల్లా పౌరసంబంధాల శాఖాధికారి వెంకటేశ్వర్రావు తెలిపారు. చిన్నారులు నటించిన ‘జాగో’ ఈ లఘు చిత్రాన్ని పోటీలకు పంపించినట్లు చెప్పారు. పరిసరాల అపరిశుభ్రంతో తన స్నేహితుడు పాఠశాలకు రాకపోవడం అనే కథాంశంతో ఈ షార్ట్ఫిల్మ్ను తెరకెక్కించారు. డైలాగ్లు లేకున్నా ఎంతో అర్థం వచ్చేలా ఈ షార్ట్ ఫిల్మ్ ఉంది. కేఎన్ఆర్ స్టూడియోస్ నిర్మించిన ఈ షార్ట్ ఫిల్మ్ను ఆలోచింపజేస్తోంది. గ్రామస్తుల సహకారంతో ఈ లఘు చిత్రాన్ని రూపొందించారు. మీరు ఈ షార్ట్ఫిల్మ్ చూసేందుకు క్లిక్ చేయండి చదవండి: ఫైవ్స్టార్ చాక్లెట్స్తో పాఠశాలకు ఆహ్వానం చదవండి: పాలు పోయించుకుని పొమ్మన్నారు: జీతం అడిగితే పోలీస్ కేసు! -
రొటీన్గా చెయ్యాలని అనుకోవడం లేదు..
న్యూఢిల్లీ: కోవిడ్–19 విజృంభిస్తున్న ఈ సమయంలో దేశ ప్రజలందరూ కచ్చితంగా స్వచ్ఛ భారత్ పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇప్పటివరకు 62 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగిందని అయినప్పటికీ అందరూ ఈ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ప్రతీ నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో మన్కీ బాత్ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రధాని ఆదివారం 80వ ఎపిసోడ్లో మాట్లాడారు. స్వచ్ఛభారత్ అనగానే అందరికీ ఇండోర్ నగరమే మదిలోకి వస్తుందని, పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడంతో ఈ నగర ప్రజలు సంతృప్తి చెందలేదన్నారు. నీటి సంరక్షణలో కూడా అద్భుతాలు సాధించి దేశంలోనే తొలి వాటర్ ప్లస్ నగరంగా ఆవిర్భవించిందని అన్నారు. యువతరం మారుతోంది దేశంలో యువత ఏదో ఒకటి రొటీన్గా చెయ్యాలని అనుకోవడం లేదని, ఎంత రిస్క్ అయినా తీసుకుంటున్నారని ప్రధాని అన్నారు. వారి ఆలోచన దృక్పథంలో ఎంతో మార్పు వచ్చిందని, ఏదైనా సృజనాత్మకంగా చేయాలని భావిస్తున్నారని చెప్పారు. భారతదేశంలో స్టార్టప్ సంస్కృతి చాలా శక్తివంతమైనదిగా మారిందని, చిన్న నగరాల్లోని యువకులూ స్టార్టప్లను ప్రారంభిస్తున్నారని మోదీ అన్నారు. ఇది దేశ ఉజ్వల భవిష్యత్తుకు సంకేతమని తెలిపారు. టోక్యో ఒలింపిక్స్లో హాకీ టీమ్ సాధించిన విజయాన్ని ఆయన కొనియాడారు. ‘‘ఇవాళ మేజర్ ధ్యానచంద్ జయంతి. ఆయన స్మృత్యర్థం జాతీయ క్రీడాదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఒలింపిక్స్లో గెలుచుకున్న ప్రతీ పతకం ఎంతో విలువైనది. హాకీలో పతకం కొట్టగానే దేశమంతా ఉప్పొంగిపోయింది. మేజర్ ధ్యాన్చంద్జీ కూడా సంతోష పడే ఉంటారు’’అని వ్యాఖ్యానించారు. క్రీడారంగంలో యువత ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారని, స్టార్టప్ల ఏర్పాటులో తలమునుకలై ఉన్నారని కొనియాడారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుదాం భారత సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవని, యావత్ ప్రపంచం వాటికే దాసోహం అంటోందని ప్రధాని అన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. ‘‘సంస్కృతం చాలా సులభంగా.. ఎంతో తియ్యగా ఉంటుంది. విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. జాతీయ ఐక్యతను కాపాడుతుంది’’అని పేర్కొన్నారు. థాయ్లాండ్, ఐర్లాండ్ దేశాల్లో సంస్కృతానికి ప్రాచుర్యం కల్పించడానికి ఎందరో కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. -
పరిశుభ్రతలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: గ్రామాలను పూర్తి పరిశుభ్రంగా ఉంచడంలో మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. రోడ్లపై మురుగు నీరు నిలబడకుండా, చెత్తచెదారం లేకుండా చూడడం.. గ్రామస్తులందరూ వంద శాతం మరుగుదొడ్లు వినియోగించడం వంటి ఎనిమిది అంశాల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘ఓడీఎఫ్ ప్లస్’ పేరుతో స్వచ్ఛభారత్–2 కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా.. కేంద్ర ప్రమాణాలకు తగ్గట్లుగా రాష్ట్రంలో పూర్తి పరిశుభ్ర గ్రామాలుగా 680 పల్లెలను గుర్తించారు. ఇలా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,060 గ్రామాలను గుర్తించగా.. అందులో సగానికి పైగా మన రాష్ట్రంలోవే ఉండడం విశేషం. హరియాణ రెండో స్థానం దక్కించుకుంది. అక్కడ 199 గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్ ప్రమాణాలకు తగ్గట్లుగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో 89 గ్రామాలను గుర్తించగా.. తెలంగాణలో 22 గ్రామాలను గుర్తించారు. ఇక కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి దేశంలో మొత్తం 35 రాష్ట్రాలుండగా, 24 రాష్ట్రాల్లో ఒక్క గ్రామం కూడా ఈ ఘనతను సాధించలేకపోయాయి. 2020 ఏప్రిల్ నుంచి స్వచ్ఛ భారత్–2 దేశంలోని 6.03 లక్షల గ్రామాలను 2025 మార్చి నెలాఖరుకల్లా పూర్తి పరిశుభ్రత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి స్వచ్ఛభారత్–2 కార్యక్రమానికి ఓడీఎఫ్ ప్లస్ పేరుతో శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లో అమలుచేసే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చుపెట్టే నిధులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నింటినీ కలుపుకుంటూ గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్ పల్లెలుగా తీర్చిదిద్దాలని కేంద్రం సూచించింది. ఈ ప్రక్రియలో.. ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా గుర్తించడానికి ఎనిమిది అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు స్పష్టంచేసింది. అవి.. – గ్రామంలో రోడ్లపై మురుగునీరు నిలిచే పరిస్థితి ఉండకూడదు. – మురుగు కాల్వల వ్యవస్థ సక్రమంగా ఉండాలి. – గ్రామంలో కనీసం 80 శాతానికి పైగా ఇళ్ల నుంచి చెత్తను క్రమపద్ధతిలో సేకరించే కార్యక్రమం కొనసాగాలి. – ఈ ఇళ్ల నుంచి వెలువడే వృధా నీరు మురుగునీటి కాల్వలో కలిసే ఏర్పాట్లు ఉండాలి. – గ్రామంలో వినియోగించిన ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించాలి. – పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాన్నింటిలో మరుగుదొడ్లు నిర్మించాలి. – ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి సౌకర్యార్ధం గ్రామం వెలుపల కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించాలి. – పరిశుభ్రతపై గ్రామస్తులకు చైతన్యం కలిగించే కార్యక్రమాల నిర్వహణ వంటివి చేపట్టాలి. రాష్ట్రంలో ‘మనం–మన పరిశుభ్రత’ పేరుతో.. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో చిన్నచిన్న కుగ్రామాలతో కలిపి మొత్తం 18,841 గ్రామాలున్నాయి. వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు తగ్గట్లు ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా తీర్చిందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘మనం–మన పరిశుభ్రత’ పేరుతో ఒక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. విడతల వారీగా ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తోంది. తొలి విడతగా.. మండలానికి రెండేసి గ్రామాలు చొప్పున 2020 జూన్ ఒకటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1,320 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాలు అమలుచేస్తుండగా, రెండో విడతలో 4,737 గ్రామ పంచాయతీల్లో గత డిసెంబరు నుంచి శ్రీకారం చుట్టింది. స్థానికులను భాగస్వాములను చేస్తూ తొలి 15 రోజులపాటు ప్రజాచైతన్య కార్యక్రమాలు చేపట్టారు. జాయింట్ కలెక్టర్ల స్థాయి నుంచి జిల్లా అధికారులు స్వయంగా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా చైతన్య కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారు. -
స్వచ్ఛ గ్రామంగా మెట్లచిట్టాపూర్
సాక్షి, జగిత్యాల: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగమైన ఓడీఎఫ్ ప్లస్ స్టేటస్కు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్ గ్రామం అర్హత సాధించింది. గ్రామపంచాయతీ కొత్త పాలకవర్గం ఏర్పడ్డ రెండేళ్లలోనే ఈ ఘనత సాధించిన మెట్లచిట్టాపూర్ గ్రామాన్ని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ట్విట్టర్లో అభినందించారు. స్వచ్ఛభారత్లో భాగంగా చేపట్టిన పలు కార్యక్రమాలను ఈ గ్రామం నూరుశాతం అమలు చేయడంతో ఓడీఎఫ్ (ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ) ప్లస్ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చెత్త నిర్వహణలో మేటి మెట్లచిట్టాపూర్ గ్రామంలో 1,975 మంది జనాభా, 719 నివాసాలు ఉండగా, ఇక్కడ నూరుశాతం స్వచ్ఛ కార్యక్రమాలను అవలంబిస్తున్నారు. ఇంటింటికీ తడి, పొడి చెత్త సేకరణ, వర్మీ కంపోస్ట్ తయారీ ద్వారా రైతులు మొక్కలకు సేంద్రియ ఎరువును అందిస్తున్నారు. జంతువులు చనిపోయినప్పుడు వాటి కళేబరాలతో వాతావరణం, నీరు కలుషితం కాకుండా గ్రామంలో జంతువుల కోసం ప్రత్యేకంగా శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం విశేషం. లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా మురుగునీరు నిలిచిపోకుండా మ్యాజికల్ ఇంకుడు గుంతలను నిర్మించారు. ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణంతో పాటు గ్రామానికి వచ్చే సందర్శకుల కోసం కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణాన్ని చేపట్టారు. దీంతో ఈ గ్రామం స్వచ్ఛ సుందర్ సముదాయక సౌచాలయ కింద ఓడీఎఫ్ గ్రామంగా ఎంపికైంది. గ్రామస్తుల సమష్టి సహకారంతోనే.. గ్రామ పాలకవర్గం చేసిన తీర్మానాలకు గ్రామ ప్రజలందరూ సహకరిస్తున్నారు. అందరి సహకారంతోనే సామూహిక మరుగుదొడ్లు, కంపోస్ట్ యూనిట్లను నిర్మించాం. బహిరంగంగా చెత్త వేయకుండా, ప్లాస్టిక్ వినియోగించకుండా గ్రామస్తులు సహకరిస్తున్నారు. – బద్దం శేఖర్రెడ్డి, సర్పంచ్, మెట్లచిట్టాపూర్ -
స్వచ్ఛంగా.. అచ్చంగా.. మూడోసారి
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛభారత్లో తెలంగాణ మరోసారి నంబర్ వన్గా నిలిచింది. వరుసగా మూడోసారి ఈ అవార్డును దక్కించుకుని సరి కొత్త రికార్డును నమోదు చేసింది. అలాగే, జిల్లాల కేటగిరీలో కరీంనగర్ జిల్లా జాతీయ స్థాయిలో మూడో స్థానం లో నిలిచింది. ప్రతి ఏటా స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్లు, గ్రామ పంచాయతీలవారీగా అవార్డులు అందజేస్తోంది. రక్షిత తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ విభాగంలో పనితీరును మదింపు చేసి ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తోంది. స్వచ్ఛ సుందర్ సముదాయిక్ సౌచాలయ (ఎస్ఎస్ఎస్ఎస్), సముదాయిక్ సౌచాలయ అభియాన్ (ఎస్ఎస్ఎ) చెత్త, వ్యర్థాలను తొలగించేందుకు గందగీ ముక్త్ భారత్ (డీడీడబ్ల్యూఎస్) కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ మూడు కేటగిరీల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు తెలంగాణను స్వఛ్చభారత్ అవార్డుకు ఎంపిక చేసినట్లు గందగీ ముక్త్ భారత్ డైరెక్టర్ యుగల్ జోషి తెలిపారు. అక్టోబర్ 2న స్వచ్ఛభారత్ దివస్ సందర్భంగా వర్చువల్ పద్ధతిలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ అవార్డులను అందజేయనున్నారు. కాగా, స్వచ్ఛభారత్ అవార్డును వరుసగా మూడో సారి దక్కించుకోవడంపై పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హర్షం వ్యక్తంచేశారు. -
రూ.1,40,881 కోట్లతో గ్రామీణ స్వచ్ఛ భారత్–2
సాక్షి, అమరావతి: దేశంలో గ్రామాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచడానికి మొత్తం రూ.1,40,881 కోట్లతో గ్రామీణ స్వచ్ఛ భారత్–2 కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గ్రామాల్లో రోడ్లపై మురుగు నీరు, చెత్త కుప్పలు లేకుండా పనులు చేపడతారు. అలాగే వాడిన ప్లాస్టిక్ వస్తువులను తిరిగి వినియోగించడానికి వీలుగా వాటిని సేకరిస్తారు. గ్రామీణ స్వచ్ఛ భారత్–2 కార్యక్రమ అమలుకు సంబంధించిన సవరణ విధివిధానాలను శుక్రవారం కేంద్ర మంచినీటి సరఫరా, పారిశుధ్య అమలు శాఖ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు లేఖలు రాసింది. ► మహాత్మాగాంధీ 150 జయంతోత్సవాలను పురస్కరించుకొని 2014 అక్టోబర్ 2న ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ మిషన్కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 2019 అక్టోబర్ 2 వరకు మొదటి దశ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపట్టారు. ► గ్రామీణ ప్రజలకు మరింతగా పరిశుభ్రతను అలవాటు చేయాలన్న లక్ష్యంతో ఇప్పుడు ‘గ్రామీణ స్వచ్ఛ భారత్–2’కు శ్రీకారం చుట్టారు. ► ఇందులో భాగంగా ఈ ఆర్థిక ఏడాది నుంచి 2025 మార్చి నెలాఖరు వరకు ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ► ఈ కార్యక్రమాల అమలుకు ఆయా గ్రామాల జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తారు. ఇందుకయ్యే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం, 60 శాతం కేంద్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ► చెత్త సేకరణకు ఐదు వేల జనాభా పైబడిన గ్రామంలో ఒక్కొక్కరికి రూ.45 చొప్పున, ఐదు వేల లోపు జనాభా ఉండే గ్రామంలో ఒక్కొక్కరికి రూ.60 చొప్పున లెక్కగట్టి నిధులు కేటాయిస్తారు. ► గ్రామాల్లో మురుగునీటి వ్యవస్థ పర్యవేక్షణకు 5 వేల లోపు జనాభా ఉండే గ్రామంలో ఒక్కొక్కరికి రూ.280 చొప్పున, 5 వేల పైబడి జనాభా ఉన్న గ్రామంలో ఒక్కొక్కరికి రూ.660 చొప్పున నిధులు ఇస్తారు. రాష్ట్రంలో 1,320 పెద్ద గ్రామాల్లో కార్యక్రమం ► 2020–21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమ అమలుకు రూ.1,700 కోట్లతో ప్రణాళికను సిద్ధం చేసి కేంద్రం ఆమోదానికి పంపారు. ► రాష్ట్రంలో తొలి ఏడాది మండలానికి రెండు గ్రామాల చొప్పున 1,320 పెద్ద గ్రామాల్లో కార్యక్రమ అమలుకు ప్రణాళిక సిద్ధం చేశామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెప్పారు. -
బాపూ ఆశయాలకు గ్రేటర్ ఆమడదూరం
సాక్షి, సిటీబ్యూరో: సత్యం, అహింస, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, మద్యపాన నిషేధం, కుల, మత, జాతి అంతరాలు లేని, నేరాలు ఘోరాలు లేని సమాజం, అందరికీ అన్నీ సమానంగా అందే సమసమాజ స్థాపన కోసం జాతిపిత మహాత్మాగాంధీ జీవితాంతం కృషి చేశారు. ఆయా అంశాలపై ఆయన చేసిన ప్రయోగాల సారమే బాపూ జీవితం. నేడు ఆ రుషి, మహార్షి 150వ జయంతి. మరి ఆయన ఆశయాలను మనం ఎంత వరకు అందిపుచ్చుకుంటున్నాం? మహాత్ముడు చెప్పిన మాటలను ఎంత మేరకు ఆచరిస్తున్నాం? బాపూ బాటలో ఏ మేరకు నడుస్తున్నాం? ఇప్పుడివన్నీ చర్చనీయాంశాలే. చీకటి భారతంలో వెలుగులు నింపిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన అడుగుజాడల్లో గ్రేటర్ ఏ మేరకు పయనించిందో ఓసారి అవలోకనం చేసుకుందాం. వనం.. మాయం నగరం కాంక్రీట్ జంగిల్గా మారింది. చెట్లు మాయమై బహుళ అంతస్తుల భవంతులు వెలిశాయి. ఫలితంగా కాలుష్యం పెరిగిపోయింది. వాయు, జల, నేల కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. నగరంలో 50 లక్షల వాహనాలకు గాను 15 లక్షలు కాలం చెల్లినవి ఉన్నాయి. ఓవైపు వీటి నుంచి వెలువడే ప్రమాదకర వాయువులు, మరోవైపు పరిశ్రమల రసాయనాలతో సిటీజనులకు స్వచ్ఛమైన వాయువు కరువైంది. సిటీలో సుమారు 185 వరకున్న చెరువులు, కుంటలు ఆర్గానిక్ కాలుష్యంతో ఆగమవుతున్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడుతున్న కాలుష్య ఉద్గారాలు ఆయా జలాశయాల్లో చేరడంతో నీరంతా కలుషితమవుతోంది. ఇక బల్క్డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియట్ కంపెనీల నుంచి వెలువడే ఘన, ద్రవ కాలుష్య ఉద్గారాలను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తుండడంతో వాటిలోని భార లోహాలు, మూలకాలు భూమిలోకి ఇంకుతున్నాయి. ఫలితంగా నేల కాలుష్యం ఏర్పడుతోంది. ప్రధానంగా మెర్క్యురీ, లెడ్, క్రోమియం, ఆర్సినిక్, నికెల్, మాంగనీస్, కాపర్, కోబాల్ట్ తదితర మూలకాలుండడం ఆందోళన కలిగిస్తోంది. మద్యం మత్తు ‘ఫుల్లు’ గ్రేటర్ పరిధిలో మద్యపాన నిషేధం కాగితాలకే పరిమితమైంది. రోజురోజుకు మద్యం అమ్మకాలు ‘ఫుల్లు’గా సాగుతున్నాయి. సుమారు 300 మద్యం దుకాణాలు.. మరో 400 వరకు బార్లున్నాయి. వీటిల్లో నిత్యం సుమారు రూ.25 కోట్ల అమ్మకాలు సాగుతుంటాయి. పండగలు, సెలవుదినాల్లో అమ్మకాలు చుక్కలను తాకుతాయి. అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు, వేతనజీవులు, కార్మికులు మద్యానికి బానిసై తమ సంపాదనలో సింహభాగం ఖర్చు చేస్తుండడంతో వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. మరోవైపు మందుబాబులు అనారోగ్యానికి గురై ఆస్పత్రుల్లో చేరి వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. మద్యపానం నిషేధం విషయంలో ప్రభుత్వం ప్రేక్షకపాత్రకే పరిమితమైందన్నది సుస్పష్టం. అంతటా అ‘స్వచ్ఛ’త మిగతా నగరాలతో పోలిస్తే స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్లో సిటీ వెనకబడుతోంది. నగరం పరిధిలో నిత్యం 5వేల టన్నుల మేర ఘన వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని డంపింగ్యార్డుకు తరలించే క్రమంలో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతున్నాయి. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో హడావుడి తప్ప ఫలితం లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. తడి, పొడి చెత్త వేర్వేరుగా వేసేందుకు ఇచ్చిన రెండు డబ్బాల విధానం సత్ఫలితాన్నివ్వలేదు. ప్రధాన రహదారులు, వీధుల్లో తరచూ చెత్తాచెదారం దర్శనమిస్తోంది. బహిరంగ మల, మూత్ర విసర్జన కొన్ని ప్రాంతాల్లో యథావిధిగా కొనసాగుతోంది. స్వచ్ఛత విషయంలో ఇటు బల్దియా.. అటు పౌర సమాజం ఉద్యమస్ఫూర్తితో పనిచేసినప్పుడే మహాత్ముడు ఆశించిన లక్ష్యం సాకారమవుతుంది. విద్యాబారం.. ఫీ‘జులుం’ అన్ని వర్గాల వారికీ ఉచితంగా గుణాత్మక విద్య అందించాలన్న మహాత్ముడి లక్ష్యం నెరవేరడం లేదు. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులు వేలల్లోనే. ఇక ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుకునే వారి సంఖ్య లక్షలకు చేరింది. దీంతో గ్రేటర్లో విద్యా వ్యాపారం రూ.కోట్లకు పడగలెత్తింది. అల్పాదాయ, మధ్యతరగతి వర్గం పిల్లల ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, బ్యాగులు కొనుగోలు చేసేందుకు అప్పులపాలు కావాల్సిన దుస్థితి తలెత్తింది. అక్షరాస్యతలో అగ్రభాగాన ఉన్నప్పటికీ ప్రైవేటు ఫీ‘జులు’ంతో అన్ని వర్గాలకు నాణ్యమైన గుణాత్మక విద్య అందని ద్రాక్షగా మారింది. తీవ్రమైన నేరం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో హత్యలు, దొంగతనాలు, దోపిడీలు కొంతమేర తగ్గుముఖం పడుతున్నా... నేర తీవ్రత మాత్రం భయాకరంగా ఉంటోంది. నడిరోడ్డుపై హత్యలు, సమీప బంధువులే నరుక్కోవడం, చైన్ స్నాచింగ్ ఘటనలు మూడేళ్లలో బాగా పెరిగాయి. సొత్తు సంబంధిత హత్యలు తగ్గుముఖం పట్టినా.. నేరం మనుషుల ప్రాణాలు పోయే తీవ్రతలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఇప్పటికీ మూఢనమ్మకాలతో హత్యలు చేస్తుండడం, మానవత్వం మరిచి ప్రవర్తిస్తుండడం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. పోలీసులు నివారణ చర్యలు తీసుకుంటున్నా ఘటనలు జరుగుతుండడం కలవరపెడుతోంది. మహిళా వేదన మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే మూడు కమిషనరేట్లలో బాలికలు, అమ్మాయిలు, మహిళలపై వేధింపులు పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఏకంగా 5,432 కేసులు నమోదు కాగా... 4,830 మేజర్లపైనే ఉండడం వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టం చేస్తోంది. కళాశాల కుర్రాళ్లు, ఉద్యోగులు, వివిధ పనులు చేస్తున్న మరికొందరు వేధింపులకు పాల్పడుతున్నారని షీ బృందాల గణాంకాలు తెలియజేస్తున్నాయి. వీరిలో 602 మంది మైనర్లు కూడా ఉండడం అందరినీ కలవరపెడుతోంది. మరోవైపు మహిళలకు సంబంధించి వరకట్న హత్యలు, ఆత్మహత్యలు, దాడులు, అత్యాచారాలు కొంతమేర తగ్గుముఖం పట్టినా... ఉమెన్ ట్రాఫికింగ్ పెరగడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. -
‘స్వచ్ఛత’లో నం.1
సాక్షి, కరీంనగర్: స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ర్యాంకుల్లో కరీంనగర్ జిల్లాకు మొదటిర్యాంకు వచ్చింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛదర్పణ్లో కరీంనగర్ జిల్లాకు జాతీయ, రాష్ట్రస్థాయిల్లో మొదటిర్యాంకు రావడంతో గుర్తింపు వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నాలుగు జిల్లాలు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లాలు వందశాతం మార్కులతో మొదటిర్యాంకు సొంతం చేసుకున్నాయి. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఉపయోగం, తడి,పొడి చెత్తనిర్వహణ, పరిశుభ్రత, పారిశుధ్యం కోసం జిల్లావ్యాప్తంగా చేపట్టిన ప్రచార కార్యక్రమాలు, ప్రజలను భాగస్వాములను చేయడం, మహిళాసంఘాలు, స్వచ్ఛగ్రాహీల భాగస్వామ్యం, గ్రామస్థాయి ప్రజల సమన్వయంతో వివిధ అంశాలతో చేపట్టిన పలు కార్యక్రమాలను ప్రాతిపదికన తీసుకున్నారు. ఓడీఎఫ్ కోసం విస్తృతప్రచారం.. జిల్లాను బహిరంగ మలవిసర్జన రహితగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ప్రచారం చేపట్టింది. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. మండలాలు, గ్రామాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి యుద్ధప్రాతిపదికన మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశారు. 2017లోనే జిల్లాను ఓడీఎఫ్గా ప్రకటించారు. స్వచ్ఛభారత్కు సంబంధించిన ఐదు విభాగాల్లోనూ జిల్లాప్రథమ స్థానంలో నిలిచింది. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ–32, స్వచ్ఛభారత్పై అవగాహనలో 32మార్కులు లభించాయి. తడి,పొడి చెత్త సేకరణ, ఘన, ద్రవవ్యర్ధాల నిర్వహణలో 16మార్కులు, జియోట్యాగింగ్, కమ్యూనిటీ మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణం, స్వచ్ఛభారత్ అనుబంధ కార్యక్రమాల విభాగంలో 20 మార్కులతో కలుపుకుని వందమార్కులు సాధించింది. జాతీయ,రాష్ట్రస్థాయిలో మొదటిర్యాంకు సాధించడంతో గుర్తింపు లభించింది. బోర్డులతో గ్రామాల్లో స్వాగతం.. జిల్లావ్యాప్తంగా ఓడీఎఫ్ ప్లస్లో భాగంగా అన్ని గ్రామాల్లో ప్రవేశానికి ముందు బోర్డులు ఏర్పా టు చేస్తున్నారు. ‘బహిరంగ మలవిసర్జన నుంచి విముక్తి పొందిన గ్రామం’ మీకు స్వాగతం పలుకుతుందంటూ అన్ని గ్రామాల్లో స్వాగతబోర్డులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రతీ గ్రామంలో ప్రధాన చౌరాస్తాల్లో మరుగుదొడ్ల వినియోగం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై వాల్పెయింటింగ్ చేస్తున్నారు. గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్లను వినియోగించడంపై అవగాహన కల్పిస్తున్నారు. -
ఆత్మశుద్ధి లేని ‘స్వచ్ఛ’ ఉద్యమమేల?
