వినూత్న ఆలోచనలతో స్టార్టప్లను ప్రారంభించే యువ వ్యాపారవేత్తలకు మరిన్ని రాయితీలు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది.
మరిన్ని నిబంధనలు సడలించే యోచనలో సర్కారు
న్యూఢిల్లీ: వినూత్న ఆలోచనలతో స్టార్టప్లను ప్రారంభించే యువ వ్యాపారవేత్తలకు మరిన్ని రాయితీలు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. వ్యాపారవేత్తల ఉత్పత్తులకు, ఆలోచనలకు ఇవ్వాల్సిన పేటెంట్, ట్రేడ్మార్క్, డిజైన్పై పేటెంట్ హక్కుకు పెట్టుకునే దరఖాస్తు ఖర్చును ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. స్టార్టప్లు కేవలం చట్టపరంగా చెల్లించాల్సిన రశీదు చెల్లిస్తేసరిపోతుంది. మిగతాదంతా ప్రభుత్వమే చూసుకుంటుందని..ప్రభుత్వం విడుదల చేసిన కార్యాచరణ ప్రణాళిక స్పష్టం చేసింది.
ఇందుకోసం కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్ అండ్ ట్రేడ్మార్క్ నేతృత్వంలో ఓ ప్యానెల్ను కేంద్రం ఏర్పాటుచేయనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వ్యాపారుల హక్కులను కాపాడటంతోపాటు మేధో సంపత్తి హక్కులపై అవగాహన పెరుగుతుందని జాతీయ మేధో సంపత్తి సంస్థ (ఎన్ఐపీఓ) అధ్యక్షుడు టీసీ జేమ్స్ తెలిపారు.
స్వచ్ఛభారత్పై సెక్రటరీల ప్రజెంటేషన్
పాలనలో మార్పుకోసం పలువురు ఉన్నతస్థాయి అధికారులతో ఏర్పాటుచేసిన సెక్రటరీల బృందాలు నాలుగు ఆదివారం ప్రధాని మోదీకి ‘స్వచ్ఛభారత్, శిక్షిత్ భారత్’పై ఐడియాలను అందజేశాయి. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన పవర్పాయింట్ ప్రజెంటేషన్లో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను అందరికీ అందేలా చేసేందుకు ఐడియాలు ఇవ్వాలంటూ వివిధ విభాగాల అధికారులతో ఎనిమిది సెక్రటరీల బృందాలను ప్రధాన మంత్రి ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.