
నిండు గర్భిణిపై అత్యాచారయత్నం
హైదరాబాద్ : హైదరాబాద్లో దారుణం జరిగింది.నిర్భయ చట్టం రేప్ నిందితులకు భయాన్ని కలిగించడం లేదు. మహిళలపై రేపిస్టులు తమ దురాగతాలను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా కన్నుమిన్ను కానకుండా ఓ నిండు గర్భిణిపై అయిదుగురు దుండగులు అత్యాచారయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన మూసీనది సమీపంలో చోటుచేసుకుంది. అడ్డుకోబోయిన భర్తను దుండగులు దాడి చేసి విచక్షణారహితంగా కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు రామకృష్ణ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మహబూబ్నగర్ జిల్లా ముంగనూరు నుంచి వైద్యం కోసం హైదరాబాద్ వచ్చిన దంపతులకు ఈ సంఘటన ఎదురైంది. బాధితురాలు కొత్తకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో చికిత్స నిమిత్తం ఉస్మానియాకు వచ్చారు. అయితే ఆస్పత్రిలో బహిర్భూమికి వెళ్లే సదుపాయం లేకుండటంతో వారు మూసీనది సమీపానికి వెళ్లగా ....దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. కాగా పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకునేందుకు తాత్సరం చేస్తున్నారు. ఆ ఘటన తమ పరిధిలోకి రాదంటే తమ పరిధిలోకి రాదని చెప్పటంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.