గాంధీ తన బలిదానానికి మూడు మాసాల ముందే దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ,‘‘దేశంలో హైందవ ధర్మాన్ని హిందువులే సర్వనాశనం చేస్తూ ఉండటాన్ని నేను భరించలేకపోతున్నాను. మనం అంతా ఒకే దేశం వాళ్లం. అందరం ఒక్కటే. హిందువులు, ముస్లింలు, పార్సీలు, సిక్కులు, క్రైస్తవులు అందరం ఐక్యంగా ఒక్క శక్తిగా మెలిగి నప్పుడు మనం తన్నులాడుకోవలసిన అవసరం లేదు’’ అని సందేశమిచ్చారు.. గాంధీజీ నిండు మనస్సుతో, ఆర్ద్రతతో, మానవత్వంతో అందజేసిన సువిశాలమైన సందేశాన్ని ఆచరణలో పాటించకుండా ఆయన బోధనల్ని కేవలం ‘టాయిలెట్’ సమస్యకే పరిమితం చేయబోవడం అనేక వింతలలో మరొక వింత. భారత రిపబ్లిక్ కాస్తా నేడు అసహన భారతంగా రూపొందింది. 2010–18 మధ్య దేశ పౌరులపై 63 వేధింపులు, హత్యలు నమో దుకాగా, కేవలం 2014 మే తర్వాతనే 61 హత్య కేసులు నమోదయ్యాయి. ఇంతటి స్థాయిలో దేశపౌరులపై అఘాయిత్యాలు జరుగుతున్నా ఈ హింసాకాండను కళ్లతో చూస్తూ కూడా స్పందించలేనివారిగా మిగిలి పోతున్నాం. కాగా, మరోవైపున అసలు సంఘర్షణ జరుగుతున్నది సమా జంలో అణగారిన వర్గాలతో–కుల మతాలు, వ్యక్తిగత విశ్వాసాలు కల్గి అవతల గట్టున ఉన్న అసంఖ్యాక ప్రజలతోనని గ్రహించాలి. ఈ పరి ణామం మొత్తం గాంధేయ తాత్విక దృష్టిని బలవంతంగా పక్కకు నెట్టేసిన ఫలితమే.– జస్టిస్ (రిటైర్డ్) ఎ.పి.షా: హైదరాబాద్ ‘గాంధీ మంథన్ సంవాద్’లో ప్రసంగం, 2–10–18 గాంధీజీని పాలకులు నేడు ఒక టాయిలెట్ నినాదానికి, ఓ కళ్లజోడు ఫ్రేము కిందికి దిగజార్చి మానవశ్రమలోని హుందాతనాన్ని కేవలం కక్కూసు దొడ్లకు కుదించి, ప్రచారం కోసం పాలక పెద్దలు చీపుళ్లు చేత పట్టుకుని కొద్ది నిమిషాల సేపు వీధులు ఊడుస్తున్నట్టు చూపించే నాలుగు కెమెరాలకు దిగజార్చారు.– జేఎన్యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్, 2–10–18 గాంధీజీ విదేశాల్లో ఉండగా, దక్షిణాఫ్రికా ఫీనిక్స్ సెటిల్మెంట్ టాల్ స్టాయ్ క్షేత్రంలో, ఎరవాడ జైల్లో తానున్న చోట కక్కూసు దొడ్లను (టాయిలెట్స్) తానే శుభ్రం చేసుకుని ఆదర్శంగా నిలిచాడు. ఆయనతో పాటు భార్య కస్తూరీబాయి కూడా అదే పనిచేశారు. స్వతంత్ర భారత పాలకులెవరూ అలాంటి జీవనవిధానం ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలిచినవారని భావించలేం. టాల్స్టాయ్, తోరో, రస్కిన్ బోధల ఆధా రంగా ఏర్పడినదే ఫీనిక్స్ సెటిల్మెంట్ క్షేత్రం. తర్వాత దేశంలోని జైళ్లలో, సబర్మతీ ఆశ్రమం, ఇతర ఆశ్రమాల్లో గాంధీ అనుసరించిన జీవన విధా నానికి ఆయన మార్గంలో పయనిస్తున్నామని చెప్పే రాజకీయపక్షాల నేతల తీరుకూ పోలికే లేదు. ప్రస్తుత పాలకవర్గంలోని ‘భద్రమూర్తులు’ ఎన్నికల ముందు, ఆ తర్వాత ‘చిట్కా’ విధానాలతో కాలక్షేపం చేస్తు న్నారు. దక్షిణాఫ్రికాలో, మనదేశంలో అనుసరించిన సిద్ధాంత విలువల్లో గాంధీజీ ప్రత్యేకత కనిపిస్తుంది. విదేశాల్లోనూ, ఇక్కడా కూడా సత్యా గ్రహ ఆశ్రమాల్లో కామన్ వంటశాల ఉన్నప్పుడు అస్పృశ్యత పేరిట ఆశ్ర మవాసులు కొందరు దళిత కుటుంబీకులతో కలిసి భోజనం చేయడానికి సంకోచించి, పక్కన కూర్చోవడానికి నిరాకరించిన సందర్భాల్లో గాంధీ పాత్ర చాలా గొప్పది. దళితులతో కలిసి భోంచేయడం తప్పు కాదని, పాపం కాదనీ వారికి ఆయన ‘క్లాస్’ పీకవలసివచ్చింది. అన్ని ఆశ్రమ సమావేశాల్లోనూ రెండు పూటలా అన్ని మతాలవారినీ స్వయంగా కలు పుకుని ప్రార్థనలు నిర్వహించేవారు. అలా అన్ని మతాలవారితో కలిసి భోజనాలు, భజనలు చేసేవారు. మత ఛాందసులను సైతం కలుపుకు పోవడం ద్వారా గాంధీజీ మానవ జీవితాన్ని సమానత్వ పునాదులపై నిర్మించారు. ఆ ప్రాతిపదికన అన్ని కులాలు, మతాల వారి కుల దుర హంకారాన్ని, వివక్షను ఛేదించడానికి ఆయన కృషి చేశారు. ఇంతకీ దేవుడనేవాడు ఎక్కడున్నాడంటే–‘శ్రమలో మాత్రమే’ అని ఎన్నో సంద ర్భాల్లో ఆయన చెప్పేవారు. మానవునిలోని ఆ శ్రమైక జీవన సౌంద ర్యాన్ని ఆయన గుర్తించినందునే పారిశుద్ధ్య కార్యక్రమాల్లో కూడా స్వేచ్ఛగా పాల్గొనగలిగారు. ప్రచారం కోసమే శుద్ధి విన్యాసాలు! ఈనాటి దేశ పాలకులు పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రచారం కోసమే చేపడుతున్నారు. స్వాతంత్య్రోద్యమ మౌలిక లక్ష్యాలైన సామాజిక, రాజకీయ, ఆర్థిక సమూల పరివర్తనను విస్మరించారు. ఈ నేతలు సూటూ– బూటూ వేసుకుని వీధులు శుభ్రం చేస్తున్నట్టు నడుం వంచినట్టుగా కనిపించే కెమెరా షాట్లతో సరిపెట్టుకునే విన్యాసంగా మలిచారు. అదైనా దేశవ్యాప్తంగా శ్రద్ధగా అమలు చేశారా అంటే లేదని న్యూస్ వెబ్సైట్ ‘ద వైర్’ ప్రతినిధి కబీర్ అగర్వాల్ గాంధీ 150వ జయంతి ఉత్సవాల ప్రారంభం రోజునే వివరించారు. అంతేకాదు, 2014 నుంచి ఇప్పటి వరకూ గ్రామీణ భారతంలో ‘స్వచ్ఛ భారత్’’ పేరిట తలపెట్టిన టాయిలెట్స్ నిర్మాణ పథకం అమలు జరుగుతున్న తీరును వివిధ దేశీయ, ప్రపంచ సాధికార సర్వే సంస్థలు ఎండగట్టాయి. ప్రపంచవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జనకు ప్రధాన కారణం టాయ్లెట్ మరు గుదొడ్ల సౌకర్యాలు లేకపోవడం. ఈ సమస్యను పరిష్కరించకుండా పారి శుద్ధ్య కార్మికుల(సఫాయి కర్మచారి)ఉపాధిని దెబ్బదీస్తున్నారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు పెంచకుండా పాలకులు టాయిలెట్స్ నిర్మించడానికి ఉత్తర్వులు జారీచేయడం వల్ల ఫలితం ఉండదని జాతీయ కర్మచారీ ఆందోళన్ సంస్థ ఎన్నోసార్లు ప్రకటించింది. ఆధునిక పరికరాల సాయంతో పౌర నివాసాల్లో మురికి నీళ్లు, బురద, మానవులు విసర్జించే మలమూత్రాలను క్షణాల్లో తొలగించే యాంత్రిక పద్ధతులు ప్రవేశపెట్టా లని జాతీయ కర్మచారీ సంఘం పదేపదే కోరుతూ వచ్చింది. పారిశుద్ధ్య కార్మికులు తమ చేతులు ఉపయోగించి ఈ పనులకు దిగకుండా పైన చెప్పిన ప్రత్యామ్నాయాన్ని తక్షణం అమల్లోకి తీసుకురావాలని ఈ సంస్థ ఏళ్ల తరబడిగా మొత్తుకుంటోంది. మురుగు కాలువల్లోకి దిగి పనిచేస్తూ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూనే ఉంది. అయినా, వంద లాది మంది సఫాయీ కార్మికులు ఇలా మరణిస్తూంటే కేవలం డజన్ల కేసుల్లో మాత్రమే నష్టపరిహారం చెల్లింపు జరిగింది. ఫలితంగా 2017లో ప్రతి ఐదు రోజులకు సగటున ఒక్కో పారిశుద్ధ్య కార్మికుడు మరణిస్తున్నా డని తేలింది. పైగా పార్లమెంటు చట్టం ప్రకారం సఫాయీకర్మచారులకు జాతీయస్థాయిలో కమిషన్ ఏర్పడినా పరిస్థితుల్లో మార్పురాలేదు. గ్రామసీమల్లో జరిగింది అంతంత మాత్రమే! గ్రామ సీమల్లో టాయిలెట్ సౌకర్యాల గురించి అధికార స్థాయిలో వెలువ డుతున్న ప్రకటనలేగాని ఆచరణలో ఫలితాలు ప్రచారం జరిగినంతగా కనిపించలేదని పలు సర్వే నివేదికలు చెబుతున్నాయి. గమ్మత్తేమంటే, ప్రభుత్వ టాయిలెట్స్ నిర్మాణ ప్రచారంలో చెప్పుకున్నట్టు దేశంలోని 28 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ కమిషన్ లెక్కల ప్రకారం కేవలం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మాత్రమే కర్మచారుల మృతి వార్తలు నమోదయ్యాయి. పనిలో ఉన్న సఫాయీ కర్మచారులు ఎందరు చనిపోయారన్న వివరాలు ఇంగ్లిష్, హిందీ పత్రి కల్లో వచ్చినంతగా ప్రాంతీయ భాషా పత్రికల్లో రిపోర్టవుతున్న మరణాల సంఖ్య మాత్రం గణనలోకి రావడం లేదు. ఎందుకంటే, పారిశుద్ధ్య కార్మికుల ఉపాధి, పునరావాసానికి చెందిన 2013 నాటి ప్రభుత్వ లెక్కలే ఈ దుస్థితిని బహిర్గతం చేస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం భౌతికంగా చేతులు ఉపయోగించి నిర్వహించే పారిశుద్ధ్య పనులపై విధించిన నిషేధం నాటికి సమయంలో దేశంలో ఉన్నవి 7,40,078 ఇళ్లు. కాగా, సామాజిక, ఆర్థికపరంగా 2011లో కుల ప్రాతిపదిక ఆధారంగా నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం చేతులు ఉపయోగించి మరుగు దొడ్లు కడిగే కర్మచారుల కుటుంబాలు పెద్ద సంఖ్యలోనే గ్రామీణ భార తంలో ఉన్నాయి. ఈ పరిస్థితికి తోడుగా, ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ఆర్భాటంగా ‘గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్’ అమలులోకి వచ్చిన తరువాత ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి ఏ మాత్రం మారలేదు. అయితే, తాను దేశ ప్రధాని అయిన తరు వాత బిహార్లో ఎనిమిది లక్షల ఇళ్లకు టాయిలెట్లు అందించానన్న మోదీ ప్రకటనను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఖండిస్తూ, అందులో 6 లక్షలకు పైగా టాయిలెట్లు తాను ఏర్పాటు చేసినవేనని బహిరంగంగా ప్రకటిం చాల్సి వచ్చింది. అనేక గ్రామాల్లో ఏ మేరకు టాయిలెట్ సౌక ర్యాలను ప్రభుత్వం కల్పించిందో లెక్కలు తీసేందుకు వెళ్లిన పరిశోధనా సంస్థలు అయిదు ఉత్తర భారత రాష్ట్రాల్లో సర్వేలు నిర్వహించగా వివిధ స్థాయిల్లో పంచాయతీ అధ్యక్షుల నుంచి ప్రభుత్వ అధికారుల దాకా ఎక్కువమంది వివరాలు తెలపడానికి జంకి నోరు మెదపలేదని తేలింది. గాంధీజీని హత్య చేసి, ఉరిశిక్షపడిన నాథూరాం గాడ్సే నీడను భారత ప్రజలు మాపేసుకున్నారు గానీ, దేశ పాలనా వ్యవస్థలోని కొందరు ఈ రోజుకీ వదిలించుకోలేకపోతున్నారు. ఆ నీడ చాటునే కొందరు బీజేపీ నాయకులు ఈ రోజుకీ దాగుడుమూతలాడుతున్నారు. గాంధీని గాడ్సే హత్య చేయడాన్ని మహాత్ముడి 150వ జయంతినాడే బీజేపీ నాయకురాలు ప్రీతీ గాంధీ సమర్థించారు. కానీ, ఆ ప్రకటనను గౌరవ ప్రధాని నరేంద్రమోదీ ఖండించిన వార్తను ఇంత వరకు మనం చూడలేదు. నిజానికి గాంధీ తన బలిదానానికి మూడు మాసాల ముందే (1947 అక్టోబర్ 4న) దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ,‘‘దేశంలో హైందవ ధర్మాన్ని హిందువులే సర్వనాశనం చేస్తూ ఉండటాన్ని నేను భరించలేకపోతున్నాను. మనం అంతా ఒకే దేశం వాళ్లం. అందరం ఒక్కటే. హిందువులు, ముస్లింలు, పార్సీలు, సిక్కులు, క్రైస్తవులు అందరం ఐక్యంగా ఒక్క శక్తిగా మెలిగినప్పుడు మనం తన్నులాడుకో వలసిన అవసరం లేదు’’ అని సందేశమిచ్చారు.. అందుచేత గాంధీజీ ఇంత విస్తృతమైన నిండు మనస్సుతో, ఆర్ద్రతతో, మానవత్వంతో అంద జేసిన సువిశాలమైన సందేశాన్ని ఆచరణలో పాటించకుండా ఆయన బోధనల్ని కేవలం ‘టాయిలెట్’ సమస్యకే పరిమితం చేయబోవడం అనేక వింతలలో మరొక వింత. ‘భాండశుద్ధిలేని పాకమదియేల’ అని వేమన అన్నట్టుగానే ఆత్మశుద్ధిలేని ‘స్వచ్ఛ భారత్’ ఏల అనుకోవాలి!! ఏబీకే ప్రసాద్(abkprasad2006@ahoo.co.in), సీనియర్ సంపాదకులు -
సోషల్ మీడియాలో ‘చెత్త’ వద్దు
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల ద్వారా అనవసర విషయాలను ప్రచారం చేయొద్దని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. దేశం గురించి గొప్పగా చెప్పే, సమాజ బలోపేతానికి దోహదపడే సానుకూల వార్తలతో కూడిన వాతావరణాన్ని సృష్టించాలని పిలుపునిచ్చారు. తన నియోజకవర్గం వారణాసికి చెందిన బీజేపీ కార్యకర్తలు, వలంటీర్లతో మోదీ బుధవారం వీడియోకాన్ఫరెన్స్లో ముచ్చటించారు. గల్లీలో రెండు కుటుంబాల మధ్య జరిగే చిన్నాచితకా గొడవలను సోషల్ మీడియాలో జాతీయస్థాయి వార్తగా చిత్రిస్తుండటంపై మోదీ అసహనం వ్యక్తం చేశారు. మానసిక పవిత్రతకూ ‘స్వచ్ఛ్ భారత్’.. ‘ప్రజలు కొన్నిసార్లు మర్యాద హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. తాము విన్న తప్పుడు సమాచారాన్ని ఇతరులకు పంపిస్తున్నారు. దీని వల్ల సమాజానికి ఎంత నష్టం జరుగుతోందో వారు గ్రహించడం లేదు. సమాజ ఔన్నత్యానికి తగని పదాలను వాడుతున్నారు. మహిళల గురించి ఏది తోచితే అది రాస్తున్నారు. నేను మాట్లాడుతోంది ఏదో ఒక రాజకీయ పార్టీకో, సిద్ధాంతానికో సంబంధించింది కాదు. మొత్తం 125 కోట్ల మంది భారతీయులతో ముడిపడి ఉంది’ అని మోదీ అన్నారు. నేడు నేపాల్కు మోదీ కఠ్మాండులో జరిగే నాలుగో బిమ్స్టెక్ (బంగాళాఖాత దేశాల ఆర్థిక, సాంకేతిక సహకార సంస్థ) సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ గురువారం నేపాల్ బయల్దేరనున్నారు. రెండు రోజులు అక్కడ పర్యటిస్తారు. -
వర్సిటీల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించండి
న్యూఢిల్లీ: విద్యా సంస్థల ప్రాంగణాల్లో ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించాలని యూజీసీ కోరింది. ప్లాస్టిక్ కప్పులు, బాటిళ్లు, స్ట్రాలు, బ్యాగ్లు, లంచ్ ప్యాకెట్ల వాడకంపై నిషేధం విధించాలని వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలను కోరింది. వాడిపారేసే వాటర్ బాటిళ్లకు బదులు పునర్వినియోగానికి వీలుండే బాటిళ్ల వాడకాన్ని ప్రోత్సహించాలని కోరింది. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం కింద మున్సిపాలిటీలతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని వర్సిటీల వైస్ చాన్సలర్లను కోరింది. పాఠశాల విద్యార్థులు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని ఆపాలని కోరింది. దేశవ్యాప్తంగా ఉన్న 24 బీచ్లు, నదీ తీరాలు, సరస్సులను పరిశుభ్రంగా మార్చేందుకు పర్యావరణ మంత్రిత్వశాఖ 19 బృందాలను ఏర్పాటు చేసింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాలకు ఈ ఏడాది భారత్ వేదిక కానున్న నేపథ్యంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సలహా మేరకు ఈ సూచన చేసింది. -
మరుగుదొడ్లు రెట్టింపు.. సదుపాయాలు శూన్యం
ఇంటింటికీ టాయిలెట్ సౌకర్యం అంశంలో సంఖ్యాపరంగా మంచి ఫలితాలనే సాధిస్తోంది. మహాత్మా గాంధీజీ కన్న కలలు నిజమయ్యేలా భారత్ను అద్దంలా తళతళలాడేలా చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడున్నరేళ్ల క్రితం స్వయంగా చీపురు పట్టి రాజధాని వీధుల్ని తుడిచి మరీ ప్రకటించారు. బహిరంగ మల విసర్జనను పూర్తిగా నిర్మూలించి అక్టోబర్ 2, 2019 గాంధీజీ 150వ జయంతిన స్వచ్ఛ భారత్తో ఘనంగా నివాళులర్పిస్తామని అన్నారు. ఇప్పుడు ఆ లక్ష్యసాధన దిశగా మెరుగైన ఫలితాల్ని సాధిస్తున్నామని కేంద్రప్రభుత్వం చెబుతోంది. స్వచ్ఛభారత్ మిషన్ మొదలైన ఇన్నేళ్లలో నివాస గృహాలకు మరుగుదొడ్ల సదుపాయం రెట్టింపైందని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ లోక్సభకు సమర్పించిన నివేదికలో తెలిపింది. 2014 అక్టోబర్ 2 నాటికి దేశంలో 38.7 శాతం నివాసాలకు మాత్రమే టాయిలెట్ సౌకర్యం ఉంటే, 2018 మార్చి నాటికి 78.98శాతం నివాసాలకు ఈ సదుపాయం పెరిగింది. ఈ మూడున్నరేళ్లలో 6.4 కోట్ల టాయిలెట్లను నిర్మించారు. బహిరంగ మల విసర్జన రహిత (ఒడిఎఫ్) రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 10 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఒడిఎఫ్ను సాధించాయి. ఒడిఎఫ్ రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ మహారాష్ట్ర, మేఘాలయా, సిక్కిం, ఉత్తరాఖండ్ కేంద్రపాలిత ప్రాంతాలు దాదా నాగర్ హవేలి, డయ్యూ డామన్ , చండీగఢ్ ఇక టాయిలెట్లు సదుపాయం ఘోరంగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్, ఒడిశా, జమ్ము కశ్మీర్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. బీహార్లో కేవలం 41 శాతం ఇళ్లకు మాత్రమే టాయిలెట్ సౌకర్యం ఉంటే, ఒడిశాలో 48 శాతం, కశ్మీర్లో 51శాతం ఇళ్లకు మాత్రమే మరుగుదొడ్డి సదుపాయం ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితులు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. తెలంగాణలో దాదాపుగా 19 లక్షల టాయిలెట్స్ను నిర్మిస్తే ఒడిఎఫ్ రాష్ట్రాల జాబితాలో నిలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఆ లక్ష్యం చేరుకోవాలంటే 22 లక్షల మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉందని కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019 అక్టోబర్ 2 నాటికి దేశంలో 9 కోట్ల 80 లక్షల టాయిలెట్స్ను నిర్మించాలన్నదే స్వచ్ఛ భారత్ లక్ష్యంగా పెట్టుకొని భారీగా నిధులు కూడా కేటాయించారు సదుపాయాల సంగతేంటి? ఇంటింటికి టాయిలెట్స్ విషయంలో సంఖ్యాపరంగా రెట్టింపైనప్పటికీ సదుపాయాలు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. చాలా చోట్ల నీటి సదుపాయం లేక టాయిలెట్ ఉన్నప్పటికీ బహిర్భూములకే వెళుతున్నారు. మరికొన్ని చోట్ల మరుగుదొడ్ల నిర్మాణంలో నాణ్యత లేకపోవడం, టాయిలెట్కి సరైన పద్ధతిలో ట్యాంకులు నిర్మించకుండా ఏదో ఒక గొయ్యిని తవ్వడం వల్ల దానిని వినియోగించుకోలేకపోతున్నారు. నాలుగు గోడలు కట్టేసి పైపు లైన్ల వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల కూడా టాయిలెట్లను వినియోగించుకోలేని పరిస్థితి చాలా గ్రామాల్లో కనిపిస్తోంది. మధ్యప్రదేశ్లోని గోపాల్పుర గ్రామంలో 330 ఇళ్లకు గాను 100 టాయిలెట్స్ను కట్టించారు. కానీ వారిలో ఒక్కరు కూడా ఆ సదుపాయాన్ని వినియోగించుకోవడం లేదు. దీనికి నీటి వసతి లేకపోవడం, నాసిరకం నిర్మాణాలే కారణం.. కొంతమంది ఆ టాయిలెట్స్ని గోడౌన్లుగా ఉపయోగిస్తున్నారు. ఇలాగైతే కోట్లలో అంకెలే కనిపిస్తాయి తప్ప అసలు లక్ష్యం నెరవేరదనే అభిప్రాయం వినిపిస్తోంది. -
