
పింఛన్ల పంపిణీలో గోల్మాల్!
► రూ. కోటి స్వాహా
► ఫోర్జరీ సంతకాలు,వేలిముద్రలతో వ్యవహారం
► రెండేళ్ల తర్వాతవెలుగుచూసిన అవినీతి బాగోతం
సాక్షి, సిటీబ్యూరో: నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అందాల్సిన పింఛన్లను కొందరు అక్రమార్కులు స్వాహా చేశారు. ఆన్లైన్ విధానానికి ముందున్న మాన్యువల్ పద్ధతిని ఆసరాగా చేసుకుని కొందరు రెవెన్యూ సిబ్బంది ఫోర్జరీ సంతకాలు, వేలిముద్రలతో దాదాపు రూ.కోటి రూపాయల పింఛన్లు దొడ్డిదారిన కాజేసినట్లు తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ అవినీతి బాగోతం వెలుగుచూసింది. కొంత మంది లబ్ధిదారులకు సంబంధించి తొమ్మిది నెలల పింఛన్ డబ్బులు వారికి ఇవ్వకుండానే....కాగితాలపై చెల్లిం చినట్లు ఫోర్జరీ సంతకాలు పెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జిల్లాలోని ఆసిఫ్నగర్ మండలంలో వెలుగు చూసిన అవినీతి బాగోతం ఉన్నతాధికారులను తలవంపులకు గురి చేస్తున్నది.
సెర్ప్ యంత్రాంగం మ్యానువల్గా పంపిణీ చేసిన పింఛన్ల లెక్కలపై నివేదిక కోరగా, ఆరా తీసిన జిల్లా యంత్రాంగానికి దిమ్మ తిరిగి నంత పనైంది. పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరిగి నట్టు అనుమానించిన కలెక్టర్..ఆసిఫ్నగర్ మండలంలో లెక్కతేలని రూ. 30 లక్షలపై నివేదిక సమర్పించాలని తహశీల్దార్గా పని చేసిన మల్లేష్ కుమార్కు షోకాజ్ నోటీసులు అందజేశారు. పైగా ఈ సంఘటనపై హైదరాబాద్ ఆర్డీఓ నిఖిలను విచారణాధికారిగా నియమించారు.
ఇదీ కథ...
హైదరాబాద్ జిల్లాలో 1.56 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా, వీరికి ప్రతి నెల రూ. 17.76 లక్షలు చెల్లిస్తున్నారు. అయితే ..ప్రారంభంలో లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోవటంతో తొమ్మిది నెలలకు పైగా పింఛన్ డబ్బులను మాన్యువల్గా రెవెన్యూ సిబ్బంది పంపిణీ చేశారు. దీన్ని అదనుగా మలుచుకున్న రెవెన్యూ సిబ్బంది అందినంత దోచుకున్నారు. లబ్ధిదారుల ఫోర్జరీ సంతకాలు, వేలిముద్రలతో పింఛన్ డబ్బులు స్వాహా చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో దర్జాగా పనులు కానిచ్చారు.
పంపిణీ ఇలా...
ఆన్లైన్ విధానం లేకముందు జిల్లాలో ప్రతి నెలా పింఛన్లకు సంబంధించిన మొత్తం డబ్బులను సదరు మండలానికి చెందిన తహశీల్దారు బ్యాంకు అకౌంట్లో సెర్ఫ్ జమ చేస్తుండటంతో వీఆర్వోలు, వారి అసిస్టెంట్లు పలు ప్రాంతాల కమ్యూనిటీ హాళ్ల నుంచి డబ్బులు పంపిణీ చేసేవారు. పలు కారణాల వల్ల వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పింఛన్ డబ్బులు తీసుకోకుంటే ....ఫోర్జరీతో స్వాహా చేసేవారు. పింఛన్ రాలేదని కార్యాలయానికి వస్తే... చూసి చెబుతామంటూ వేధించే వారు. వరుసగా మూడు నెలల పింఛన్ డబ్బులు తీసుకోకుంటే... రద్దవుతుందని భయపెట్టి అదనంగా డబ్బులు లాగేవారు. పంపిణీ చేయగా మిగిలిన పింఛన్ డబ్బులు ఎప్పటికప్పుడు సెర్ఫ్లో జమ చేయాల్సిన్నప్పటికీ తొమ్మిది నెలలుగా పెండింగ్లో ఉంచి అవినీతికి తెరలేపారు.
సెర్ఫ్ సీరియస్తో....
జిల్లాలో మాన్యువల్గా పంపిణీ చేసిన పింఛన్ లెక్కలపై సెర్ఫ్ సీరియస్గా నివేదిక కోరటంతో అవినీతి బాగోతం వెలుగు చూసింది. ఫలితంగా ఎక్కువగా అవినీతి జరిగిందని అనుమానించి... ఆసిఫ్నగర్ బాగోతంపై విచారణాధికారిని నియమించే స్థాయికి వెళ్లింది. లెక్కల విషయానికి వస్తే... జిల్లాలోని ఎనిమిది మండలాలకు చెందిన తహశీల్దార్లు రూ.87.84 లక్షలు జమ చేయాల్సి ఉందని సెర్ఫ్కు నివేదించగా, మరో ఏడు మండలాల అధికారులు అదనంగా రూ. 83.58 లక్షలు పంపిణీ చేశామని, మీ నుంచే మా మండలాలకు డబ్బులు జమ కావాల్సి ఉందని ఆన్లైన్ నివేదికలో పేర్కొనటం ఆశాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే, ఎనిమిది మండలాల నుంచి జమ చేయాల్సిన రూ.87.84 లక్షలు జమ చేయకుండా ఏం చేశారన్న అనుమానాల నేపథ్యంలో పక్కదారి పట్టించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పైగా లెక్కలు చూపించటానికి తిరిగి జమ చే సే ప్రయత్నంలో నానా తంటాలు పడుతున్నట్లు తెలుస్తున్నది. మరో ఏడు మండలాల్లో అదనంగా రూ.83.58 లక్షలు పింఛన్ డబ్బులు పంపిణీ చేశామని సెర్ఫ్కు నివేదించటంపై....రెవెన్యూ సిబ్బం దికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో జిల్లాలో పింఛన్ల పంపిణిలో రూ.కోటికి పైగా గోల్మాల్ జరిగినట్లు ఆ వర్గాల్లోనే చర్చ సాగుతున్నది.