జీహెచ్ఎంసీ ఖాతాలో మరో రికార్డ్
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఖాతాలో మరో రికార్డు నమోదైంది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్వచ్చ సర్వేక్షన్ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా బాగ్ లింగంపల్లిలో సోమవారం 15 వేల మందితో రోడ్లను ఊడ్చి, స్వచ్ఛతకై పది సూత్రాల ప్రతిజ్ఞ నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛభారత్లో భాగంగా గుజరాత్లోని వడోదర మున్సిపల్ కార్పొరేషన్ గత ఏడాది మే నెలలో 5,058 మంది విద్యార్థులతో రోడ్లను రికార్డు సృష్టించింది. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఆ రికార్డును బ్రేక్చేసింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వివేక్, కార్పొరేటర్ శ్రీనివాస్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. వివిధ కళాశాలల నుంచి వేలాదిగా విద్యార్థులు తరలివచ్చారు. జీహెచ్ఎంసీ కార్మికులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నగరాన్ని అగ్రస్థానంలో ఉంచుదాం కేటీఆర్ మాట్లాడుతూ స్వచ్చ సర్వేక్షన్ 2017 లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందన్నారు. మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్వచ్చ భారత్ మొదలు కాకముందే తెలంగాణ సీఎం నగరాన్ని నాలుగు వందల యూనిట్లుగా చేసి స్వచ్చ కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. తడి, పొడి చెత్తను వేరుచేయడం కోసం 45 లక్షల చెత్త బుట్టలు పంపిణీ చేసామన్నారు. నగరం బాగుంటనే మనమంతా బాగుంటమన్నారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏది సాద్యం కాదని.. స్వచ్చ సర్వేక్షణలో అందరు పాల్గొని నగరాన్ని అగ్రస్థానంలో ఉంచాలని కేటీఆర్ కోరారు. -
టాయ్‘లేట్’
మహబూబ్నగర్ న్యూటౌన్: స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యసాధనలో నిధుల కొరత వెంటాడుతోంది. లక్ష్యాన్ని చేరుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్న అధికారులను నిధుల విడుదలలో జాప్యం వెనక్ కలాగుతోంది. అధికారుల ప్రోత్సాహం, కళాజాతాల ద్వారా అవగాహన ఇతరత్రా కార్యక్రమాలతో ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకొస్తుండగా.. నెల రోజులుగా నిధులు నిలిచిపోవడం వారిలో నిరుత్సాహాన్ని నింపింది. తద్వారా లక్ష్యాన్ని చేరుకుంటామా, లేదా అని అధికారుల్లో ఆవేదన నెలకొంది. అక్టోబర్ 2 నాటికి ఓడీఎఫ్ జిల్లా జిల్లాలో ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నాటికి వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా హన్వాడ మండలంలోని సల్లోనిపల్లి గ్రామాన్ని మాడల్గా ఎంపిక చేసి 24 గంటల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేసి రాష్ట్రంలోనే చరి త్ర సృష్టించారు. అనంతరం మొదటి విడతగా 84 గ్రామాలను ఎంపిక చేయగా, గత ఏడాది అక్టోబర్లో 48 గ్రామాలను ఓడీఎఫ్గా ప్రకటించారు. ఇలా ప్రారంభమైన మరుగుదొడ్ల నిర్మాణ ఉద్యమం జిల్లాలో ఉధృతమైంది. ఈ మేరకు రెండో విడతలో జిల్లాలోని అన్ని గ్రామాలను ఓడీఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించి అధికారులు ముందుకు సాగారు. మొదటి విడతలో పూర్తయిన మరుగుదొడ్ల నిర్మాణాలు పోను ఇంకా జిల్లాలో అవసరమైన 1,67,033 మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. వీటి నిర్మాణానికి సిద్ధం కాగా.. ప్రభుత్వం నుండి నిధులు విడుదల కాకపోవడం అధికారులు, లబ్ధిదారుల్లో నిరుత్సాన్ని నింపుతోంది రెండు విడతలుగా నిధుల విడుదల... కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్ మిషన్లో నిర్మించే మరుగుదొడ్లకు రూ.12వేల చొప్పున చెల్లిస్తారు. ప్రభుత్వం అనుమతించిన మరుగుదొడ్డి నిర్మాణానికి మార్కింగ్, జియో ట్యాగింగ్, అప్లోడ్ పూర్తయ్యాక రూ.6వేల మొదటి విడతగా వస్తాయి. నిర్మాణం పూర్తయ్యాక రెండో ఫొటో అప్లోడ్ చేయగానే మిగతా రూ.6వేలు అం దాలి. కానీ అలా జరగకపోవడంతో లక్ష్యాన్ని చేరతామా, లేదా అనే మీమాంసలో అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇక బయట అప్పు లు ఎలా తీర్చాలా అని అధికారులు ఆందోళన చెందుతున్నారు. రెండో విడత నిధులు వస్తాయి కదా అనే ధీమాతో వారు బయట రింగ్లు, తలుపులు, సిమెంట్ తెప్పించారు. కానీ నిధులు రాకపోవడంతో పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇది పక్కన పెడితే బిల్లులు రావడం తెలి యడంతో కొత్త నిర్మాణాలపై లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. నిధుల విడుదలలో జాప్యం నిజమే... స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తున్న మరుగుదొడ్లకు బిల్లుల విడుదలలో కాస్త జాప్యం జరుగుతున్న మాట వాస్తమే. వారం క్రితం రూ.1.20కోట్లు విడుదలయ్యాయి. ఇంకా రూ.70 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది. ఆలస్యమైనా నిధులు విడుదలవుతాయనే నమ్మకం ఉంది. ఈ విషయమై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ పనులు నిలిపివేయకుండా చూస్తున్నాం. ఏది ఏమైనా నిర్దేశిత గడువులోగా లక్ష్యాన్ని చేరుకుంటామనే నమ్మకం ఉంది. – ఉదిత్, జిల్లా మేనేజర్, స్వచ్ఛ భారత్ మిషన్ -
చెంబుతో కొట్టింది
షాజాహాన్ తాజ్మహల్ కడితేఈ అభినవ షాజాహాన్ భార్య కోసంటాయ్లెట్ కడ్తున్నాడని వెక్కిరిస్తుంటారు.నువ్వు కట్టిస్తే మా భార్యలూ ఆ డిమాండ్ చేస్తారుఊరుకో అని బెదిరిస్తారు. అయినా పట్టించుకోనికేశవ్ చివరకు టాయ్లెట్ కట్టేస్తాడు.ఓ రాత్రి తన మనుషులతో దాన్నికూలగొట్టిస్తాడు తండ్రి. యూజువల్లీ తప్పు చేస్తే చెప్పుతో కొడ్తారు. కాని ఇంట్లో టాయ్లెట్ ఏర్పాటు చేయకపోతే చెంబుతో కొడ్తుంది ఈ మహిళ ఈ సినిమాలో. పదిమందికీ కనపడేలా భార్యనో, ఇష్టసఖినో ముద్దుపెట్టుకుంటే తప్పు మన దేశంలో. అదే భార్యను లేదా ఇష్టసఖిని పదిమంది తిరుగుతున్న చోటకు చెంబుతో పంపిస్తే తప్పు లేదు! ఇది మన న్యాయం! ఎంత అన్యాయం ఇది? అని నిలదీస్తుంది టాయ్లెట్. మహిళను పూజించే సంస్కారం మనదని చెప్తూనే ఆమె ఆత్మాభిమానాన్ని పోస్ట్మార్టమ్ చేస్తున్నాం ఇంట్లో టాయ్లెట్లు కట్టకుండా! ఆమె మొహం మీద నుంచి కొంగు తొలిగితే కొంపలేంటుకుపోవు.. కాని బహిర్భూమి కోసం ఆమె బయటకు వెళితేనే కాపురం కూలిపోతుంది అని చూపిస్తుందీ ఈ సినిమా! అవును.. ఇంట్లో టాయ్లెట్ కట్టించకపోతే మొగుడిని సైతం వదులుకోవడానికి సిద్ధపడుతుంది జయ (భూమి పడ్నేకర్). ఉత్తర్ప్రదేశ్లో ప్రియాంక అనే అమ్మాయి అత్తింట్లో టాయ్లెట్ లేదని తెలిసి పీటల మీద పెళ్లిని వద్దనుకుంటుంది. తర్వాత ఆ అత్తామామా టాయ్లెట్ కట్టిస్తామని ప్రమాణం చేస్తే.. మూడు ముళ్లు వేయించుకుంది. ఈ నిజ జీవిత కథనే రీల్గా చుట్టుకుని వచ్చింది టాయ్లెట్ ఏక్ ప్రేమ్ కథ. ఆ సినిమా కథ క్లుప్తంగా... ఎడ్డెం అంటే తెడ్డెం కేశవ్ (అక్షయ్ కుమార్)... ఇంటర్ ఫెయిల్డ్.. పెళ్లికాని ప్రసాద్ కేటగరీ 36 ఏళ్ల క్యాండిడేట్. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వరుడు. ఎంతటి సనాతనం అంటే అశుద్ధం ఇంట్లో జరక్కూడదని(ఉండకూడదని) టాయ్లెట్ కట్టించడు వాళ్ల నాన్న (సుధీర్ పాండే). సనాతనం పేరుతో అలాంటి చాలా అంధవిశ్వాసాలను పాటిస్తుంటాడు ఆయన. అందుకే 36 ఏళ్లు వచ్చినా కేశవ్ పెళ్లికాకుండా ఉంటాడు. ఆ సమయంలోనే కనిపిస్తుంది జయ. చదువుకున్నది, లోకజ్ఞానం తెలిసింది. ఈ ఇద్దరిదీ ఎడ్డెం అంటే తెడ్డం అనే వ్యవహారం. పట్టణంలో పుట్టి పెరిగిన పిల్ల. ఇంట్లో కాస్త ఆధునిక వాతావరణం.. అటాచ్డ్ బాత్ వగైరాతో సహా! ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లికీ దారితీస్తుంది. లోటా పార్టీ శోభనం తెల్లవారు ఝామున ఊసులాడుకుంటున్న ఈ జంటను కొందరు ఆడవాళ్లు కిటికీలోంచి చూసి డిస్టర్బ్ చేస్తారు. ఆ అంతరాయం సహజంగానే జయకు చిరాకు తెప్పించి వాళ్లను అడుగుతుంది ‘‘ఏంటీ’’ అని. అప్పుడు వాళ్ల చేతుల్లో ఉన్న లోటాలను చూపించి ‘‘రావా.. తెల్లవారితే వెళ్లలేవు.. రా త్వరగా వెయిట్ చేస్తాం’’ అంటారు. అర్థంకాని జయ అయోమయంగా భర్త వంక చూస్తుంది. నీళ్లు నమిలి చెప్తాడు.. ‘‘వాళ్లు పొలాల్లోకి టాయ్లెట్కి వెళ్తున్నారు. నువ్వూ వెళ్లు త్వరగా’’ అని. ‘‘ పొలాల్లోకి వెళ్లడం ఏంటీ? ఇంట్లో టాయ్లెట్ లేదా?’’ అని అడుగుతుంది అంతే అమాయకంగా. తల అడ్డంగా ఊపుతాడు. కోపాన్ని దిగమింగి లోటాతో ఆ పార్టీలో జాయిన్ అవుతుంది జయ. అక్కడి నుంచి ఆమెకు, ఆమెతో కేశవ్కూ కష్టాలు మొదలవుతాయి టాయ్లెట్ కోసం! తండ్రి.. తాను.. భార్య జయ కోసం లోటా పార్టీ వస్తుందంటే చాలు కేశవ్లో వణుకు మొదలయ్యేది. చేత్తో లాంతరు, ఇంకో చేత్తో లోటాతో ఆ పార్టీతో కలవడం... అసలు బహిర్భూమికి ఊరు అవతలున్న చేను, చెలకలను ఎంచుకోవడం జయకు అసహ్యంగా అనిపించేది. దాంతో కేశవే భార్యను బయటకు తీసుకెళ్లడం మొదలుపెడ్తాడు.అలా ఒకసారి గుబురు పొద మాటున జయ ఉండగా.. బండీ మీద హెడ్లైట్తో ఆమె మామగారు వస్తుంటారు... ఆయన కంట కోడలు పడ్తుంది... ఆ కంగారులో బండీ బ్యాలెన్స్ తప్పి ఆయనా పడిపోతాడు. ఆ సమయంలో మామగారు తనను చూడ్డంతో సిగ్గు, అవమానంతో దహించుకుపోతుంటుంది జయ. అత్తలేని సంసారం కావడంతో వంటిల్లు జయదే. లోటా అవమానాన్ని కోపంగా వంటింటి పాత్రల మీద తీరుస్తుంటుంది. నిస్సహాయ స్థితిలో కేశవ్ ఉంటాడు. అప్పుడే మామగారూ వస్తారు బయట నుంచి. తనను చూసి కోడలు తల మీదకు పైట లాక్కోలేదని, లాక్కోమని కొడుకుకు సైగలతో చెప్తుంటాడు. కేశవ్ భార్యను హెచ్చరిస్తాడు. పొద్దున పూట జరిగిన విషయాన్ని ఎత్తిపొడుస్తుంది జయ ‘అప్పుడు పోని మర్యాద ఇప్పుడు తల మీద పైట లాక్కోకపోవడం వల్ల పోతుందా?’’ అని. అది కోడలి పొగరుగా వినిపిస్తుంది, కనిపిస్తుంది మామగారికి. కొడుకుకు చెప్తాడు భార్యను హద్దుల్లో పెట్టుకోమని. భార్యా చెప్తుంది ఇంట్లో టాయ్లెట్ కట్టించమని. ట్రైన్లో.. భార్య ఎలాంటి అభాసుపాలవకుండా.. హాయిగా పనికానిచ్చుకునే మార్గాన్ని అన్వేషించడంలోనే కేశవ్ జీవితం తెల్లారుతుంటుంది. అలాంటి ప్లాన్స్లోనిదే ట్రైన్. ఒక ట్రైన్ తెల్లవారు జామునే వాళ్ల ఊళ్లో ఏడు నిమిషాలు ఆగుతుంది. ఆ ట్రైన్ టాయ్లెట్లోకి వెళ్లొచ్చని భార్యకు సలహా ఇవ్వడమే కాక రోజూ తీసుకెళ్తుంటాడు. అలా ఒకరోజు టాయ్లెట్లో ఉన్నప్పుడునే ఆ బాత్రూమ్ బయట కొంతమంది ప్యాసెంజర్స్ తమ సామానంతా నింపేసి నిలబడ్తారు కంపార్ట్మెంట్లో జాగ దొరక్క. ఈలోపు ట్రైన్ కదుల్తుంది. ఆమె లోపలి నుంచి ఎంత ప్రయత్నించినా తలుపు రాదు. అరుస్తుంది. అయినా ఇవతల వాళ్లకు వినిపించదు. ట్రైన్ ప్లాట్ఫామ్ వీడి పోతుంటే అప్పుడు బాత్రూమ్ డోర్ దగ్గర ఉన్న వాళ్లకు తెలుస్తుంది లోపల ఎవరో ఉన్నట్లు. గబగబ సామానంత తీసి తలుపు తెరుచుకునే వెసులుబాటు చేస్తారు. అప్పటికే రైలు వేగం పుంజుకుంటుంది. బాత్రూమ్లోంచి కంపార్ట్మెంట్ ఎగ్జిట్ దగ్గరకు వస్తుంది జయ.. ఎర్రబడ్డ మొహంతో. ప్లాట్ఫామ్ మీద నుంచి అరుస్తుంటాడు కేశవ్.. చైన్ లాగమని. కాని జయ లాగదు. ఆ రైలు ఆగి తాను దిగితే తన అత్తింట్లో టాయ్లెట్ రాదని ఆమెకు తెలుసు. అందుకే లాగదు.. భర్త మాటలను వింటూ అలాగే ఆ రైల్లో సాగిపోతుంది తన ఊరికి. అభినవ షాజాహాన్.. ఇంట్లో టాయ్లెట్ కట్టించేంత వరకు రానని భీష్మించుకుంటుంది జయ. తన తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా తనేం చేయనని స్పష్టం చేస్తాడు కేశవ్. అయితే అత్తింటికి వచ్చే సమస్యే లేదని అంతకన్నా స్పష్టంగా చెప్తుంది ఆమె. పంతానికి సరే అన్నా చింత పడుతుంటాడు కేశవ్ పండిత్. టాయ్లెట్ సమస్య తీర్చి భార్యను రప్పించడం కోసం ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. అలాంటి టైమ్లోనే ఆ ఊళ్లో షూటింగ్ అవుతుంటుంది. అక్కడ రెడీమేడ్ టాయ్లెట్స్ను చూస్తాడు. మనసు పారేసుకుంటాడు. ఓ రాత్రి వాటిల్లో ఒకదాన్ని ఎత్తుకొచ్చి ఇంట్లో పెడ్తాడు. సినిమావాళ్లకు తెలిసి పోలీస్ కంప్లయింట్ ఇస్తారు. ఈ విషయం తెలియని కేశవ్ భార్యకు ఫోన్ చేసి టాయ్లెట్ వచ్చేసింది ఇంటికి రమ్మంటాడు. ఆమె ఆ ఏర్పాట్లలో ఉన్నప్పుడే కేశవ్ను పోలీసులు లాకప్లో వేస్తారు. ఈ సంగతి తెలిసిన జయ భర్తను అసహ్యించుకుంటుంది. టాయ్లెట్ కట్టించకపోతే విడాకులు ఇస్తాను అని అల్టిమేటం జారీ చేస్తుంది. తన చేతకాని తనానికి కేశవ్ సిగ్గుపడ్తాడు. లాభంలేదు.. సీరియస్గానే తీసుకోవాలి అని అనుకొని తండ్రి కట్టుబాటును ధిక్కరిస్తూ ఇంట్లో టాయ్లెట్ ఉండాలనే అభిప్రాయాన్ని చెప్తాడు. తండ్రి కోపగించుకుంటాడు. అయినా కొడుకు లెక్క చేయడు. ఊళ్లో వాళ్లంతా కూడా కేశవ్ను గేలి చేస్తుంటారు.. పెళ్లామ్కు బానిస అని. షాజాహాన్ తాజ్మహల్ కడితే ఈ అభినవ షాజాహాన్ భార్య కోసం టాయ్లెట్ కడ్తున్నాడని వెక్కిరిస్తుంటారు. నువ్వు కట్టిస్తే మా భార్యలూ ఆ డిమాండ్ చేస్తారు ఊరుకో అని బెదిరిస్తారు. అయినా పట్టించుకోని కేశవ్ చివరకు టాయ్లెట్ కట్టేస్తాడు. ఓ రాత్రి తన మనుషులతో దాన్ని కూలగొట్టిస్తాడు తండ్రి. డైవోర్స్.. ఇది తెలిసిన జయ విడాకులు ఖాయం చేస్తుంది. అది దేశమంతా వార్త అవుతుంది. టాయ్లెట్ కోసం ఓ భార్య విడాకులిస్తోందని టీవీలు, పేపర్లు ఊదరగొడ్తాయి. అత్తగారి ఊరు ఆడవాళ్లు జయను కలుస్తారు. ఇంత చిన్న విషయానికి అంత రాద్ధాంతమా అంటారు. ‘‘కాదు సిగ్గుచేటు. మీరూ నాతో కలిస్తే ఇంటింటికీ టాయ్లెట్ వస్తుంది లేకపోతే నా ఇంట్లోనే వస్తుంది. అదీ లేకపోతే టాయ్లెట్ ఉన్న మా అమ్మవాళ్లిల్లే నా సొంతిల్లు అవుతుంది’’ అని అంటుంది. భార్య అంటే ఆలోచన ఉన్నవాడు ఇంట్లో టాయ్లెట్ కడ్తాడు అని నినదిస్తుంది జయ. సోచ్ హోతో శోచాలయ్ హోగా అని. అది ఊరంతా వ్యాపిస్తుంది ఓ ఉద్యమంలా. చివరకు టాయ్లెట్ సాధిస్తుంది. ఆ ప్రేమ కథ సుఖాంతమవుతుంది. టాయ్లెట్.. నాలుగు అడుగుల విస్తీర్ణంతో నాలుగు గోడల గది మాత్రమే కాదు. స్త్రీ మానాభిమానాలు, ఆమె ఆరోగ్యం, ఆమె ఆత్మగౌరవాన్ని కాపాడే ఓ చూరు అని చాటుతుంది ఈ సినిమా! అంతేకాదు స్వచ్ఛ్భారత్కి అసలైన నిర్వచనం.. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండడమే అనీ చెప్తుంది! మూఢనమ్మకాలను మరుగుదొడ్లలో వేసి ఒంటిని, ఇంటిని శుభ్రపరిచే తీరును చూపిస్తుంది. కేశవ్గా అక్షయ్కుమార్, జయగా భూమి పడ్నేకర్లు జీవించారు. మిగిలిన వాళ్లూ వాళ్ల పాత్రలకు న్యాయం చేశారు. రిషికేష్ ముఖర్జీ కిసీసే నా కహెనా తరహాలో ఈ సినిమాను ఫ్రేమ్ చేయాలనుకున్న నారాయణ్ సింగ్ ప్రయత్నమూ కనిపిస్తుంది. ఈ సినిమాకు సహ నిర్మాతలు అక్షయ్ కుమార్, ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండేలు. ఒక కమర్షియల్ హీరో ఇలాంటి సామాజిక అంశాలను తెరకెక్కించడంలో చూపించిన చొరవ ప్రశంసనీయం. -
ఆ చిత్రానికి బిల్గేట్స్ ఫిదా అయ్యారంట..!
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తాజా చిత్రం ‘టాయ్లెట్: ఏక్ ప్రేమ్ కథ’ . ఈ చిత్రంలో హీరోయిన్గా భూమి పెడ్నేకర్ నటించారు. శ్రీనారాయణ్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ డ్రామాను అక్షయ్ నీరజ్ పాండేతో కలిసి నిర్మించిచారు. అయితే ఈ మూవీకి ప్రేక్షకులు మంత్ర ముగ్ధులయ్యారు. ఈ చిత్రం ఇండియన్స్నే కాదు మెక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ను సైతం అకట్టుకుంది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ పోస్టు చేశాడు. ‘టాయ్ లెట్’ సినిమా నిజ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. అంతేకాక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపి ప్రజలను మేల్కొనేలా చేశారు. భారత దేశంలో ఉన్న పారిశుద్ద్య సవాల గురించి ఈ సినిమాతో ప్రేక్షకులకు తెలిపారు.’ అని తన ట్విట్లో పేర్కొన్నారు. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. స్వచ్ఛ భారత్ నేపథ్యంలో భాగంగా భారత్లో టాయ్లెట్ నిర్మాణం ఒక వార్త అంశంగా మారిపోవటం మనకు తెలుసు. -
స్వచ్ఛ భారత్ ప్రచారానికే 530 కోట్లు ఖర్చు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమానికి కేవలం ప్రచారం కల్పించడానికే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 530 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈ స్కీమ్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి పత్రికలు, రేడియో, టీవీలకు ఇచ్చిన యాడ్స్కే ఈ 530 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు ఓ సామాజికి కార్యకర్త దాఖలు చేసిన సమాచార హక్కు దరఖాస్తు ద్వారా వెల్లడైంది. ఆ సామాజిక కార్యకర్త తన పేరును బహిర్గతం చేసేందుకు ఇష్టపడలేదు. ఈ మొత్తం 'బేటీ బచావో, బేటీ పాడావో' కార్యక్రమం ప్రచారానికి ఖర్చు పెట్టిన దానికంటే 15 రెట్లు ఎక్కువ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014, అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ స్వచ్ఛ భారత మిషన్కు శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద 2019, అక్టోబర్ 2వ తేదీ నాటికి దేశంలో ప్రజలు బహిర్భూమికి వెళ్లే పరిస్థితిని పూర్తిగా నిర్మూలించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా దేశంలో 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించడం, ఇంటింటికి తిరిగి చెత్తా చెదారాన్ని నిర్మూలించి పరిసరాలను పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలో నూటికి నూరు శాతం ప్రజలకు సరైన అవగాహన కల్పించడం, ప్రతి పట్టణంలో ఓ వేస్ట్ మేనేజ్మెంట్ ఫ్లాంట్ను ఏర్పాటు చేయడం, చెత్తా చెదారాన్ని నిర్మూలించడంలో మున్సిపల్ సిబ్బందికి ఆధునిక పరికరాలను అందజేయడం, వాటిని వినియోగించడంలో శిక్షణ ఇవ్వడం తదితర చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ స్కీమ్ను అమలు చేయడానికి గతేడాది బడ్జెట్ 9,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించగా, ఈ ఏడాది ఏకంగా 16,248 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. ఈ ఏడాదిలో అక్టోబర్ నెల వరకు ఈ స్కీమ్ను ప్రచారం చేయడానికి యాడ్స్ కోసం 37 కోట్ల రూపాయలను కేంద్రం ఖర్చు చేసింది. ఈ యాడ్స్ కోసం ఖర్చు పెడుతున్న నిధులకు సరైనా లెక్కా పత్రం ఉండడం లేదని కాగ్ గతేడాది అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసింది. ఇక స్కీమ్ను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సరైన సహకారం, సమన్వయం లోపించిందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఈ స్కీమ్ను గ్రామ్య స్థాయికి తీసుకెళ్లడానికి ప్రభుత్వంతోని ఒప్పందం చేసుకున్న యునిసెఫ్ లాంటి సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇప్పటి వరకు స్వచ్ఛ భారత్లో కేంద్ర ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణంపైనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించిందని విమర్శకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 5.3 కోట్ల మరుగు దొడ్లను నిర్మించగా, పట్టణ ప్రాంతాల్లో 34 లక్షల మరుగుదొడ్లను నిర్మించారు. వాటిలో ఎక్కువ వరకు మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేవని, కొన్ని మరుగుదొడ్లను అప్పుడే ధ్వంసం చేశారని ఓ ఆంగ్ల మీడియా చేసిన పరిశోధనలో వెల్లడయింది. 2019 సంవత్సరం నాటికి ప్రభుత్వం మరో 8.2 కోట్ల మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకొంది. అంటే, నెలకు 23 లక్షలు, ప్రతి నిమిషానికి 56 మరుగు దొడ్లు నిర్మించాల్సి ఉంది. మరుగు దొడ్ల లక్ష్యాన్ని అందుకోవడంతోపాటు ప్రజల్లో బహిర్భూమికి వెళ్లే అలవాటును పూర్తిగా మాన్పించాలి. ఈ స్కీమ్ను చేపట్టిన ఈ మూడేళ్లలో దేశంలోని 2,72,235 గ్రామాలు లేదా 45 శాతం బహిర్భూమికి వెళ్లడాన్ని నిర్మూలించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఇంకా 73.20 కోట్ల మంది ప్రజలు అపరిశుభ్ర పరిసరాల్లో బహిర్భూమికి వెళుతున్నారని 'వాటర్ ఎయిడ్' అనే ప్రభుత్వేతర సంస్థ 'స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ టాయ్లెట్స్-17' నివేదికలో ఇటీవల వెల్లడించింది. మనుషులు పాకీ పనిచేయడం వల్ల ఒక్క 2016లోనే 1300 మంది మరణించారని 'సఫాయ్ కర్మచారి ఆందోళన్' గణాంకాలు తెలియజేస్తున్నాయి. మనుషులు పాకీపని చేయడాన్ని కేంద్రం ఎప్పుడో నిషేధించినప్పటికీ ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది. -
బయటకే వెళ్తాం!
నిజామాబాద్ జిల్లా నుంచి పాత బాలప్రసాద్: వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగానికి వృద్ధులు నిరాకరిస్తున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. మరుగుదొడ్లలో మలవిసర్జన చేయడం వాళ్లకు ముందు నుంచీ’ అలవాటు లేకపోవడంతో వీటిని వినియోగిం చడం లేదని వృద్ధులు చెబుతున్నారు. వంద శాతం కుటుంబాలు మరుగుదొడ్లు నిర్మించుకున్న గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం సామాజిక తనిఖీలు నిర్వహిస్తోంది. సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబులిటీ, ట్రాన్స్పరెన్సీ (ఎస్ఎస్ఏఏపీ) అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా సామాజిక తనిఖీ జరుగుతోంది. ప్రత్యేక ఆడిట్ బృందాలు గ్రామాలకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నాయి. మరుగుదొడ్లు నిర్మించుకున్నారా? కుటుంబసభ్యులందరూ వాడుతున్నారా? వంటి వివరాలు సేకరిస్తున్న సమయంలో వృద్ధులు వీటి వినియోగానికి ఆసక్తి చూపడం లేదన్న విషయం బయటపడింది. ఇప్పటికే వరంగల్ అర్బన్, సిద్దిపేట జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఈ సామాజిక తనిఖీ పూర్తయ్యాయి. ప్రస్తుతం నిజామాబాద్, మెదక్ జిల్లాలో కొనసాగుతున్నాయి. స్వచ్ఛభారత్ మిషన్ కింద.. బహిరంగ మల విసర్జనతో అంటు వ్యాధులు ప్రబలి.. ప్రజలు అనారోగ్యం పాలవుతుండడంతో ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. స్వచ్ఛభారత్ మిషన్ వంటి పథకాల ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. ఉపాధిహామీ పథకం కింద కూడా లబ్ధిదారులకు బిల్లులు చెల్లిస్తోంది. మరుగుదొడ్లు నిర్మించుకున్న ప్పటికీ చాలా కుటుంబాలు వాటిని వినియోగించడం లేదని అధికారుల తనిఖీల్లో తేలింది. కుటుంబంలో ఒకరిద్దరు బహిరంగ మలవిసర్జన చేస్తున్నట్లు వీరి పరిశీలనలో తేలింది. రాష్ట్రంలో మరుగుదొడ్ల వినియోగంపై 2012లో ప్రభుత్వం సర్వే చేసింది. మొత్తం 43.91 లక్షల కుటుంబాల్లో 11.49 లక్షల కుటుంబాలకే వ్యక్తి గత మరుగుదొడ్లు ఉన్న ట్లు తేలింది. మిగిలిన 32.42 లక్షల కుటుంబా లు కూడా మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రభు త్వం వివిధ పథకాలను అమలు చేస్తోంది. ఇప్ప టివరకు 16.42 లక్షల టాయిలెట్స్ నిర్మించారు. ఇదీ మరుగుదొడ్ల లెక్క.. మరుగుదొడ్లు ఉన్న కుటుంబాలు : 11.49 లక్షలు (2012 సర్వే) ఐదేళ్లలో నిర్మించిన మరుగుదొడ్లు : 16.42 లక్షలు ఓడీఎఫ్ జిల్లాలు : నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, మెదక్, మేడ్చల్, రాజన్న సిరిసిల్ల ఆరు జిల్లాల్లో వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరిగినట్లు ఆయా జిల్లాల యంత్రాంగం ప్రకటించింది. జగిత్యాల, కరీంనగర్, మెదక్, మేడ్చల్, నిజామాబాద్, సిరిసిల్లలను ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ (ఓడీఎఫ్) జిల్లాలుగా పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించు కునేలా లబ్ధిదారులను ప్రోత్సహించారు. నిర్మించు కోని వారికి పింఛన్లు, రేషన్ సరుకులు నిలిపివేస్తామనీ ప్రకటించారు. దీంతో అన్ని కుటుంబాలు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకున్నాయి. -
‘నంబర్ వన్’ మాయ!
నెల్లూరు (అర్బన్): ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించగలిగితే.. ప్రజలు చైతన్యవంతులై వాటిని వినియోగించుకుంటే అటు ఆ కుటుంబాలకు, ఇటు సమాజానికి ఎంతో ఉపయోగం. బహిరంగ మల విసర్జనను రూపుమాపి మరుగుదొడ్లను వినియోగించేలా చేస్తే టైఫాయిడ్, శిశు పక్షవాతం (పోలియో), కామెర్లు వంటి పలు రకాల జబ్బులు అరికట్టబడతాయి. ఈ నేపథ్యంలోనే ఆత్మగౌరవం పేరిట జిల్లాలో అన్ని కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టించినట్టు.. అందరూ వాటిని వాడుతున్నట్టు అధికారులు కాకి లెక్కలు వేసి ప్రభుత్వానికి నివేదించారు. వెంటనే స్పందించిన ప్రభుత్వం నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే నంబర్–1 అని ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 2న కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు సహా మరికొందరు అధికారులకు పురస్కారాలు అందజేశారు. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకోని కుటుంబాలు అనేకం ఉన్నాయి. దళిత, గిరిజన కాలనీల్లో అనేకచోట్ల మరుగుదొడ్లు అంటే ఇప్పటికీ తెలియని పరిస్థితి ఉంది. రూ.350 కోట్లు చెల్లింపు అధికారిక లెక్కల ప్రకారం జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో 2,70,031 ఇళ్లకు మరుగుదొడ్లు మంజూరయ్యాయి. వీటిలో 2,46,560 మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇందుకోసం రూ.350 కోట్లను చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ 27వ తేదీ వరకు నిర్మించుకున్న యూనిట్లకు పెండింగ్ లేకుండా బిల్లులు చెల్లించామని.. ఆ తరువాత నిర్మించిన వాటికి రూ.8 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని పేర్కొంటున్నారు. జిల్లాలో 940 పంచాయతీలు, 3,150కి పైగా మజరాలున్నాయి. 20 లక్షల మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. అధికారులు 100 శాతం మరుగుదొడ్లు నిర్మించామని చెబుతున్నారు. 2.70 లక్షల మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇంకా 23,471 నిర్మించాల్సి ఉందని లెక్కలు చూపారు. ఏ పల్లెకు వెళ్లినా మరుగుదొడ్లు నిర్మించుకోని కుటుంబాలు అనేకం కనిపిస్తున్నాయి. ఉదాహరణకు కావలి మండలం చలంచర్ల గ్రామంలో ఇప్పటికీ కొన్ని ఇళ్లకు మరుగుదొడ్లు కట్టలేదు. వాటిని కూడా నిర్మించిన లెక్కల్లో చూపించారు. గ్రామానికి దూరంగా ఉండే గిరిజన కుటుంబాలకు మరుగుదొడ్లు అం టేనే తెలియని పరిస్థితి. కాలువ గట్ల వెంబడి నివసించే వారికి మరుగుదొడ్లు లేనేలేవు. బినామి పేర్లతో భోంచేశారు ఏఎస్ పేట, సీతారామపురం, వరికుంటపాడు, బాలాయపల్లి, పెళ్లకూరు తదితర మండలాల్లో ఎంపీడీఓలు మరుగుదొడ్లు కట్టించకుండానే నిర్మించినట్టు చూపి పెద్దఎత్తున నిధులు డ్రా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బినామీ పేర్లతో సాగించిన ఈ కుంభకోణాలపై కలెక్టర్ విచారణ జరిపిస్తే బినామీ బిల్లుల బాగోతం బయటపడే అవకాశముందని ప్రజలు పేర్కొంటున్నారు. పలు గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన నేటికీ కొనసాగుతోంది. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి మరుగుదొడ్లు నిర్మిస్తున్నప్పటికీ ప్రజలు వినియోగించడం లేదంటే ఈ తప్పెవరిదో ఆలోచించాల్సి ఉంది. లేదంటే ఆత్మగౌరవం అభాసు పాలవుతుంది. ఇదో విచిత్రం బుచ్చిరెడ్డిపాళెం : బుచ్చిరెడ్డిపాళెం మండలం శ్రీపురంధర పురం గ్రామానికి చెందిన యర్రా నాగసుధాకర్రెడ్డి, యర్రా విజయలక్ష్మి భార్యాభర్తలు. యర్రా విజయలక్ష్మి పేరిట స్వచ్ఛభారత్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.15 వేలు, ఉపాధి హామీ పథకంలో రూ.12 వేల నగదు డ్రా చేశారు. అలాగే యర్రా నాగ సుధాకర్రెడ్డి పేరిట స్వచ్ఛభారత్ కింద మరో రూ.12 వేల నగదు డ్రా చేశారు. విచిత్రమేమిటంటే.. లబ్ధిదారుడిగా చూపుతున్న నాగసుధాకర్రెడ్డికి డబ్ల్యూఏపీ0906036ఏ0264 నంబర్తో ఉన్న బోగోలు మండల రేషన్ కార్డును జతపరిచారు. ఇలా భార్యాభర్తల పేరిట ఒక మరుగుదొడ్డి నిర్మాణానికి అధికారుల సహకారంతో రూ.39 వేల నగదు డ్రా చేశారు. నిజానికి ఈ సొమ్ములు మొత్తం ఆ కుటుంబానికి అందలేదు. ఎవరి జేబుల్లోకి వెళ్లాయనేది అధికారులకే ఎరుక. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. కోవూరు నియోజకవర్గంలో వేలాది మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి చోటుచేసుకుంది. మరుగుదొడ్లు కట్టకుండానే కట్టినట్లు చూపి రూ.లక్షలు స్వాహా చేసిన దాఖలాలు ఉన్నాయి. వీటిపై సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుకు ఫిబ్రవరి నెలలో మండల నాయకులు, ప్రజలు ఫిర్యాదు చేశారు. నామమాత్ర విచారణ జరిపి చేతులు దులుపుకున్నారు. బినామీలు లేనే లేరు జిల్లాలో మరుగుదొడ్లు నిర్మించకుండా బిల్లులు పొందిన బినామీలు ఎవరూ లేరు. అలాంటివారు ఎవరైనా ఉన్నట్టు మా దృష్టికి వస్తే కలెక్టర్ ద్వారా తగు చర్యలు చేపడతాం. ఎక్కడైనా దొంగ బిల్లులు డ్రా చేసి ఉంటే రికవరీ చేయిస్తాం. నిర్మించిన మరుగుదొడ్లు వినియోగించుకునేలా ఆత్మగౌరవం ప్రతిజ్ఞ పేరుతో కలెక్టర్ ప్రజలను చైతన్యం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. లక్ష్యాలకు అనుగుణంగా మరుగుదొడ్లు నిర్మించాం. అక్కడక్కడా ఒకటీ అరా ఉంటే అవి వెంటనే పూర్తి చేయిస్తాం. – సుస్మితారెడ్డి, జిల్లా కో–ఆర్డినేటర్, ఆత్మగౌరవం -
స్వచ్ఛ భారత్లో జగిత్యాల నంబర్ వన్
జగిత్యాల: స్వచ్ఛభారత్లో జగిత్యాల జిల్లా అగ్రగామిగా నిలిచింది. కేంద్రం నంబర్వన్ ర్యాంక్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా కలెక్టర్ శరత్, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ చొరవ తీసుకొని అన్ని శాఖల అధికారులతో సమన్వయ పరిచి ఓడీఎఫ్ సాధించేందుకు కృషి చేశారు. జిల్లాలో 330 గ్రామ పంచాయతీలు, 485 హాబిటేషన్స్ కలిగి ఉన్నాయి. గ్రామాల్లో 36 గంటల్లోనే 920 మరుగుదొడ్లు కట్టి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. కేంద్రం స్వచ్ఛదర్పన్ పథకం కింద దేశంలో 7 రాష్ట్రాలకు స్థానం కల్పించగా.. ఇందులో జగిత్యాల, సిరిసిల్ల జిల్లా మొదటి ర్యాంకులు పొందాయి. జగిత్యాల జిల్లా కు కేంద్రం పెర్ఫార్మెన్స్పై మొదటి కేట గిరీలో 50 మార్కులు, అవగాహనపై రెండో కేటగిరీలో 15 మార్కులు, పారదర్శ కత్వం కింద టాయిలెట్స్ను జియో ట్యాగింగ్కు అనుసంధానం చేసే మూడో కేటగిరీలో 25 మార్కులు కేటాయించింది. -
‘సచ్ భారత్’ కావాలి
► అధికారంలోకి వచ్చాకే జాతీయ జెండాను గౌరవిస్తున్న ఆరెస్సెస్ ► ‘కాంపోజిట్ కల్చర్’ సమావేశంలో రాహుల్ ధ్వజం ► హాజరైన 12 ప్రతిపక్ష పార్టీలు న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మానసపుత్రిక అయిన ‘స్వచ్ఛ్ భారత్’ కన్నా ‘సచ్ భారత్’ ముఖ్యమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సత్యానికి విలువ ఇచ్చే భారత్కే తమ మద్దతు ఉంటుందని తెలి పారు. ‘మన వైవిధ్య సంస్కృతిని కాపాడుకుందాం’ పేరిట జేడీయూ తిరుగుబాటు నేత శరద్ యాదవ్ గురువారం నిర్వహించిన సమావేశంలో రాహుల్... బీజేపీ, ఆరెస్సెస్, ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, ఆర్జేడీ, ఎన్సీ, జేడీఎస్, ఆర్ఎల్డీ తదితర 12 పార్టీలు హాజరయ్యాయి. అధికార బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చాయి. శరద్ యాదవ్ పోరాటానికి సంఘీభావంగా నిలిచాయి. బీజేపీ, ఆరెస్సెస్ని నిలువరించాలంటే ప్రతిపక్షాల ఐక్యత తప్పనిసరి అని రాహుల్ నొక్కి చెప్పారు. ‘మోదీ స్వచ్ఛ్ భారత్ సృష్టిస్తానంటున్నారు. కానీ మనకు కావాల్సింది సచ్ భారత్. మనమంతా ఐక్యంగా పోరాడితే బీజేపీ, ఆరెస్సెస్ లాంటివి కనిపించకుండా పోతాయి. అసలు బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు ఆరెస్సెస్ ఎప్పుడూ జాతీయ జెండాకు వందనం చేయలేదు. ఇక్కడ దేశాన్ని రెండు పార్శా్వల్లో చూడాలి. ఒకరేమో ఈ దేశం నాదని అంటారు. మరొకరేమో నేను ఈ దేశానికి చెందుతాను అని అంటారు. ఆరెస్సెస్కు మిగతావారికి అదే తేడా’ అని రాహుల్ అన్నా రు. రాహుల్ వ్యాఖ్యలతో శరద్ యాదవ్ ఏకీభవించారు. ప్రజలు ఏకమైతే హిట్లర్ కూడా తుడిచిపెట్టుకుపోతాడన్నారు. మన ఉమ్మడి సంస్కృతిని కాపాడటంలో శరద్ యాదవ్ ముఖ్య పాత్ర పోషించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి పేర్కొన్నారు. -
టాయ్ లెట్.. ఓ భార్య పోరాటం
ధన్బాద్: జార్ఖండ్ లో ఓ భార్య చేసిన పోరాటం ఇతర మహిళల్లో స్ఫూర్తిని నింపుతోంది. మరగుదొడ్డి నిర్మించకుండా ఫోన్ కొనుకున్న భర్తకు చుక్కలు చూపించి చివరకు తాను అనుకున్నది సాధించింది. స్వచ్ఛ్ భారత్ అభియాన్ కింద కేంద్రం సామాన్యులకు మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 12000 వేల రూపాయలలో తొలి విడతగా ఆరు వేలు, నిర్మాణం పూర్తయ్యాక మిగతా డబ్బును ఇస్తుంది. భూలి పట్టణానికి చెందిన రాజేశ్ మహ అనే రైతు సొంతిల్లు కట్టుకున్నాడు. కానీ, టాయ్ లెట్ నిర్మించుకోకుండా ధన్బాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో సంబంధిత శాఖ నిధులు మంజూరు చేసింది. అయితే అతగాడు ఆ డబ్బుతో ఓ ఫోన్ కొన్నాడు. విషయం తెలిసిన భార్య లక్ష్మీ దేవి కోపంతో ఆ ఫోన్ ను పగలగొట్టేసింది. అంతేకాదు మరుగుదొడ్డి కట్టించాలంటూ పచ్చితీర్థం కూడా ముట్టకుండా రెండు రోజులు దీక్ష కూడా చేసింది. ఈ రెండు రోజులు మా ఇంట్లో మహాభారత సంగ్రామమే జరిగింది. మహిళలను బహిర్భూమికి ప్రోత్సహించటం ముమ్మాటికీ వారిని అవమానించటమే. నా తప్పు నేను తెలుసుకున్నా, అందుకే అప్పుచేసి మరీ నిర్మిస్తున్నా అని రాజేశ్ తెలిపాడు. అన్నట్లు ఈ శుక్రవారమే విడుదల కాబోతున్న టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథా కూడా స్వచ్ఛ్ భారత్ అభియాన్ నేపథ్యంలోనే తెరకెక్కుతున్న విషయం విదితమే. -
మరుగుదొడ్ల వేగవంతానికి అధికారుల నియామకం
అనంతపురం టౌన్ (అనంతపురం): స్వచ్ఛభారత్ మిషన్ కింద డ్వామాకు కేటాయించిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్న లక్ష్యంతో ప్రత్యేకంగా అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు డ్వామా పీడీ నాగభూషణం తెలిపారు. కలెక్టర్ వీరపాండియన్ 28,710 యూనిట్లు కేటాయించారని, వీటిని ఈనెల 19లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కళ్యాణదుర్గం డివిజన్కు రాజేంద్రప్రసాద్, కదిరి డివిజన్కు విజయ్కుమార్, పెనుకొండకు నరసింహారెడ్డి, ధర్మవరానికి చంద్రశేఖర్రావు, అనంతపురానికి రంగన్నను నియమించామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి సామగ్రిని అందుబాటులో ఉంచుకుని నిర్మాణాలు ప్రారంభించాలని ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశించినట్లు తెలిపారు. రోజు వారీ నివేదికలను తెప్పించుకుని గడువులోగా లక్ష్యం సాధిస్తామన్నారు. -
టీడీపీ అధికారంలోకి వస్తుందనుకోలేదు
హైదరాబాద్: ఉపాధి హామీ పథకం సోనియా ఆలోచన వల్లే వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కిషోర్ చంద్రదేవ్ అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నిర్మల్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఇప్పుడు బీజేపీ దానిని కాపీకొట్టి స్వచ్ఛ భారత్ పేరుపెట్టి ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. కేంద్రం , తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు, బలహీన వర్గాల ప్రజలను పట్టించుకోవడంలేదని అన్నారు. కాంగ్రెస్ లో ఎన్ని గ్రూపులు ఉన్నా అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగేదన్నారు. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలో టీడీపీ అధికారంలోకి వస్తుంది అని ఎవరు ఊహించలేదని, కాంగ్రెస్ పార్టీలో 7 సార్లు, 8 సార్లు గెలిచిన నాయకులూ కూడా ఓడిపోయారని అన్నారు. -
బహిర్భూమికెళితే ఫొటోలు తీస్తారా?
జైపూర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మానస పుత్రిక ‘స్వచ్చ్ భారత్ అభియాన్’ పథకాన్ని అమలు చేయడంలో బాగా వెనకబడి పోయిన రాజస్థాన్లో పథకాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ముఖ్యమంత్రి వసుంధర రాజె నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఆలోచించింది. తరతరాలుగా ఇంటి వెలుపల బహిర్భూమికి వెళ్లే అలవాటున్న రాష్ట్రంలో ఆ పద్ధతికి స్వస్తి చెప్పాలంటే అలా బహిర్భూమికి వెళ్లే వాళ్ల ఫొటోలు తీయాలని, వారెవరే గుర్తించి అవమానపర్చాలని గతేడాది ఆమె ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాజస్థాన్లోని ప్రతాప్గఢ్లో మున్సిపల్ కమిషనర్ అశోక్ జైన్ ఆధ్వర్యంలో ఐదుగురు మున్సిపల్ ఉద్యోగులు శుక్రవారం ఉదయం ఆరున్నర గంటలకు బహిర్భూమికి వెళుతున్న మహిళల ఫొటోలు తీశారు. అసభ్యంగా ఇలా ఫొటోలు తీయడం ఏమిటంటూ సీపీఎం (ఎంఎల్)కు చెందిన 52 ఏళ్ల జఫర్ ఖాన్ అడ్డుకుంటే ఆయన్ని కొట్టారు. దాంతో ఆయన మరణించడంతో ఇప్పుడు రాద్ధాంతం జరుగుతోంది. ఆరుబయట బహిర్భూమికి వెళ్లడం సరైన సంస్కృతి కాదని, అయితే అలాంటప్పుడు మహిళలను ఫొటోలు తీయడం ఏ సంస్కృతని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని 22 శాతం ఇళ్లకు ఇంకా టాయ్లెట్లు లేనప్పుడు వారంతా ఎక్కడికెళ్లాలలని ప్రశ్నిస్తున్నారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా 80 లక్షల టాయ్లెట్లను నిర్మించామని, అందులో రాజస్థాన్లోనే ఎక్కువ నిర్మించామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ రాజస్థాన్ ప్రభుత్వం స్వచ్ఛతలో దారుణంగా వెనకబడి ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే గత జనవరి, ఫిబ్రవరి నెలల్లో దేశంలోని 434 నగరాలో ‘స్వచ్చ్ సర్వేక్షన్ (సర్వే)–2017’ పేరిట నిర్వహించిన సర్వేనే తెలియజేస్తోంది. రాజస్థాన్లోని కిషాన్గఢ్ 419వ స్థానంలో ఉండగా, 29 నగరాలకుగాను 18 నగరాలు 300 నగరాలకన్నా వెనకబడ్డాయి. స్వచ్ఛ భారత్ను ముందుకు తీసుకెళ్లడం కోసం పంచాయతీలకు పోటీ చేసే అభ్యర్థుల ఇళ్లలో తప్పనిసరిగా టాయ్లెట్లు ఉండాలని, అభ్యర్థి కుటుంబ సభ్యులెవరూ బహిర్భూమికి వెళ్లరాదంటూ పంచాయతీ రాజ్ చట్టంలో వసుంధర రాజె ప్రభుత్వం గతేడాది సవరణను తీసుకొచ్చింది. ఈ సవరణ స్ఫూర్తితో కొంతమంది మహిళా సర్పంచ్లు ‘నో టాయ్లెట్, నో మ్యారేజ్’ నినాదంతో ప్రచారోద్యం చేపట్టారు. చట్ట సవరణను చిత్తశుద్ధితో అమలు చేస్తూ మహిళా సర్పంచ్లు చేపట్టిన ఉద్యమాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా అసభ్యంగా ఫొటోలు తీయడం వల్ల దుష్ఫలితాలే ఎక్కువ ఉంటాయని సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు. -
వైజాగ్కు 3వ ర్యాంకు, హైదరాబాద్కు 22..
న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్ ర్యాంకులు విడుదలయ్యాయి. ఈ ర్యాంకుల్లో మధ్యప్రదేశ్కు చెందిన ఇండోర్ మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే స్థానంలో ఉన్న మైసూరు ఐదో స్థానానికి పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్కు చెందిన విశాఖపట్టణానికి మూడో ర్యాంకు రాగా, తెలంగాణలోని హైదరాబాద్ నగరం మాత్రం 22వ స్థానంలో నిలిచింది. 2014 అక్టోబర్ నెలలో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏడాది నుంచి దీనికింద అవార్డులు ఇస్తున్నారు. ఆయా నగరాల్లో ఉండే మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, బహిరంగ మలమూత్ర విసర్జన శాలల ఏర్పాటు, ఇళ్లల్లో మరుగుదొడ్ల నిర్మాణం, రవాణా వ్యవస్థ, చెత్త శుద్ధి నిర్వహణవంటి అంశాల ప్రాతిపదికన ఈ ర్యాంకులు ప్రకటిస్తారు. తాజాగా మొత్తం 434 నగరాలు, చిన్నచిన్న పట్టణాలకు కలిపి ర్యాంకులు ప్రకటించారు. వీటిల్లో తొలి 50 ర్యాంకులు పొందిన నగరాల్లో టాప్ 5లో ఇండోర్, భోపాల్, విశాఖపట్నం(వైజాగ్) సూరత్, మైసూరు ఉండగా.. 50 ర్యాంకుల్లో స్థానం పొందిన తెలుగు రాష్ట్రాల నగరాలను పరిశీలిస్తే వైజాగ్(3), తిరుపతి (9), విజయవాడ(19), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(22), వరంగల్(28), సూర్యాపేట(30), తాడిపత్రి (31), నరసారావుపేట(40), కాకినాడ(43), తెనాలి(44), సిద్దిపేట(45), రాజమండ్రి (46) ర్యాంకులను సొంతం చేసుకున్నాయి. -
అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది?
అమితాబ్ బచ్చన్, శశి కపూర్ నటించిన మల్టీ స్టారర్ చిత్రం.. దీవార్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. నిజాయితీపరుడైన పోలీసు అధికారిగా శశికపూర్, దొంగతనాలు చేసి ఎక్కువ డబ్బు సంపాదించిన మనిషిగా అమితాబ్ ఇందులో నటిస్తారు. వాళ్లిద్దరి తల్లి నిరుపమా రాయ్ మాత్రం నిజాయితీపరుడైన చిన్న కొడుకు దగ్గరే ఉంటానని సినిమాలో చెబుతారు. ఈ సినిమా పోస్టర్ను స్వచ్ఛభారత్ ప్రచారం కోసం ఉపయోగించుకున్న తీరు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టిని కూడా ఆకర్షించింది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన నైనిటాల్లో ఎవరో ఈ పోస్టర్ అతికించారు. అందులో ఒకవైపు అమితాబ్, మరోవైపు శశికపూర్ ఉండగా వాళ్లిద్దరికి మధ్యలో తల్లి నిరుపమా రాయ్ ఉంటారు. సినిమాలోని 'అమ్మ' సీన్ను ఇక్కడ యథాతథంగా ఉపయోగించుకున్నారు. అయితే డైలాగును మాత్రం కొద్దిగా మార్చారు. నిజాయితీపరుడైన చిన్నకొడుకు దగ్గర ఉంటానని చెప్పాల్సిన తల్లి.. ''ముందుగా ఎవరు ఇంట్లో బాత్రూం కట్టిస్తారో వాళ్ల దగ్గరే నేను ఉంటా'' అని చెప్పినట్లుగా ఆ పోస్టర్లో ఉంది. పర్యాటకులు ఎక్కువగా వచ్చే నైనిటాల్లో ప్రజలను స్వచ్ఛభారత్ దిశగా ప్రోత్సహించేందుకు ఎవరో ఈ పోస్టర్ను రూపొందించి అక్కడ అతికించారు. దాన్ని ప్రధాని నరేంద్రమోదీకి ఒక ఫాలోవర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చూసిన మోదీ.. దాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయారు. స్వచ్ఛభారతాన్ని ప్రోత్సహించేందుకు ఇలా సినిమాలను కూడా ఉపయోగించుకుంటున్నారని, ఇది చాలా సృజనాత్మకంగా ఉందని ఆయన సమాధానం ఇచ్చారు. 2019 నాటికి బహిరంగ మలవిసర్జనను పూర్తిగా అరికట్టాలన్న ఉద్దేశంతో 2014 సంవత్సరంలో ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. Haha! Borrows from cinema to make a point on cleanliness. Innovative. https://t.co/PQpX8LHo7l — Narendra Modi (@narendramodi) April 11, 2017 Whoever created this deserves an award. @narendramodi ji kripya dhyan dein -
స్వచ్ఛభారత్లో పాల్గొన్న జవదేకర్
యాదాద్రి: యాదాద్రిలోని ఆర్టీసీ బస్టాండ్లో శనివారం ఉదయం జరిగిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బస్డాండ్లో చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ఉపయోగించుకుని లబ్ధిపొందాలని ఆయన కోరారు. యాదాద్రిలో జవదేకర్ ప్రత్యేక పూజలు యాదాద్రిలో కేంద్రమంత్రి ప్రకాశ్ జావదేకర్ శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రిని గొప్పగా అభివృద్ధి చేస్తోందన్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు భాజపా నేత లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు -
‘ఫైన్ సిటీ’లక్ష్యం
జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్రెడ్డి ప్రశ్న : ఈ ఉగాది లక్ష్యం..? కమిషనర్: వచ్చే ఉగాది నాటికి 20 లక్షల కుటుంబాల నుంచి ఇంటివద్దే చెత్త నూరు శాతం వేరు కావడం లక్ష్యం. మొత్తం చెత్తలో 30 శాతం పొడి చెత్త వల్ల (ప్లాస్టిక్ తదితర) ఎలాంటి దుర్వాసన రాదు. ఇంటివద్దనే దాన్ని వేరు చేయడం వల్ల రవాణా ఖర్చు తగ్గుతుంది. గోద్రెజ్, ఐటీసీ వంటి సంస్థలు వీటిని రీసైక్లింగ్ చేస్తాయి. వీటిని వేరుచేసే చెత్త కార్మికులకు నెలకు అదనంగా రూ. 2 వేల నుంచి రూ. 4 వేల వరకు ఆదాయం పెరుగుతుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, స్వచ్ఛ భారత్ లక్ష్యాల మేరకు ఈ కార్యక్రమాల్ని అందరి కంటే ముందే ప్రారంభించాం. ఉద్యమ రూపంలో ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నూరు శాతం చేయడం అంటే వాషింగ్టన్, బెర్లిన్, పారిస్ వంటి నగరాల సరసన చేరడమే. అతిశయోక్తిగా అనిపించినా ఇది వాస్తవం. ప్రశ్న: పారిశుధ్య కార్యక్రమాల అమలులో భాగంగా సింగపూర్ తరహాలో ఫైన్లు వేస్తారా..? కమిషనర్: ఫైన్లు వేయడం కంటే ‘ఫైన్ సిటీ’గా తీర్చిదిద్దడం లక్ష్యం.అన్నీ తెలిసిన విద్యాధికులే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తుండటం, సామాజిక స్పృహ లేకపోవడం దౌర్భాగ్యం. తొలుతే ఫైన్లు వేయకుండా తగిన కౌన్సిలింగ్స్ నిర్వహిస్తాం. అప్పటికీ మారకపోతే డ్రంకెన్ డ్రైవ్ మాదిరిగా చలానా వేసే యోచన ఉంది. ప్రశ్న: దుకాణదారులపై ఎలాంటి చర్యలు చేపడతారు ? కమిషనర్: రోడ్లపై చెత్తవేయడమే కాక ఫుట్పాత్లను ఆక్రమించిన వ్యాపారులకు పోలీసుల సహకారంతో జరిమానాలు విధిస్తాం. జరిమానాలకు వెరవకుండా మళ్లీమళ్లీ పాల్పడితే క్రిమినల్ చర్యలు చేపడతాం. ఇప్పటికే దీన్ని అమలు చేస్తున్నాం. 210 మంది వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 90 మందికి జైలు శిక్షలు పడ్డాయి. ప్రశ్న: బహిరంగ మూత్ర విసర్జన చేసేవారికి ఎలాంటి జరిమానా వేస్తున్నారు?! కమిషనర్: గడచిన 60 ఏళ్లలో నగరంలో 500 ప్రదేశాల్లో మాత్రమే పబ్లిక్ టాయ్లెట్లు ఉండగా, కేవలం మూడు నెలల్లోనే 323 పెట్రోలు బంకుల్లోని టాయ్లెట్లను ప్రజలు వినియోగించుకునే అవకాశం కల్పించాం. ఆమేరకు వారు బోర్డులు కూడా పెట్టారు. హోటళ్లలోని టాయ్లెట్లనూ ప్రజలు వినియోగించుకునేందుకు హోటళ్ల యాజమాన్యాలతో చర్చిస్తున్నాం. దీన్నో ఉద్యమంగా చేపడతాం. ఇంకా అవసరమైన ప్రాంతాల్లో తగిన నిర్వహణతో ఉండేలా పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేస్తాం. ఏడాదిలోగా వీటన్నింటినీ పూర్తిచేస్తాం. -
అమెరికాలో మోదీ ఎఫెక్ట్.. ఓ తల్లి ఆదర్శం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ నినాదం అమెరికాను కూడా తాకినట్లుంది. పెన్సల్వేనియాకు చెందిన ఓ విద్యార్థి.. ఇంటికి వెళ్లినప్పుడు ఇంట్లో చెత్త అంతా ఎక్కడ పడితే అక్కడ పారేశాడు. అక్కడి నుంచి మళ్లీ కాలేజికి వెళ్లిపోయాడు. దాంతో అతగాడి తల్లి అతడికి మర్చిపోలేని బహుమతి ఒకటి పంపారు. 18 ఏళ్ల వయసున్న కానార్ కాక్స్ అనే విద్యార్థి హాస్టల్లో ఉండగా అతడికి తన తల్లి నుంచి రెండు బాక్సులలో పార్సిల్స్ వచ్చాయి. న్యూ విల్మింగ్టన్ ప్రాంతంలోని వెస్ట్ మినిస్టర్ కాలేజిలో అతడు చదువుతున్నాడు. అమ్మ ఏం పంపిందా అని ఆసక్తిగా చూసేసరికి ఒక దాంట్లో బొమ్మలు, ఆహార పదార్థాలు.. ఇలాంటివన్నీ ఉన్నాయి. రెండో దాంట్లో మాత్రం మొత్తం చెత్త ఉంది. పొరపాటున ఏమైనా పంపిందేమోనని అతడు తన తల్లికి ఫోన్ చేశాడు. కానీ ఆమె మాత్రం.. ''అబ్బే పొరపాటు ఏమీ లేదు. అదంతా నువ్వు మొన్న వచ్చినప్పుడు ఎత్తాల్సిన చెత్త'' అని సమాధానం ఇచ్చారు. అప్పుడు పారబోయలేదని దాన్నంతటినీ ప్యాక్ చేసి మరీ పంపారన్న మాట. అది చూసిన కాక్స్.. ఆ విషయాన్ని పదిమందికీ చెప్పాలన్న ఉద్దేశంతో ఆ చెత్తతో నిండిన పెట్టెను ఫొటో తీసి ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాడు. -
మా లక్ష్యం అదే: కేటీఆర్
హైదరాబాద్: స్వచ్ఛ భారత్పై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ‘స్వచ్ఛ సర్వేక్షన్-వావ్ హైదరాబాద్' కార్యక్రమం ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయలు ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, పద్మారావు, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎంపీ సీతారామ్నాయక్, ఎమ్మెల్యేలు గోపీనాథ్, తీగల కృష్ణారెడ్డి, లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, కిషన్రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ జనార్దన్రెడ్డి, స్వచ్ఛ భారత్ అంబాసిడర్ పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ-ఐటీసీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని 'స్వచ్చ్గ్రహి' కావాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత్ను పూర్తిగా మార్చాలని యత్నిస్తున్నారని వెంకయ్య నాయుడు తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమం చేయొద్దని ప్రధాని సూచించారని ఆయన వెల్లడించారు. స్వచ్ఛ భారత్ను ప్రజా ఉద్యమంలా చేపట్టాలన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమం విజయవంతం కాదని అన్నారు. దేశంలోని టాప్ నగరాల్లో హైదరాబాద్ ఉండాలన్నదే తమ లక్ష్యం అని కేటీఆర్ స్పష్టం చేశారు. -
మా లక్ష్యం అదే: కేటీఆర్
-
స్వచ్ఛభారత్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి
జిల్లా పరిషత్ సీఈఓ రామిరెడ్డి ఆత్మకూరురూరల్ : పంచాయతీ కార్యదర్శులు స్వచ్ఛభారత్కు అధిక ప్రాధాన్యం ఇస్తూ గ్రామాల్లో నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా చూడాలని జిల్లా పరిషత్ సీఈఓ రామిరెడ్డి అన్నారు. ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఎంపీడీఓ నిర్మలాదేవితో కలిసి పంచాయతీ కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2015–16 ఏడాదికి పంచాయతీల జమా ఖర్చుల వివరాలు (క్రియోసాఫ్ట్) ఏ మేరకు పూర్తి చేసింది పరిశీలించారు. ఇంకా నమోదు చేయని వారిని మరో వారం రోజుల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్ కోసం 14వ ఆర్థిక సంఘం నిధుల్లో ఒక్కోదానికి రూ.850 చొప్పున చెల్లించాలని ఆదేశించారు. ఇప్పటికీ పంచాయతీ, మున్సిపాలిటీలో 38 అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం లేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ చంద్రశేఖర్, సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఎంఈఓ మణిప్రసాద్, సీడీపీఓ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఆధునికతకు దూరంగా...!
విశ్లేషణ స్వచ్ఛ భారత్ సరే... నీళ్లు లేని టాయ్లెట్ మాటేమిటి, బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా సంవత్సరాలపాటు చేసిన ప్రచార ఫలితమే మరుగుదొడ్లు. తేఢా ఏమిటంటే వీటికి నీటి సరఫరా ఉండదు, తగినన్ని సెప్టిక్ ట్యాంకులు కూడా ఉండవు. ఎవరైనా ప్రకృతి పిలుపు అవసరం పడినప్పుడు తప్పకుండా దాన్ని తీర్చు కోవలసి ఉంటుంది. అందుకనే బర్హాన్ పూర్లోని కుగ్రామం పటిల్పడాలో చిత్రి స్తున్న చిత్రకారుడి కేసి చూస్తున్న పదేళ్ల అబ్బాయిని ఈ విషయమై నేను అడిగి నప్పుడు అతడు బొటన వేలును చూపి ‘అక్కడ మరుగుదొడ్డి ఉంది’ అని చెప్పాడు. ‘ఎవరింట్లో అయినా ఉందా?’అని అడిగితే.. ‘అవును, అక్కడ నీరు లేదు’ అన్నాడతను. మరుగుదొడ్డి అంటే ఏమిటి అనే విషయంలో నగర జీవిత దృక్పథాన్ని అతడు అర్థం చేసుకోవడం అద్భుతమైన విషయం. టాయ్లెట్ అంటే పరిశుభ్రంగానూ, ఉపయోగించుకోదగినది గాను ఉండటం అనే కదా అర్థం. ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలో బర్హాన్పూర్ ఉంటోంది. ప్రస్తుతం పాల్ఘర్ తాలూకాలో ఉన్న ఈ గ్రామాన్ని ఇటీవలే థానే జిల్లా నుంచి వేరు చేశారు. దీంతో థానే దాదాపుగా పట్టణ ప్రాంత జిల్లాగా మారిపోయింది. పాల్ఘర్ దాదాపుగా గ్రామీణ, గిరిజన ప్రాంతం. ఇది చిన్నది, ఒక జిల్లాలో భాగం కాదు కాబట్టి అభివృద్ధి చెందుతుందని ఆశిస్తు న్నారు. మెరుగైన కేంద్రీకరణ, సత్వర పాలనాయంత్రాంగం కోసమే దీన్ని వేరు చేశారు. అయితే నీళ్లు లేని టాయ్లెట్ మాటేమిటి, బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా సంవత్సరాలపాటు చేసిన ప్రచార ఫలి తమే మరుగుదొడ్లు. వీటికి నీటి సరఫరా ఉండదు, తగినన్ని సెప్టిక్ ట్యాంకులు కూడా ఉండవు. కానీ టాయ్లెట్లను నిర్మించడం ద్వారా, భారత్ను స్వచ్ఛంగా ఉంచడానికి జరుగుతున్న ప్రచా రానికి అనుకూలంగా గణాంకాలు రూపొందుతాయి. ఇది ఒక భ్రమాత్మక వంచనతో కూడిన కార్యక్రమం. ఇలాంటి నీళ్లులేని మరుగుదొడ్లు గ్రామాల్లోనే కాదు.. ముంబైలోని మురికివాడల్లో కూడా ఇవి ఉంటున్నాయి. దాదాపు 20 మంది కళాకారులు తమ కుంచెలతో, బొమ్మలు గీయడానికి పెట్టుకునే ఏటవాలు బల్లలతోపాటు, అనువైన ప్రదే శాలను గుర్తించి వాటిని ప్రత్యక్షంగా చిత్రించడానికి గాను పటి ల్పడాకు వచ్చినప్పుడు ఆ కుగ్రామానికి విషమ పరీక్షే మరి. అది కూడా ఈ కళాకారులు నేరుగా రంగంలో ఉండి చిత్రించడానికి వచ్చారు. నీటిరంగు పెయింటింగులో అద్భుతప్రావీణ్యం ఉన్న ముంబై కళాకారుడు అమోల్ పవార్ నిర్వహించిన ఒక వర్క్ షాపులో వీరు భాగం. తన నైపుణ్యాలను ఇతరులకు పంచిపెట్టి వారిని మెరుగుపర్చాలని ఆయన కోరిక. ఉన్నట్లుండి ఒక బస్సు నిండా కళాకారులు తమ ఊరికి వచ్చి దిగడం బర్హాన్పూర్ నివాసులకు ఆశ్చర్యకరమైంది. రెండు రోజుల పాటు, రోజుకు 5 నుంచి 6 గంటలదాకా వీరు గ్రామస్తుల భూముల్లో, ఆవరణల్లో గుమికూడి సందడి చేశారు. కానీ గ్రామ స్తులు ఆ కళాకారులకు చక్కటి ఆతిథ్యం ఇచ్చారు. రెఫరెన్స్ ఫొటో లను తీసుకోవడానికి వారిని తమ ఇళ్లలోకి అనుమతించారు. తమ ఇంటిమెట్లపై కూర్చోనిచ్చారు. ప్రారంభ ఆసక్తి తగ్గిపోయాక, ఈ కొత్త అతిథులతో ఇబ్బంది పడకుండా గ్రామస్తులు తమ రోజు వారీ పనులకు వెళ్లేవారు. కళాకారులు తమ కుగ్రామాన్ని ఎంచు కుని మరీ వచ్చారన్న వాస్తవాన్ని వారు బోధపర్చుకున్నట్లు కనిపిం చింది. ఈ గ్రామంలో 4 వేలమంది నివసిస్తున్నారు. మన కాలనీలలోకి అలా ఎవరయినా వచ్చి ఆక్రమిస్తే అను మతించేవాళ్లమా అని మాకు మేమే ప్రశ్నించుకున్నాం. అలా ఎవ రైనా ఊడిపడితే వంద ప్రశ్నలడిగేవాళ్లం. మన గోప్యతపై వారి దాడి గురించి ఆందోళన చెంది ఉండేవాళ్లం. చివరకు పోలీసులను కూడా పిలిచేవాళ్లం. గుర్తుంచుకోండి. మనం స్పాట్లో రైల్వేస్టేష న్లను చిత్రించలేము. ఎవరైనా సరే రిఫరెన్స్ చిత్రాన్ని ఎవరూ చూడకుండా ఫొటోతీయగలరు, దీని ఆధారంగా తదుపరి పని జరుగుతుంది. కాని ఇక్కడేమిటి.. మేం పెయింటింగులు వేసు కోవడానికి వారు ఊరినే మాకు అప్పగించి వెళ్లారు. ఆశ్చర్యపర్చే రెండో విషయం ఏమిటంటే, గ్రామం ఎంత పొందికగా ఉండేదంటే నీటిరంగులో ముంచిన కుంచెను తుడవ డానికి ఉపయోగించే టిస్యూ పేపర్ని నేలమీద విసిరివేస్తే అది బాధించే పుండులాగా ఉండేది. నిస్సందేహంగా గ్రామం బుర దతో ఉండేది. కానీ ప్రతి ఇంటి ముందు నేలమీద ఉండే ధూళిని ఆవుపేడ కలిపిన నీళ్లతో అలికి మటుమాయం చేసేవారు. ఆ గ్రామంలో ప్లాస్టిక్ సంచులు కానీ, గుట్కా ప్యాకెట్లు కానీ లేవు. గ్రామం పేదదే అయినప్పటికీ పరిశుభ్రంగా ఉండటం మాలో కొందరిని ఆశ్చర్యపరిచింది. ఎలాంటి చెత్తా లేదు. ప్రతిరోజూ ఆవు పేడను ఎండిపోకముందే గ్రామస్తులు సేకరించుకునేవారు. అన్నిటికీ మించి చిన్నదే అయినప్పటికీ గ్రామ ప్రధాన రహదారి మన నగర రహదారులతో పోలిస్తే సాఫీగా ఉండేది. బర్హాన్ పూర్ మా హృదయాలను కొల్లగొట్టిందని మాత్రం చెప్పగలను. ప్రత్యేకించి డిజిటల్ ఇండియాను ముందుకు తీసుకొస్తున్న మోదీ అధికారులకు మాత్రం ఒక విషయం మనం చెప్పితీరాలి. ముంబై-అహ్మదాబాద్ హైవేకి కొన్ని కిలో మీటర్ల దూరంలో ఉన్న సెల్ఫోన్ టవర్ల నుంచి బలహీనమైన సిగ్నల్స్ వెలువడుతుం టాయి. 3జి కవరేజీ కలిగిన స్మార్ట్ ఫోన్లో కూడా ఇంటర్నెట్ పనిచేయదు. నిజానికి హైవేకి దగ్గర ఉండి కూడా మీరు ఇంటికి కాల్ చేయలేరు. గ్రామానికి అవతల ప్రపంచం గురించి ఎవరూ పట్టించుకోరు. మేం బస చేసిన స్థలంలో కనీసం టీవీ కూడా లేని విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. లోకజ్ఞానం విషయంలో నాకు అమితాసక్తి కాబట్టి నేను టీవీని మిస్ కావచ్చు కానీ ఇతరులు అలా భావించినట్లు లేదు. వర్తమాన ఘటనలకు చెందిన వార్తలు వారిలో ఆసక్తి కలిగిస్తు న్నట్లు కనిపించలేదు. మీరు వేటికయినా దూరమయ్యారా అని నా తోటి కళాకారులను కొందరిని ప్రశ్నించాను. అలాంటి ప్రశ్న వేయ వచ్చా అన్నట్లుగా వారు అపనమ్మకం వ్యక్తపరిచారు. బహుశా రాత్రిపూట షోలలో వాగుడుకాయలు చిందించే చెత్తకంటే ఎక్కువ మంది ప్రజలపైనే టీవీ స్టూడియోలు దృష్టి సారిస్తూండవచ్చు. మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ-మెయిల్ : mvijapurkar@gmail.com -
నిలిచిన నిర్మాణాలు
మెదక్ మున్సిపాలిటీ: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛభారత్-స్వచ్ఛ తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబం తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఆదేశాలు జారీచేసింది. నిర్మించుకున్న మరుగుదొడ్లకు బిల్లులు ఇస్తామని ప్రకటించింది. మెదక్ పట్టణంలో పథకం ప్రారంభమై ఏడాది గడుస్తోంది. పట్టణంలో నిర్వహించిన సర్వే ప్రకారం 1782 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1050 మాత్రమే పూర్తయ్యాయి. వాటికి బిల్లులు కూడా చెల్లించారు. మిగిలిన 732లో కొన్నిపూర్తికాగా, 296 నిర్మాణాలు బిల్లులు రాక నిలిచిపోయాయి. బిల్లులు సకాలంలో రాకపోవడంతో నిర్మాణాలు నిలిపివేసినట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం మునిసిపల్ కమిషనర్కు 13 వార్డుకు చెందిన మహిళ తాము మరుగుదొడ్లు నిర్మించుకున్నా బిల్లులు రాలేదని మొరపెట్టుకుంది. రూ.1.17 కోట్లు అందజేశాం.. ఇప్పటి వరకు నిర్మించుకున్న వారికి రూ.1.17 కోట్లు అందజేశామని మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. డీఎంఏ ఆదేశాల మేరకు ఎల్ఆర్ఎస్ నిధుల నుంచి రూ.35 లక్షలు అందజేశామన్నారు. పట్టణంలో మరో 436 మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందని, నిధులు లేక జాప్యం జరుగుతుందన్నారు. ఇందుకుగానూ మరో రూ.69 లక్షలు అవసరం ఉంటుందన్నారు. నిధులు రాగానే పనులు చేపడుతామన్నారు. మూడు నెలలుగా బిల్లులు ఇవ్వడంలేదు.. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకొని మూడు నెలలు గడుస్తున్నా బిల్లులు ఇవ్వడం లేదు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, డబ్బులు మంజూరు చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు పదే పదే చెప్పడంతో మరుగుదొడ్లు నిర్మించుకున్నాం. రింగులు వేసి మూడు నెలలైనా బిల్లులు మంజూరు చేయలేదని 13వ వార్డుకు చెందిన సుజాత వాపోయింది. -
స్వచ్ఛ భారత్ ఈజిప్ట్ విధానమే
వాషింగ్టన్: భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛభారత్ కార్యక్రమంఈజిప్ట్ విధానమని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ అన్నారు. దీనికి ప్రపంచ బ్యాంక్ రూ. లక్ష కోట్లను మంజూరు చేసిందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ విధానాల నుంచి ఆయా దేశాలు స్ఫూర్తిని పొంది అనుసరిస్తున్నాయనడానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. వాషింగ్టన్లో జరిగిన ప్రపంచ బ్యాంక్ దేశాల ప్లీనరీలో ఆయన మాట్లాడారు. -
పని చూడు బాబూ!
అక్షర తూణీరం ఎక్కడ రోడ్లు లేవో, వీధి దీపాలు లేవో తెలుసుకోవ డానికి శాటిలైట్ సాయం అక్కర్లేదు. అవసరాలను, అత్యవసరాలను తెల్పడానికి ఒక్క కార్యకర్త చాలు. కొందరు పనికిరాని పరిజ్ఞానాన్ని పోగుచేస్తూ ఉంటారు. ఎలాగంటే – మన ఆంధ్రప్రదేశ్లో ఒక రోజులో తయారయ్యే పెసరట్లని ఒకచోట పరిస్తే సరిగ్గా ఇరవై రెండున్నర హెక్టార్ల విస్తీర్ణానికి సరి పోతాయి. నవ్యాంధ్రలో ఒక సాయంత్రం వండు తున్న సమోసాలను ఒకచోట పేరిస్తే, ఇంద్రకీలాద్రికి రెట్టింపు పరిమాణంలో ఉంటాయి. రాష్ట్రంలో డేటా వేట జరుగుతున్న వేళ నాకు పెసరట్ల కథనం గుర్తు కొచ్చింది. అశోకుడు చెట్లు నాటించాడు. చెరువులు తవ్వించాడు. రోడ్లు వేయిం చాడని చిన్నప్పటినుంచీ వాచకం పుస్తకాల్లో చదువుకున్నాం. అశోకుడు కాలం నాటికి ఇంతటి సాంకేతిక విజ్ఞానం ఉన్నట్టు లేదు. ఇవన్నీ ప్రజకి అవసరం అనుకున్నాడు. అశోకుడు గప్చుప్గా చేయించాడు. మనకిప్పుడు పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ అయిపోయింది. ప్రతిపనికీ ముందు సర్వే, సూక్ష్మ సర్వే, అతి సూక్ష్మ సర్వేలకు ఆజ్ఞా పించడంతో కథ మొదల వుతుంది. ఆకలిగొన్నవా రెందరు, అర్ధాకలి వారెం దరు.. ఇలా ఆకలిని పది పన్నెండు సూక్ష్మాలుగా వింగడించి, ఐదుగురు నిష్ణాతులు, ఆరు కంప్యూ టర్లు కలిసి పనిచేసి ఒక సమగ్ర నివేదికను సమ ర్పించడం జరుగుతుంది. అసలు పని జరగదుగాని, ఈ హంగామా అంతా ‘‘ఇక ఆకలికి చెక్’’ అన్న వార్తా శీర్షిక కింద నడుస్తూ ఉంటుంది. చివరికి ఏమీ ఉండదు. బెజవాడ కనకదుర్గమ్మ దివ్య సన్నిధిలో రోజుకో మహత్తు వెలుగు చూస్తోంది. శరన్నవరాత్రుల తొలిరోజు యాభైవేల లడ్లు పచ్చబారాయి. ఈగలు, బొద్దింకలు విస్తృతంగా వాటిచుట్టూ కనిపించాయి. అటు అమ్మవారిని ఇటు భక్తుల్ని అనుగ్రహిస్తూ ఆలయ అధికారులు ఆ అరలక్ష లడ్లని పాతర వేశారు. మరో రోజు అధికారులంతా చేరి అమ్మవారి ఆలయాన్ని ఆక్ర మించుకుని ఆ తల్లి సేవలో తరించారు. ఈ భక్తి పారవశ్యంలో నివేదనలు మరిచారు. ఇంకో రోజు వేలాది రూపాయలకు ప్రత్యేక పాస్ల విక్రయాలు జరిగాయి. ఇంకా అగమ్యగోచరమైన విశేషాలు అనేకం. ఇలాంటి వ్యవ హారాలకు ఎంతకాలం విచారణ కావాలి? ఎన్ని నివేదికలు అందుకోవాలి? అదేమన్నా అంటే టెక్నాలజీ వాడకంలో ముందెత్తులో ఉన్నామని ప్రస్తుతి చేసుకోవడం విడ్డూరం. ఇసుక మాఫియా వైనం పత్రికల్లో చదివే దాకా శ్రీవారికి తెలియరాలేదు. భలే ఉంటాయి కబుర్లు. అభివృద్ధి చేయడానికి, అవినీతిని అరికట్టడానికి పెద్ద టెక్నాలజీతో పన్లేదు. ఎక్కడ రోడ్లు లేవో, వీధి దీపాలు లేవో తెలుసుకోవడానికి శాటిలైట్ సాయం అక్కర్లేదు. ఒక ఊరికి ఒక ప్రతినిధి ఉంటే చాలు. అవసరాలను, అత్యవసరాలను తెల్పడానికి ఒక్క కార్యకర్త చాలు. టెక్నాలజీ చాలా అవసరమేగానీ మరీ అంతకాదు. స్వచ్ఛ భారత్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం సంపాదించుకుంది. ఇంద్ర కీలాద్రి సంగతి మోదీ దాకా వెళ్లనీయకండి. (వ్యాసకర్త : శ్రీరమణ ప్రముఖ కథకుడు) -
క్రికెటర్ల ‘స్వచ్ఛ భారత్’
కోల్కతా: మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆదివారం భారత క్రికెటర్లు ’స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. జట్టు కెప్టెన్ కోహ్లి, పుజారా, రహానే, కోచ్ కుంబ్లే తదితర ఆటగాళ్లతో పాటు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కూడా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. వీరంతా ఈడెన్ గార్డెన్స మైదానంలోని ప్రేక్షకుల స్టాండ్లను శుభ్రం చేశారు. -
నిధులతోనే ‘స్వచ్ఛ’మైపోదు
‘స్వచ్ఛ భారత్’పై మోదీ న్యూఢిల్లీ: బడ్జెట్ కేటాయింపులతోనే ‘స్వచ్ఛ భారత్’ సాకారమవ్వదని, అది ప్రజా ఉద్యమంగా మారినప్పుడే లక్ష్యం నెరవేరుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రోడ్లపైనున్న చెత్త ఫొటోలు తీసి ‘స్వచ్ఛ భారత్’ విఫల క్యాంపెయిన్ అంటున్న వారినుద్దేశించి మాట్లాడుతూ... కనీసం ఈ కార్యక్రమంవల్ల ప్రజల్లో పరిశుభ్రతపైఅవగాహన వచ్చిందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. రోడ్లపై చెత్త వేయడానికి తానూ వ్యతిరేకమేనన్నారు. స్వచ్ఛభారత్కు రెండేళ్లయిన సందర్భంగా శుక్రవారమిక్కడ జరిగిన సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. నాడు మహాత్మాగాంధీ ‘సత్యాగ్రహ’ స్ఫూర్తితో ‘స్వచ్ఛాగ్రహ’గా పలికిన మోదీ... పరిశుభ్రతను పరమాత్మతో పోల్చారు. మత సంబంధిత ప్రదేశాల్లోని వ్యర్థాలను కంపోస్టుగా మార్చాలని సూచించారు. చెత్తను రీసైక్లింగ్తో సంపద, ఉపాధి కల్పించే వనరుగా మలచవచ్చన్నారు. ఓ అంగన్వాడీ వర్కర్ తన పాత చీరను కర్చీఫ్లుగా చేసి చిన్నారులకు ఇచ్చారని, తద్వారా వారిలో పరిశుభ్రతపై అవగాహన పెంచారన్నారు. ‘ఈ సమావేశానికి వచ్చే క్రమంలో చాలామంది బస్సు సీట్లకు వేళ్లతో రంధ్రాలు చేసుంటారు. ప్రజాసంపదను సొంత ఆస్తిగా అనుకోవాలి’ అని అన్నారు. -
స్వచ్ఛభారత్ సదస్సుకు ఎంపీడీఓ
ఆమదాలవలస : ఢిల్లీలోని ఇండోశ్యాన్లో ఈ నెల 30న నిర్వహించనున్న స్వచ్ఛ భారత్ సదస్సు కు హాజరు కావాలని ఆమదాలవలస ఎంపీడీవో ఎం.రోజారాణికి ఆహ్వానం వచ్చింది. ఈ మేరకు ఆమె బుధవారం విలేకరుల కు వివరాలు వెల్లడించారు. దేశంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సాధించిన ప్రగతి, భవిష్యత్లో చేపట్టబోయే కార్యక్రమాలపై సదస్సులో చర్చిస్తారని తెలిపారు. ఈ సదస్సుకు హాజరు కావాలని పంచాయతీరాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ జవహార్రెడ్డి నుంచి ఉత్తర్వులు అందాయని చెప్పారు. రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి ఒక్కొక్కరికి ఆహ్వానాలు అందగా, శ్రీకాకుళం జిల్లా నుంచి తనకు అవకాశం వచ్చినట్టు పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రసంగించే స్వచ్ఛభారత్ సదస్సులో హాజరు కానున్నట్టు తెలిపారు. -
తిరువనంతపురం టు ఢిల్లీ
ఎయిర్ఫోర్స్ ఉద్యోగుల సైకిల్యాత్ర స్వచ్ఛభారత్, పర్యావరణ పరిరక్షణపై ప్రచారం అడ్డాకుల: కేరళ రాష్ట్రానికి చెందిన ఎయిర్ఫోర్స్ ఉద్యోగులు స్వచ్ఛభారత్, పర్యావరణ పరిరక్షణపై వినూత్న ప్రచారం చేట్టారు. తిరువనంతపురం (త్రివేండ్రం) నుంచి ఢిల్లీకి సైకిల్యాత్ర చేస్తున్నారు. తిరువనంతపురంలో యిర్ఫోర్స్ వింగ్ కమాండర్ ఎన్ఎస్కే సింగ్ ఆధ్వర్యంలో 12మంది ఉద్యోగులు చేపట్టిన సైకిల్యాత్ర బుధవారం అడ్డాకుల మండలంలో 44వ నంబర్ జాతీయ రహదారి మీదుగా సాగింది. ఆగస్టు 31న తిరువంతపురం నుంచి సైకిల్యాత్రను మొదలుపెట్టారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా వెళ్తున్న ఈ యాత్ర మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలను దాటి అక్టోబర్ 5న ఢిల్లీకి చేరనున్నట్లు చేరుకోనున్నట్లు కమాండర్ ఎన్ఎస్కే సింగ్, ఖమ్మం జిల్లాకు చెందిన సైకిల్ యాత్రికుడు దిలీప్ తెలిపారు. తిరువనంతపురం నుంచి ఢిల్లీకి 3200 కిలోమీటర్ల దూరం సైకిల్యాత్ర సాగుతుందని చెప్పారు. దేశంలో స్వచ్ఛభారత్, పర్యావరణ పరిరక్షణపై విస్త్రృత ప్రచారం జరగాల్సి ఉందన్నారు. మానవ మనుగడలో కీలకపాత్ర పోషించే రెండింటిపై ప్రజలు మరింత చైతన్యవంతులై ముందుకు సాగాలని కోరారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని, అందరూ వ్యక్తిగత మరుగుదొడ్లను వినియోగించాలని ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడేందుకు విశేష కృషి జరగాలని పేర్కొన్నారు. -
గ్రామీణ స్వచ్ఛ భారత్ విజేత సిక్కిం
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల పరిశుభ్రతలో సిక్కిం దేశంలో మొదటి స్థానంలో, జార్ఖండ్ చివరి స్థానంలో నిలిచాయి. గుజరాత్ 14 ర్యాంకు సాధించింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు గతేడాది మొత్తం 26 రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే వివరాల్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి తోమర్ విడుదల చేశారు. ఏపీ 16 వ స్థానంలో నిలిచింది. 2015 మే-జూన్ మధ్యలో ఎన్ఎస్ఎస్ఓ ఈ సర్వే నిర్వహించింది. స్వచ్ఛ భారత్ అమలు అనంతరం జాబితాలో మార్పులు జరిగాయని, అందులో కూడా సిక్కిం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ జాబితాలో తెలంగాణ 22వ స్థానంలో నిలిచింది. మైదాన ప్రాంతాల్లోని 53 జిల్లాల్లో పరిశుభ్రతపై నిర్వహించిన సర్వేలో మహరాష్ట్రలోని సింధుదుర్గ్ మొదటిస్థానంలో నిలిచింది. పర్వత ప్రాంతంలోని మొత్తం 22 జిల్లాల్లో సర్వే నిర్వహించగా హిమాచల్ప్రదేశ్లోని మండీ తొలి స్థానం దక్కించుకుంది. -
రాష్ట్రంలో 5 ఓడీఎఫ్ పట్టణాలు
- బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా ధ్రువీకరించిన కేంద్రం - జాబితాలో సిద్దిపేట, షాద్నగర్, సూర్యాపేట, అచ్చంపేట, హుజూర్నగర్ - భువనగిరికి తిరస్కరణ.. పరిశీలనలో మరో ఆరు పట్టణాలు సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) కింద రాష్ట్రంలోని ఐదు పట్టణాలు బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్) ప్రాంతాలుగా ధ్రువీకరణ పొందాయి. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ప్రక్రియలో సిద్దిపేట, షాద్నగర్, సూర్యాపేట, అచ్చంపేట, హుజూర్నగర్లను ఓడీఎఫ్ ప్రాంతాలుగా నిర్ధారించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. ఓడీఎఫ్ కోసం భువనగిరి పట్టణం చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. అయితే దీనిని మరోసారి తనిఖీ చేస్తామని వెల్లడించింది. పట్టణ ప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మిషన్ పురోగతిని కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు సోమవారం ఢిల్లీలో సమీక్షించారు. ఓడీఎఫ్ గుర్తింపు కోసం ఇటీవల దేశవ్యాప్తంగా 11 పట్టణాలు ప్రతిపాదనలు పంపుకోగా.. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తనిఖీ చేయించింది. అందులో తెలంగాణలోని ఐదు పట్టణాలు సహా 10 పట్టణాలను ఓడీఎఫ్గా ధ్రువీకరించింది. మొత్తంగా దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 141 పట్టణాలు బహిరంగ మల విసర్జన రహిత పట్టణాలుగా గుర్తింపుకోసం ప్రతిపాదించాయి. దీంతో ఆయా పట్టణాలలో థర్డ్ పార్టీ తనిఖీలు చేస్తున్నారు. పరిశీలన పూర్తయిన కొద్దీ.. నిర్ధారణను జారీ చేస్తున్నారు. రాష్ట్రంలోని గజ్వేల్, ఇబ్రహీంపట్నం, జగిత్యాల, మధిర, సత్తుపల్లి, సిరిసిల్ల కూడా ఓడీఎఫ్ హోదా కోసం ప్రతిపాదించాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తెలిపింది. రాష్ట్రాల నుంచి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు అందుతున్న నివేదికలను బట్టి.. వచ్చే ఏడాది నాటికి 974 నగరాలు, పట్టణాలు బహిరంగ మల విసర్జన రహితంగా మారనున్నాయి. అందులో ఏపీకి చెందిన 112 పట్టణ ప్రాంతాలు, తెలంగాణలోని 37 పట్టణాలు ఉన్నాయి. ఓడీఎఫ్ గుర్తింపు ఇలా.. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ప్రొటోకాల్ ప్రకారం ఓడీఎఫ్ గుర్తింపు కోసం ముందుగా వార్డులు, పట్టణం స్వయంగా ఓడీఎఫ్గా ప్రకటించుకుని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు నివేదిక అందించాలి. తర్వాత 30 రోజుల్లో ఆ శాఖ తనిఖీ చేయిస్తుంది. సేవా స్థాయి అంచనా (నిర్మాణం, గృహ లభ్యత, కమ్యూనిటీ, ప్రజా మరుగుదొడ్లు), స్వతంత్ర పరిశీలనల అంచనా ఆధారంగా నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతుంది. నగరం లేదా పట్టణంలో కనీసం ఒక మురికివాడలో, పాఠశాల, ప్రభుత్వ మార్కెట్ లేదా మతపరమైన స్థానంలో, నివాస ప్రాంతం, బస్టాండ్, రైల్వేస్టేషన్లలో తనిఖీలు చేస్తారు. 5 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న నగరంలో కనీసం 9 చోట్ల, 5 లక్షల కంటే అధిక జనాభా ఉన్న నగరాల్లో కనీసం 17 చోట్ల పరిశీలన జరుపుతారు. రోజు మొత్తంగా ఏ సమయంలో కూడా ఒక వార్డ్లోగానీ, పట్టణంలోగానీ ఒక్కరు కూడా బహిరంగ మల విసర్జన చేయకపోతే బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతంగా నిర్ధారిస్తారు. -
స్వచ్ఛభారత్కు సాహిత్య ప్రచారం
కోట: విద్యానగర్ ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమంపై జాతీయ స్థాయి కవిసమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త, కవి పెరుగు రామక్రిష్ణ సమన్వయకర్తగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛభారత్కు ప్రచారం కల్పించడంలో తమవంతు పాత్ర పోషించాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు కవులు తెలిపారు. ఈ సందర్భంగా పెరుగు రామక్రిష్ణ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ ద్వారా సామాజిక సమైక్యత సాధించాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ నుంచి మోహన్, కర్ణాటక నుంచి రమేష్, తమిళనాడు నుంచి షణ్ముఖం, ఏపీ నుంచి సరోజినీదేవి, పలువురు ఎన్బీకేఆర్ విద్యార్థులు తమ రచనలను తెలిపారు. కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ విజయకుమార్రెడ్డి, స్వచ్ఛభారత్ జిల్లా కోఆర్డినేటర్ సుస్మితారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
లక్ష్మీదేవి ఎందుకెళ్లిపోతుందో తెలుసా?
సంపదతోపాటు, సుఖసంతోషాలను ఇచ్చే దేవత లక్ష్మీదేవి. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సంపద సమృద్ధిగా ఉంటుందని చాలామంది భారతీయుల విశ్వాసం. అందుకే పొద్దున్నలేవగానే లక్ష్మీదేవికి నిష్ఠగా పూజలుచేసి.. స్తోత్రాలను పఠిస్తూ ఉంటారు. మరీ అలాంటి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో తెలుసా.. తమ ఇంటితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేవారి ఇంట్లోనే లక్ష్మీదేవి తాండవం ఆడుతుందట. ఎవరైతే శుభ్రతను పాటిస్తారో వారు దేవుడికి సన్నిహితంగా ఉంటారని ఒక నానుడి. అదే నానుడిని నిజంచేస్తూ ఎవరైతే శుభ్రతను పాటిస్తూ.. తమ ఇంటిని, పరిసరాలను ఎవరైతే స్వచ్ఛంగా ఉంచుకుంటారో వారి ఇంటిలోనే లక్ష్మీదేవి పీటవేసుకొని పదిలంగా ఉంటుందని, ఎవరైతే పరిసరాలను నిర్లక్ష్యంగా చెత్తచెదారంతో నింపివేస్తారో వారి నుంచి దూరంగా వెళ్లిపోతుందని సందేశం ఇస్తూ.. 'స్వచ్ఛభారత్' షార్ట్ ఫిలిం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత ఇష్టమైన పథకమైన 'స్వచ్ఛభారత్' ప్రచారం కోసం రూపొందించిన ఈ షార్ట్ఫిలింలో లక్ష్మీదేవిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అలరించగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన గళాన్ని ఇచ్చారు. ఇషా కోప్పికర్, రవికిషాన్, ఓంకార్ కపూర్ వంటి ప్రముఖులతో రూపొందిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. శుభ్రత ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తూ స్వచ్ఛతను పాటించకపోతే లక్ష్మీదేవి మిమ్మల్ని వదిలిపొతుందనే సందేశంతో ఈ న్యూ యాడ్ ఫిలిం రూపొందింది. -
స్వచ్ఛభారత్లో నెల్లూరు రైల్వే స్టేషన్ ఫస్ట్
నెల్లూరు(సెంట్రల్) ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైల్వే స్టేషన్లలో నెల్లూరు రైల్వేస్టేషన్కు స్వఛ్చ భారత్లో ప్రథమ స్థానం లభించింది. విజయవాడ నుంచి తడ వరకు ఉన్న మొత్తం రైల్వే స్టేషన్లను కొన్ని నెలల క్రితం కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక బృందం తనిఖీలు నిర్వహించింది. అందులో నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్కు ప్రథమ స్థానం ఇచ్చారు. ఈ సందర్భంగా స్టేషన్ మేనేజర్ ఆథోని జయరాజ్ మాట్లాడుతూ దేశంలో 407 ప్రధాన రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారన్నారు. బృందం పరిశీలించిన అనంతరం నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ 28వ స్టేషన్గా నిలించిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. స్టేషన్లలో సౌకర్యాల కల్పనలోతో పాటు ప్రయాణికులకు ఇచ్చే అన్ని సౌకర్యాలపై పరిశీలించి నివేదిక తయారు చేశారని తెలిపారు. అందులో కేంద్రం పరిశీలించి నెల్లూరును ఏపీలో నంబర్–1 స్టేషన్గా పేర్కొనిందన్నారు. -
గుంటూరు అత్తగారికి ప్రధాని ప్రశంస
న్యూఢిల్లీ: గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం బొల్లవరానికి చెందిన ఓ అత్తగారు తన కోడలికి ఇచ్చిన బహుమానం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కోడలి ఆత్మగౌరవం కాపాడేందుకు ఆమె చేసిన ప్రయత్నాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం అభినందించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న 'స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్' వెబ్ సైట్ లో గుంటూరు అత్తగారి గురించి ఇలా రాసుంది.. ఆమె పేరు షంషున్. ఊరు గుంటూరు జిల్లా బొల్లవరం. గత ఏడాది తన కుమారుడికి వివాహం సందర్భంగా షంషున్.. కోడలు సల్మాకు మరుగుదొడ్డిని బహుమానంగా ఇచ్చింది. 'పేదరికంలో పుట్టిన నేను బహిర్భూమికే తప్ప టాయిలెట్ రూమ్ ఎరగనను. బయటికి వెళ్లాల్సిన సందర్భంలో ముఖ్యంగా వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడ్డాను. ప్రతిసారి అవమానభారంతో కుంగిపోయేదాన్ని. కానీ కాలం అలా గడిచిపోయింది. నా పిల్లలూ అలానే పెరిగారు. ఇంట్లో మరుగుదొడ్డి లేని కారణంగా బంధువులెవ్వరూ మా ఇంటికి రారు. పొయిన సంవత్సరం కొడుకు మా కొడుక్కి పెళ్లి ఖాయం చేసుకున్నాం. వచ్చే అమ్మాయి చెంబు పట్టుకుని బయటికి వెళ్లడాన్ని నేను ఊహించుకోలేకపోయా. అందుకే టాయిలెట్ కట్టించాల్సిందేనని నిర్ణయించుకున్నా. గవర్నమెంట్ ఇంచ్చేదానికితోడు సొంత డబ్బు నాలుగు వేలు పెట్టి బ్రహ్మాండమైన టాయిలెట్ కట్టించా. కొత్త కోడలికి దానిని బహుమతిగా ఇచ్చా. ఇప్పుడామె గర్భవతి. అంతా సంతోషం..' అంటూ తన గాథ చెప్పుకొచ్చింది షంషున్. ఇలాంటి ఎన్నో నిజజీవిత గాథలతో టాయిలెట్ల నిర్మాణాలపై అవగాహన కల్పిస్తోంది స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ ప్రయత్నాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. Launch of @SwachhBharat Gramin August campaign is a great step to ensure #FreedomFromOpenDefecation in India. Best wishes to the campaign. — Narendra Modi (@narendramodi) 2 August 2016 Swachhta Samachar (Inaugural Issue) August 2016.#TransformingIndia #SwachhBharat pic.twitter.com/geYCKPDYuy — Narendra Singh Tomar (@nstomar) 2 August 2016 -
దేశంలోని 10 ప్రసిద్ధ ప్రాంతాల్లో స్వచ్ఛభారత్ !
న్యూఢిల్లీ: దేశంలోని 10 ప్రసిద్ధ ప్రదేశాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛభారత్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించి ఆ ప్రాంతాలను గుర్తించింది. ప్రపంచ బ్యాంకు సాంకేతిక సహకారంతో అంతర్జాతీయ నిపుణుల సాయంతో ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తోంది. ప్రసిద్ధి పొందిన 10 చరిత్రాత్మక ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్వచ్ఛతను తీసుకురావాలని భావిస్తున్నట్లు కేంద్ర కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ వెల్లడించారు. కేంద్రం గుర్తించిన ప్రముఖ ప్రాంతాల్లో తాజ్మహల్ (ఆగ్రా), మణికర్ణిక ఘాట్ (ఉత్తరప్రదేశ్), వైష్ణోదేవీ (జమ్మూ కశ్మీర్), మీనాక్షి ఆలయం (మదురై), తిరుపతి (ఆంధ్రప్రదేశ్), ఛత్రపతి శివాజీ టెర్మినస్ (మహారాష్ట్ర), అజ్మీర్ షరీఫ్ (రాజస్తాన్), స్వర్ణ దేవాలయం (పంజాబ్), కామాక్షి దేవాలయం (తమిళనాడు), జగన్నాథపురి (ఒడిశా) ఉన్నాయి. -
మోదీ పాలన ఆదర్శప్రాయం
► గతంలో కేంద్రంలో కుటుంబపాలన సాగింది ► బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణ దిలావర్పూర్ : గతంలో దేశంలో పాలించిన సర్కారు కారణంగా అభివృద్ధి కుంటుపడిందని, కానీ ప్రస్తుతం నరేంద్రమోదీ పాలన ఆదర్శప్రాయంగా సాగుతోందని బీజేపీ నేత, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణ అన్నారు. ‘గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి’ అనే నినాదంతో చేపట్టిన దేశవ్యాప్త ప్రచారోద్యమంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని నర్సాపూర్(జి) గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి నుంచి పంచాయతీరాజ్ వికాస్ దివస్ వరకు ఈ ప్రచారోద్యమ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో అనేక కార్యక్రమాలను చేపడుతోంద ంటూ పలు పథకాల గురించి వివరించారు. అంబేద్కర్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వడంలో, పార్లమెంట్లో చిత్రపటాన్ని ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదేనని గుర్తు చేశారు. రాష్ర్ట ప్రభుత్వం తామే చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న పలు కార్యక్రమాల్లో కేంద్రప్రభుత్వ వాటానే అధికంగా ఉందని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావుల రాంనాథ్ మాట్లాడుతూ, నేడు రాష్ట్రంలో పాలన గాడితప్పుతోందని విమర్శించారు. ఆదిలాబాద్ను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్చేశారు. పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు అయ్యన్నగారి భూమయ్య, నాయకులు సుధాకర్, ఒడిసెల శ్రీనివాస్, మెడిసెమ్మ రాజు, మండల అధ్యక్షుడు బర్కుంట నరేందర్, సామరాజేశ్వర్రెడ్డి, రాజేందర్ పాల్గొన్నారు. -
'స్వచ్ఛభారత్ చేతల్లో చూపండి'
ముంబై: స్వచ్ఛభారత్ పేరుతో ఫోటోలు దిగడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని శుభ్రత కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని ప్రధానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మోదీకి చురకలంటించారు. ఈశాన్య ముంబైలోని దేవనార్ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద డంపింగ్ యార్డ్ ను మంగళవారం రాహుల్ పరిశీలించారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం స్వచ్ఛభారత్ కోసం మరింత కృషి చేయాల్సింది పోయి అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. డంపింగ్ యార్డులో చెత్త కాల్చడంతో పర్యావరణ కాలుష్యం పెరిగి ముంబై వాసులు అనేక దీర్ఘకాలక వ్యాధుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చెంబూర్ ప్రాంతంలో చిన్న పిల్లలు సైతం టీబీ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని రాహుల్ ప్రస్తావించారు. ఇక్కడ చెత్తను మండించడం ద్వారా వస్తున్న పొగ శాటిలైట్ నుంచి కూడా కనిపించిన విషయాన్ని గుర్తుచేశారు. స్వచ్ఛభారత్ గురించి చెప్పడం, ఆచరణ రెండూ వేరని ప్రభుత్వాన్ని విమర్శించారు. ముంబై నగరం దేశ అభివృద్ధికి చిహ్నంగా ఉండాలని ఇలా కాలుష్యంతో రోగాల బారినపడ్డ ప్రజలతో కాదని రాహుల్ అన్నారు. జనావాసాలకు దూరంగా డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేశారు. -
మందుబాబులకు స్వచ్ఛభారత్
బంజారాహిల్స్: మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపిన ఐదుగురికి ఎర్రమంజిల్ ప్రత్యేక కోర్టు బుధవారం స్వచ్ఛభారత్లో పాల్గొనాలని తీర్పు చెప్పింది. ఈ మేరకు వారంతా బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణను బుధవారం శుభ్రం చేశారు. శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వీరందరికీ కోర్టు ఈ శిక్షను విధించింది. పోలీస్ స్టేషన్లో వృధాగా పడి ఉన్న వస్తువులను ఒక చోటకు చేర్చారు. చిందరవందరగా ఉన్న సామగ్రిని క్రమపద్ధతిలో అమర్చారు. ప్రధాన రహదారి కూడలిలో ట్రాఫిక్ విధులు కూడా వారు నిర్వహించారు. -
స్వచ్ఛ్భారత్ స్ఫూర్తితో విద్యార్థిని ముందడుగు
పట్టుబట్టి ఇంట్లో మరుగుదొడ్డి సాధించిన విద్యార్థిని తుమకూరు(కర్ణాటక): స్వచ్ఛ్భారత్ స్పూర్తితో ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణాన్ని పట్టుబట్టి సాధించిందో విద్యార్థిని. కర్ణాటకలోని తుమకూరు జిల్లా హాలేనహళ్లిలో నివసించే దేవరాజు, భాగ్యమ్మల కూతురు లావణ్య. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆర్థికస్తోమత లేకపోవడంతో తండ్రి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించలేదు. పరిసరాల పరిశుభ్రతపై చైతన్యవంతురాలైన లావణ్య మరుగుదొడ్డి ఉండాల్సిందేనని గత కొద్ది నెలలుగా తల్లిదండ్రులతో వాదిస్తోంది. మూడు నెలల క్రితం ఉపవాస దీక్ష చేపట్టింది. దీంతో తల్లిదండ్రులు దిగిరాకతప్పలేదు. వెంటనే పంచాయతీ కార్యాలయానికి వెళ్లి స్వచ్ఛ్భారత్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి దరఖాస్తుచేశారు. నిధులు మంజూరవడంతో వెంటనే నిర్మాణం పూర్తిచేశారు. దీంతో లావణ్య విషయం ప్రసార మాధ్యమాల్లో మార్మోగింది. ఈ విషయం తెలుసుకున్న యూనిసెఫ్ బృందం సభ్యుడు కృష్ణ, జెడ్పీ సీఈఓ డాక్టర్ మమత శనివారం గ్రామానికి వెళ్లి లావణ్యను అభినందించారు. పరిశుభ్రతపై అవగాహన కల్పించడానికి లావణ్యను రాయబారిగా నియమిస్తామని ప్రకటించారు. లావణ్యపై లఘుచిత్రం తీసి దేశమంతా ప్రసారం చేస్తామని కృష్ణ తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెను అవార్డుతో సత్కరించాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. -
సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ‘స్వచ్ఛభారత్’
చీపుర్లు పట్టిన డాక్టర్లు, సిబ్బంది మొక్కలు నాటినఏసీఎంవో డాక్టర్ బీవీ.రావు గోదావరిఖని : ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపుమేరకు గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరి 21వ తేదీన ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతీ శనివారం కొనసాగుతోంది. శనివారం నాటికి స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రారంభించి ఏడాది అయిన సందర్భంగా ఆస్పత్రి ఏసీఎంవో డాక్టర్ వెంకటేశ్వర్రావు ప్రత్యేకంగా రూపొందించిన గార్డెన్లో పూలమొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలు బాగుంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారన్నారు. అందువల్లనే రోగులకు దోమలు నిల్వ ఉండకుండా చెత్తను ఎత్తి పారపోస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు జీఎన్.మూర్తి, మద్దిలేటి, విశ్వమేధి, శౌరి, రవీంద్ర, రాజేశ్వర్, నర్సులు సుజాత, అమ్ములు, వేదవతి, కుసుమ, నాగమణి, తెరిసరాణి, సిబ్బంది దేవేందర్రెడ్డి, కనకయ్య, ఉన్నితన్, ముని, సన్యాసి, గాంధీ, సింహాచలం, శ్రీను, బాబూరావు, సుధాకర్, రత్మం, డైటీషియన్ ఎప్సీబా, మాడేటి లక్ష్మి, స్వరూప, జయ, అలియమ్మ, పద్మ, స్వరూప, సుశీల, మల్లయ్య, మోహన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. గోదావరిఖని : ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపుమేరకు గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరి 21వ తేదీన ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతీ శనివారం కొనసాగుతోంది. శనివారం నాటికి స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రారంభించి ఏడాది అయిన సందర్భంగా ఆస్పత్రి ఏసీఎంవో డాక్టర్ వెంకటేశ్వర్రావు ప్రత్యేకంగా రూపొందించిన గార్డెన్లో పూలమొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలు బాగుంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారన్నారు. అందువల్లనే రోగులకు దోమలు నిల్వ ఉండకుండా చెత్తను ఎత్తి పారపోస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు జీఎన్.మూర్తి, మద్దిలేటి, విశ్వమేధి, శౌరి, రవీంద్ర, రాజేశ్వర్, నర్సులు సుజాత, అమ్ములు, వేదవతి, కుసుమ, నాగమణి, తెరిసరాణి, సిబ్బంది దేవేందర్రెడ్డి, కనకయ్య, ఉన్నితన్, ముని, సన్యాసి, గాంధీ, సింహాచలం, శ్రీను, బాబూరావు, సుధాకర్, రత్మం, డైటీషియన్ ఎప్సీబా, మాడేటి లక్ష్మి, స్వరూప, జయ, అలియమ్మ, పద్మ, స్వరూప, సుశీల, మల్లయ్య, మోహన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ముక్కుపు‘ఠా’లు
పల్లెకు పోదాం..సందడి చేద్దాం.. చలో..చలో.. కాలుష్యం లేని పచ్చదనంతో ప్రశాంత వాతావరణం, కల్మషం లేని మనసులతో ఆత్మీయ పలకరింపులు, ఎవరికి ఏ అవసరమొచ్చినా పదిమందీ గుమిగూడడం..కొత్తవారితో అమాయకంగా మాటలు..ఒకరికొకరు సహాయం చేసుకోవడం..పండగొచ్చిందంటే అంతా కలిసి జరుపుకోవడం..అందరి మదిలో మెదిలే అద్భుత భావన ఇది. ఈ వాతావరణాన్ని పల్లెల్లో ఆస్వాదించడానికి వెళ్లేవారు ఇప్పుడు ముక్కుమూసుకుని అక్కడ అడుగు పెట్టాల్సిందే. చాలామంది ఇళ్లలో మరుగుదొడ్లు లేని కారణంగా గ్రామాల్లో రోడ్ల వెంబడి.. ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడ బడితే అక్కడ బహిరంగ మలమూత్ర విసర్జన జరుగుతున్న పరిస్థితి ఇప్పుడు వెగటు పుట్టిస్తోంది. శృంగవరపుకోట రూరల్: దేశ ప్రధాని ‘స్వచ్ఛభారత్’ పిలుపులో భాగంగా ఈ ఏడాది అమలు చేస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జిల్లాలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం చేయించిన సర్వే మేరకు జిల్లాలో మరుగుదొడ్లు లేని ఇళ్లు 3,01,458 ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కలెక్టర్ క్షేత్రస్థాయిలో అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించి ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నప్పటికీ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతి ఇలా.. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రగతి జిల్లాలో అథమంగానే ఉంది. జిల్లాలోని 34 మండలాల్లో 3,01,458 మరుగుదొడ్లు లేని ఇళ్లకు గాను 94,442 ఇళ్లకు మరుగుదొడ్లు మంజూరు చేశారు. వీటిలో ఇప్పటివరకు 12,428 మరుగుదొడ్లు పూర్తయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా శృంగవరపుకోట మండలంలో 177, బాడంగి 282, బలిజిపేట 59, భోగాపురం 111, బొబ్బిలి 386, బొండపల్లి 216, చీపురుపల్లి 166, దత్తిరాజేరు 230, డెంకాడ 275, గజపతినగరం 32, గరివిడి 143, గుమ్మలక్ష్మీపురం 416, గుర్ల 140, జామి 12, జియ్యమ్మవలస 181, కొమరాడ 17, కొత్తవలస 224, కురుపాం 278. లక్కవరపుకోట 391, మక్కువ 147, మెంటాడ 92, మెరకముడిదాం 14, నెల్లిమర్ల 142, పాచిపెంట 888, పార్వతీపురం 622, పూసపాటిరేగ 206, రామభద్రపురం 210, సాలూరు 169, సీతానగరం 144, తెర్లాం 205, వేపాడ 326, విజయనగరం 191 మొత్తంగా 7685 మరుగుదొడ్ల నిర్మా ణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే నిర్మించిన మరుగుదొడ్లకు ప్రభుత్వ అధికారులు చెప్పినట్లుగా నిధులు వెంటవెంటనే మంజూరు చేయకపోవడం కూడా ప్రగతికి అవరోధంగా నిలిచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సామూహిక మరుగుదొడ్లే ప్రత్యామ్నాయం.. ఇళ్లల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవడం అంటే మహిళల ఆత్మ గౌరవానికి భంగపాటని అధికారులు గ్రామస్థాయిలో అవగాహన క ల్పిస్తూ మరుగుదొడ్లకు నిధులు మంజూరు చేస్తామన్నా ఇళ్లల్లో స్థలాభావంతోనే మరుగుదొడ్డి నిర్మాణానికి వెనుకడుగు వేసే పరిస్థితి ఒక కారణంగా కనిపిస్తోంది. అది కాకుండా మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి బిల్లుల మంజూ రులో జాప్యం జరుగుతుండడం మరో కారణంగా కనిపిస్తోంది. అప్పులు చేసి మరుగుదొడ్డి నిర్మిస్తే బిల్లులందక పోతే అప్పులు తీర్చడమెలా అని శంకిస్తూ చాలామంది ముందుకు రావడం లేదని స్పష్టమవుతోంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ముందుగా పలు గ్రామాలను ఎంపిక చేసి సామూహిక మరుగుదొడ్లను ప్రభుత్వ స్థలాల్లో నిర్మించి వాటికి పూర్తిస్థాయిలో నీరు, విద్యుత్ వంటి సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రతిరోజూ పంచాయ తీ సిబ్బంది పర్యవేక్షణ ఉండేలా చూస్తేనే ఆనుకున్న సత్ఫలితాలు వస్తాయని పలువురు భావిస్తున్నారు. నిర్మాణ బాధ్యతలు ఉపాధి పథకానికి? స్వచ్ఛభారత్ పథకంలో అనుకున్నంతగా నిధులు లేనందున ఇక నుంచి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ బాధ్యతలు ఉపాధిహామీ పథకానికి అప్పగించనున్నట్టు అధికారిక సమాచారం. జిల్లా వ్యాప్తంగా 34 మండలాల ఉపాధి పథకం ఏపీఓలకు మరుగు దొడ్ల నిర్మాణాలకు సంబంధించి ఇటుకలు, బేసిన్లు ముందుగానే సిద్ధం చేసుకున్న అనంతరం శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఉపాధి సిబ్బం దితో జిల్లా ఉన్నతాధికారులు సమాలోచనలు జరుపుతున్నట్టు తెలిసింది. -
ఆ పని చేస్తే సత్కారం తప్పదు..
రాంగోపాల్పేట్ (హైదరాబాద్) : బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తున్న ప్రబుద్ధులకు సత్కారం చేయనున్నారు! బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసేవారిలో మార్పు తెచ్చేందుకు 'స్వచ్ఛ భారత్' లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్టేషన్ చుట్టుపక్కల ఆరు బయట మూత్ర విసర్జన చేస్తున్నవారి దగ్గరకు వెళ్లి వారికి దండ వేసి సత్కరించి ఒక గులాబి పువ్వు ఇచ్చి మరోసారి ఇలాంటిది చేయవద్దని హితవు పలుకనున్నారు. ప్రభుత్వం స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో పరిశుభ్రమైన నగరాల కోసం కృషి చేస్తుంటే ఇలా రోడ్లన్నీ అపరిశుభ్రం చేయడం మంచిది కాదని సూచిస్తారు. ఉత్తర మండలంలోని మహంకాళి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామస్వామి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో గురువారం ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ప్రజల్లో మార్పు తెచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ రామస్వామి తెలిపారు. -
స్టార్టప్లకు పేటెంట్ ఫ్రీ
మరిన్ని నిబంధనలు సడలించే యోచనలో సర్కారు న్యూఢిల్లీ: వినూత్న ఆలోచనలతో స్టార్టప్లను ప్రారంభించే యువ వ్యాపారవేత్తలకు మరిన్ని రాయితీలు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. వ్యాపారవేత్తల ఉత్పత్తులకు, ఆలోచనలకు ఇవ్వాల్సిన పేటెంట్, ట్రేడ్మార్క్, డిజైన్పై పేటెంట్ హక్కుకు పెట్టుకునే దరఖాస్తు ఖర్చును ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. స్టార్టప్లు కేవలం చట్టపరంగా చెల్లించాల్సిన రశీదు చెల్లిస్తేసరిపోతుంది. మిగతాదంతా ప్రభుత్వమే చూసుకుంటుందని..ప్రభుత్వం విడుదల చేసిన కార్యాచరణ ప్రణాళిక స్పష్టం చేసింది. ఇందుకోసం కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్ అండ్ ట్రేడ్మార్క్ నేతృత్వంలో ఓ ప్యానెల్ను కేంద్రం ఏర్పాటుచేయనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వ్యాపారుల హక్కులను కాపాడటంతోపాటు మేధో సంపత్తి హక్కులపై అవగాహన పెరుగుతుందని జాతీయ మేధో సంపత్తి సంస్థ (ఎన్ఐపీఓ) అధ్యక్షుడు టీసీ జేమ్స్ తెలిపారు. స్వచ్ఛభారత్పై సెక్రటరీల ప్రజెంటేషన్ పాలనలో మార్పుకోసం పలువురు ఉన్నతస్థాయి అధికారులతో ఏర్పాటుచేసిన సెక్రటరీల బృందాలు నాలుగు ఆదివారం ప్రధాని మోదీకి ‘స్వచ్ఛభారత్, శిక్షిత్ భారత్’పై ఐడియాలను అందజేశాయి. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన పవర్పాయింట్ ప్రజెంటేషన్లో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను అందరికీ అందేలా చేసేందుకు ఐడియాలు ఇవ్వాలంటూ వివిధ విభాగాల అధికారులతో ఎనిమిది సెక్రటరీల బృందాలను ప్రధాన మంత్రి ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. -
బీజేపీ ఆఫీసుల్లో టాయ్లెట్స్ చూడండి!
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మానస పుత్రికైన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ఎంత ఊదరగొడుగుతున్నా ఆయన పార్టీ బీజేపీకి చెందిన నేతలకు మాత్రం అది చెవికెక్కుతున్నట్టు లేదు. సాక్షాత్తు ఢిల్లీలోని పండిట్ పంత్ మార్గ్ లోని బీజేపీ కార్యాలయంలోనే సరైన మరుగుదొడ్ల సౌకర్యం లేదు. ఎన్నోసార్లు ఈ అంశాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదని ఆ పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. ఉన్న మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడం వల్ల కంపుకొడుతున్నాయని వారు వాపోతున్నారు. ముఖ్యంగా మహిళలకు సరైన మరుగు దొడ్లు లేవని అంటున్నారు. బీజీపీ ఢిల్లీ శాఖకు చెందిన కార్యాలయంలో కూడా ఇలాంటి అధ్వాన్న పరిస్థితే కొనసాగుతోంది. బీజేపీ అధికారంలోవున్న మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తమ మున్సిపల్ పరిధిలో ఏడాదిలో ఏడెనిమిది లక్షల మరుగు దొడ్లను నిర్మిస్తామని పార్టీ నేతలు గొప్పగా ప్రకటించారు. ఏడాది గడిచినా వందకు మించి మరుగుదొడ్లు నిర్మించిన దాఖలాలు కనిపించడం లేదు. బీజేపీ పార్టీ కార్యాలయం తన నియోజక వర్గం పరిధిలో ఉన్నందున తన నియోజకవర్గం నిధులతో తానే స్వయంగా శుభ్రమైన మరుగు దొడ్లు కట్టిస్తానని, అందుకు అనుమతించాలంటూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్కు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ స్వయంగా లేఖ రాశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతేడాది ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట నుంచి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ‘స్వచ్ఛ భారత్’ పథకాన్ని ఘనంగా ప్రకటించడం తెల్సిందే. ఈ కార్యక్రమం అమలు కోసం ప్రత్యేకంగా వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించారు కూడా. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం కోసం సెలబ్రటీలను అంబాసిడర్లుగా నియమించిన విషయమూ తెల్సిందే. పథకాన్ని ప్రకటించిన పార్టీనే పట్టించుకోకపోతే ప్రజలెలా ముందుకు కదులుతారు? -
వెంకయ్య నాయుడుతో బిల్ గేట్స్ భేటీ
-
వెంకయ్య నాయుడుతో బిల్ గేట్స్ భేటీ
న్యూఢిల్లీ: పరిశుభ్రత కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమానికి అవసరమైన సాయాన్ని అందిస్తానని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ స్పష్టంచేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్యనాయడుతో బిల్గేట్స్ భేటీ అయ్యారు. తమ సంస్థ చేపట్టిన కార్యక్రమాలలో 'స్వచ్ఛ భారత్'లో భాగస్వాములవ్వడం ఓ ఉత్తమ పని అంటూ వ్యాఖ్యానించారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్తో సమావేశంలో భారత్లో పట్టణాలలో పరిశుభ్రత కోసం చేపట్టిన కార్యక్రమాలను, వాటి పనితీరును కేంద్ర మంత్రి వెంకయ్య వివరించారు. ఈ ఫౌండేషన్ వారు స్వచ్ఛ భారత్ మిషన్కు చేయూత అందించేందుకు ఈ ఏడాది జనవరిలో ఒప్పందం చేసుకున్న విషయం విదితమే. ఆఫ్రికాలో భారీ ఎత్తున వ్యక్తిగత టాయిలెట్లు నిర్మించినప్పటికీ వాటి వాడకం మాత్రం మామూలుగానే ఉందని బిల్ గేట్స్ గుర్తుచేశారు. వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి స్వచ్ఛభారత్ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంచుతామని కేంద్ర మంత్రి వెంకయ్య పేర్కొన్నారు. -
రాహుల్ కు చుక్కలు చూపించిన అమ్మాయిలు!
-
రాహుల్ కు చుక్కలు చూపించిన అమ్మాయిలు!
బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మానస పథకాలు 'స్వచ్ఛ భారత్', 'మేక్ ఇన్ ఇండియా'.. ఈ పథకాలను విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలు ఆయనకే తిప్పికొట్టినట్టు కనిపించాయి. రాహుల్ గాంధీ బుధవారం బెంగళూరులోని ప్రతిష్టాత్మక మౌంట్ కార్మెల్ మహిళా కాలేజీలో ప్రసంగించారు. విద్యార్థులను ఉద్దేశించిన మాట్లాడిన రాహుల్ గాంధీ 'సూటు-బూటు' ప్రభుత్వం అంటూ మోదీ ప్రభుత్వంపై ధాటిగా విమర్శలు కురిపించారు. మోదీ ప్రభుత్వం మాటలైతే మాట్లాడుతుందికానీ.. దానికి దిశానిర్దేశం లేదని ధ్వజమెత్తారు. 'మోదీ ప్రభుత్వం చెప్తున్న ఎన్నో మాటలు వింటున్నా. కానీ స్పష్టమైన దిశానిర్దేశం కనిపించడం లేదు. సీరియస్ గా దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు వ్యూహాత్మక జాతీయ పథకం ఉండాల్సిన అవసరముందా? అసలు ఇది పనిచేస్తుందా?' అని రాహుల్ ప్రశ్నించారు. ఆహూతుల నుంచి 'లేదు' అనే సమాధానం వస్తుందని ఆశించారు. కానీ ఆయనను బిత్తరపరుస్తూ 'అవును' అని విద్యార్థినుల నుంచి బదులు వచ్చింది. దీంతో తడబడ్డ రాహుల్ మరింత బిగ్గరగా 'అది అమలవ్వడం మీరు చూశారా?' అడిగారు. 'అవును' (యెస్) అంటూ మరింత బిగ్గరగా అమ్మాయిలు సమాధానం ఇచ్చారు. ఈ అనుకోని షాక్ నుంచి తేరుకున్న ఆయన 'ఓకే. స్వచ్ఛ భారత్ బాగా పనిచేస్తున్నట్టు నాకైతే కనిపించడం లేదు' అని చెప్పారు. అనంతరం రాహుల్ మరో ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించారు. 'మేక్ ఇన్ ఇండియా' పనిచేస్తుందని మీరు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈసారి కొంతమంది అవును, కొంతమంది కాదు అన్నారు. ఇక ప్రశ్నలు అడుగడం మానుకున్న రాహుల్ మోదీ ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ లేదంటూ తన ప్రసంగాన్నికొనసాగించారు. -
'స్వచ్ఛ' బాదుడు!
పప్పులు, కూరగాయలు మొదలుకొని నిత్యావసరాల ధరలన్నీ భగ్గునమండుతున్నాయి. దీన్నుంచి తమను రక్షించగలవారెవరో అర్ధంకాక సామాన్య పౌరులు విలవిల్లాడుతున్నారు. పట్టనట్టు వ్యవహరిస్తున్న పాలకుల తీరుపై ఆగ్రహిస్తున్నారు. సరిగ్గా తమ వంతు బాదుడుకూ ఇదే సమయమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ భావించినట్టున్నారు. అన్ని రకాల సేవలపైనా 'స్వచ్ఛ భారత్' సెస్ పేరిట 0.5 శాతం వసూలు చేయాలని నిర్ణయించారు. ఇది ఆదివారంనుంచి అమల్లోకొచ్చింది. 14 శాతంగా ఉండే సర్వీస్ టాక్స్ కాస్తా 14.5 శాతం అయింది. ఫలితంగా పన్ను పరిధిలోకొచ్చే అన్ని సేవలూ మరింత ప్రియమయ్యాయి. ఫోన్ చార్జీలు మొదలుకొని రెస్టరెంట్లలో తినుబండారాల వరకూ ప్రతి దానిపైనా ఈ సెస్ మొత్తాన్ని అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరాంతంలోగా 'స్వచ్ఛభారత్' సెస్ ద్వారా రూ. 3,800 కోట్ల ఆదాయం లభిస్తుందని, ఏటా ఇది రూ.10,000 కోట్ల వరకూ ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. నిరుడు స్వాతంత్య్ర దినోత్సవంనాడు ప్రకటించి, మహాత్ముడి జయంతి రోజైన అక్టోబర్ 2న ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని స్వాగతించనివారంటూ లేరు. పరిశుభ్రత లోపించడంవల్ల ఏటా భారత్ 2 లక్షల 44 వేల కోట్లు నష్టపోతున్నదని ప్రపంచబ్యాంకు అంతటి సంస్థ చెప్పాక ఇలాంటి కార్యక్రమాన్ని కాదనేదెవరు? 2019లో రాబోయే మహాత్ముడి 150వ జయంతినాటికల్లా ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పటికల్లా మరుగుదొడ్డి లేని ఇల్లుకానీ, విద్యా సంస్థకానీ, కార్యాలయంకానీ ఉండరాదని...బహిరంగ ప్రదేశాల్లో కాలకృత్యాలు తీర్చుకునే అలవాటుకు స్వస్తి చెప్పేలా ప్రజానీకంలో చైతన్యం పెంచాలని సంకల్పించారు. సకల రంగాలవారూ ఈ కార్యక్రమంలో భాగస్తులయ్యారు. 'స్వచ్ఛ భారత్' అంటే సినీ రంగ ప్రముఖులు మొదలుకొని రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల వరకూ అందరూ రోడ్ల మీదికొచ్చి ఊడ్వడమేనన్నంతగా ఆ కార్యక్రమం సాగింది. అది తీసుకొచ్చిన మార్పేమిటో ఎవరి కంటా పడకుండానే ఆ కార్యక్రమం పేరిట ఇప్పుడు సెస్ వసూళ్లు కూడా మొదలయ్యాయి. ఈ బృహత్తర కార్యక్రమంలో దేశ పౌరులందరి ప్రమేయం ఉండేలా చూడటం కోసమే సెస్ విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అపరిశుభ్రత వల్ల అనేక ప్రాణాంతక వ్యాధులు విస్తరిస్తున్నాయని, వీటి బారినుంచి ప్రజలను కాపాడటానికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ సెస్ అవసరమని వివరించింది. దీన్ని మరో పన్నుగా భావించవద్దని కూడా విన్నవించింది. పన్నులకూ, సెస్కూ తేడా ఉంటుంది. సెస్ అనేది నిర్దిష్ట ప్రయోజనం కోసం ఖర్చు పెట్టదల్చుకుని విధించేది. సామాన్య పౌరులకు సంబంధించినంతవరకూ పేర్లలో తేడా తప్ప ఆచరణలో రెండూ ఒకటే...తమనుంచి అదనంగా గుంజడం. కేంద్ర ప్రభుత్వానికొచ్చే లాభం వేరు. పన్ను ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకుని తీరాలి. సెస్కు అలాంటి బెడద ఉండదు. సంపాదనంతా తనదే. తాజా సెస్పై విపక్షాల ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన అభ్యంతరం కూడా ఇదే. ఒకపక్క పన్ను ఆదాయంలో రాష్ట్రాలకు రావలసిన వాటాను కేంద్రం గణనీయంగా తగ్గిస్తూ వాటిని బికారులుగా మారుస్తున్నదనీ...కొత్తగా వచ్చే ఆదాయానికి సెస్ పేరుపెట్టి అసలుకే వాటా ఇవ్వనవసరం లేని స్థితి కల్పించుకుంటున్నదని అవి ఆరోపిస్తున్నాయి. పైగా ఇప్పుడు విధించిన స్వచ్ఛ భారత్ సెస్ ద్వారా సమకూరే ఆదాయాన్ని కేంద్రం ఎలా ఖర్చు చేయదల్చుకున్నదన్న అంశంలో స్పష్టత లేదు. ఎందుకంటే మౌలికంగా మరుగుదొడ్లు నిర్మించడంతోసహా పారిశుద్ధ్యం అనేది రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు కేంద్రం వసూలు చేయడం మొదలుపెట్టిన సెస్ ద్వారా లభించే మొత్తాన్ని రాష్ట్రాలకు బదలాయిస్తుందా...బదలాయిస్తే అది ఏమేరకు అన్న అంశాల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికే మనకు సెస్లు బోలెడున్నాయి. విద్యా సెస్, ఉన్నత విద్యా సెస్, జాతీయ రహదార్ల సెస్, స్వచ్ఛ ఇంధనం సెస్...ఇలా ఈ జాబితా చాలా పెద్దది. ఏటా ఈ సెస్ల ద్వారా లక్షా 16 వేల కోట్ల రూపాయల మొత్తం కేంద్రానికి లభిస్తున్నది. ప్రధానమైన రెవెన్యూ ఆదాయంతో పోలిస్తే ఇది తక్కువే కావొచ్చుగానీ సెస్ అనేది కేంద్రానికి కీలక ఆదాయ వనరుగా మారిందన్నది నిజం. సర్చార్జిలు కూడా రాష్ట్రాలతో పంచుకోనవసరంలేని మరో ఆదాయ వనరు. ఇలా సెస్లు, సర్చార్జిల ద్వారా తన ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటూ అందులో తమకు వాటా దక్కనీయడం లేదని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంనుంచి తాము అమలు చేయబోయే సరుకులు, సేవల పన్ను(జీఎస్టీ)వల్ల అలాంటి సమస్యలు చాలావరకూ తీరతాయని కేంద్ర ప్రభుత్వం అనేకసార్లు చెప్పింది. అందుకోసమే పరోక్ష పన్నుల సంస్కరణలకు తోడ్పడే ఈ విధానానికి అందరూ సహకరించాలంటున్నది. ఇలాంటి సమయంలో స్వచ్ఛ భారత్ సెస్ తీసుకురావడం సరైందే అవుతుందా? విధించదల్చుకున్న పన్నులు, సెస్లు, సర్చార్జిలవంటి వాటిని బడ్జెట్ సమర్పించేటపుడు వెల్లడించే ఆనవాయితీ నుంచి ప్రభుత్వాలు ఎప్పుడో తప్పుకున్నాయి. బడ్జెట్కు ముందో, తర్వాతో వాటిని విపరీతంగా పెంచడం...బడ్జెట్లో మాత్రం ఎలాంటి పన్నులూ, ఇతర బాదుళ్లూ లేవని ప్రకటించుకోవడం రివాజుగా మారింది. వాస్తవానికి మరో నాలుగు నెలల్లో ఎటూ కొత్త బడ్జెట్ వస్తుంది. ఈలోగా అందరితో చర్చించి, ఈ సెస్ ద్వారా సమకూర్చదల్చుకున్న నిధుల్ని ఎలా ఖర్చు చేస్తారో చెప్పి...అందులో రాష్ట్రాల ప్రమేయం ఏమిటో వివరించి ఆ బడ్జెట్లో దాన్ని చూపవచ్చు. ప్రభుత్వం ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. వాస్తవానికి మన దేశంలో పారిశుద్ధ్యాన్ని జీవనాధారంగా చేసుకున్నది అట్టడుగు వర్గాలవారే. పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దే క్రమంలో అయితేనేమి... రీసైక్లింగ్కు ఉపయోగపడేవాటిని సేకరించి అమ్ముకోవడంలో అయితేనేమి అలాంటివారు ఎన్నో అనారోగ్య సమస్యలను, ఇతర రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వసూలు చేయడం ప్రారంభించిన సెస్ ద్వారా సమకూరే నిధుల్ని అలాంటివారి సాంఘిక భద్రతకూ, ఆరోగ్యానికీ, వారి పనిలో ఉపయోగపడే ట్రైసైకిళ్ల కొనుగోలుకూ, వారి అవసరాలకు ఉపయోగపడేలా చిన్న చిన్న రుణాలిచ్చేందుకూ, చెత్తను రీసైక్లింగ్ చేసే ప్రాజెక్టులకూ వినియోగిస్తే అర్ధవంతంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. -
మోదీ నాయకత్వంలో అభివృద్ధి దిశగా భారత్
విజయవాడ : నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తర్వాత ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. ఆదివారం కృష్ణాజిల్లా చల్లపల్లిలో స్వచ్ఛ భారత్ పనులను వెంకయ్యనాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... స్వచ్ఛ భారత్ తఅంటే ప్రభుత్వ కార్యక్రమం కాదని... ప్రజా ఉద్యమం అని ఆయన స్పష్టం చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకుంటే అనారోగ్యాలు చేరతాయని ప్రజలకు వెంకయ్య సూచించారు. మడమ తిప్పని మహానేత ఎన్టీఆర్ అని అభివర్ణించారు. మహనీయుల నుంచి మనం స్ఫూర్తి పోందాలని సూచించారు. ప్రస్తుత మానవ జీవితం యాంత్రికమైపోయిందని వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. -
త్వరలో స్వచ్ఛ భారత్ సేవా పన్ను
-
త్వరలో స్వచ్ఛ భారత్ సేవా పన్ను
నూఢిల్లీ: ప్రధాని మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమం ఇటీవలే ఏడాది పూర్తయ్యింది. దీనిపై తాజాగా కేంద్రప్రభుత్వం సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. అన్ని రకాల సేవలపై 0.5 శాతం స్వచ్ఛభారత్ సెస్ను వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి ఈ పన్ను అమలులోకి రానుంది. -
పెట్రోల్, టెలికంలపై సెస్!
స్వచ్ఛభారత్ కోసం ప్రత్యేక పన్ను సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్ అభియాన్ కోసం టెలికం, పెట్రోల్పై పన్ను విధించాలని కేంద్రానికి సిఫారసు చేయాలని నీతీ ఆయోగ్ ముఖ్యమంత్రుల ఉపకమిటీ బుధవారం నిర్ణయించింది. వీటితో పాటు బొగ్గు, ఉక్కు వంటి ఖనిజాలపై కూడా పన్ను విధించటం ద్వారా ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని అభిప్రాయపడింది. స్వచ్ఛభారత్ అవసరమైన కోసం ఆర్థిక భారాన్ని 75% కేంద్రం భరించేలా, 25% రాష్ట్రాలు భరించేలా చూడాలని కేంద్రాన్ని కోరింది. కమిటీ కన్వీనర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఉపకమిటీ, స్వచ్ఛభారత్ అభియాన్ కోసం పలు సూచనలు చేసింది. తాము చేసిన సిఫార్సులతో పది రోజుల్లోగా నివేదికను రూపొందించి ప్రధానికి అందజేస్తామని బాబు ఆ తరువాత మీడియాకు వివరించారు. పొడి, తడి చెత్త... వ్యర్థాలు, మురుగునీరు పునర్నినియోగానికి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.15,000లు చెల్లించాలని సిఫార్సు చేశామన్నారు. -
స్వచ్ఛ భారత్ కోసం సైకిలెక్కిన ఎస్పీ
దేవనకొండ (కర్నూలు) : స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు ఎస్పీ రవికృష్ణ సైకిల్ తొక్కారు. ఆయన ఆదివారం ఉదయం కొమరాడ నుంచి దేవనకొండ మండలం కప్పట్రాళ్ల వరకు ఇతర పోలీసు అధికారులతో కలసి సైకిల్ తొక్కారు. అనంతరం ఫ్యాక్షన్ గ్రామం కప్పట్రాళ్లలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
క్రియాశీలకంగా పనిచేయండి
స్వచ్ఛభారత్ ప్రచారకర్తలకు రాష్ట్రపతి పిలుపు * స్వచ్ఛభారత్ గీతావిష్కరణ.. ప్రచారకర్తలకు సత్కారం * సత్కార గ్రహీతల్లో తొమ్మిది మంది తెలుగువారు సాక్షి, న్యూఢిల్లీ: పారిశుద్ధ్యం పనులను దత్తత తీసుకునేలా ప్రజలను ప్రభావితం చేయాలని స్వచ్ఛభారత్ ప్రచారకర్తలను రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ కోరారు. ప్రతి పట్టణం శుభ్రం అయ్యేంతవరకు ప్రచారకర్తలు ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆయన రాష్ట్రపతి భవన్లో స్వచ్ఛభారత్పై జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్పై ప్రఖ్యాత సినీగేయ రచయిత ప్రసూన్ జోషి రచించిన గేయాన్ని ఆయన విడుదల చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమం విజయవంతమవడానికి ప్రచారకర్తలు మరింత క్రియాశీలకంగా పనిచేయాలని కోరారు. ‘స్వచ్ఛభారత్’గా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న ప్రచారకర్తలుగా ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం సత్కరించారు. సత్కారం పొందిన వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుద్దాల అశోక్ తేజ(సినీగేయ రచయిత),జీఎస్ రావు (యశోదా హాస్పిటల్స్) అక్కినేని అమల (బ్లూక్రాస్ చైర్పర్సన్), రామోజీరావు (ఈనాడు గ్రూప్), టి.నరేంద్రనాథ్ చౌదరి (ఎన్టీవీ), డాక్టర్ జె.రామేశ్వరరావు (మై హోంగ్రూప్), జె.ఎ.చౌదరి (టాలెంట్ స్ప్రింట్), సి.ఎం.దేవరాజరెడ్డి (ఉపాధ్యక్షులు, ఐసీఏఐ), మంచు లక్ష్మి (సినీనటి) ఉన్నారు. సత్కారం పొందిన వారిలో ప్రముఖులు: యూపీ సీఎం అఖిలేశ్, సచిన్, కమల్హాసన్, శంకర్ మహాదేవన్, సురేష్ రైనా, బి.డి.లీసారామ్, అనిల్ అంబానీ, స్వామి రాందేవ్, ప్రనవ్ పాండే, బ్రహ్మకుమారి పుష్పా.