
'కోడిపందాల కోసం కాదు.. సంబరాల కోసమే వెళ్తున్నా'
హైదరాబాద్ : ఈ ఏడాది సంకాంత్రి పండగకి కూడా ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం వెళ్తున్నట్లు తెలంగాణ వాణిజ్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. అయితే కోడిపందాల కోసం మాత్రం కాదని... సంక్రాంతి సంబరాల కోసమే అని తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లో తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ... పేదలకు న్యాయం జరగాలన్నదే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. తెలుగు రాష్ట్రాల ఇద్దరు సీఎంలు పరస్పరం గౌరవించుకుంటున్నారని చెప్పారు.
అభివృద్ధి కోసం పరస్పరం సహకరించుకోవడంలో తప్పు లేదని తలసాని అన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందడమే ముఖ్యమని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు టీఆర్ఎస్పై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాయని... అ పద్దతి సరికాదని తలసాని శ్రీనివాసయాదవ్ వ్యాఖ్యానించారు. మరో మూడు ఏళ్లలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ ఉండదని చెప్పారు. నగరంలో మేం చేసిన అభివృద్ధి.... చేయాల్సిన దానిపై నగర ప్రజలకు వివరిస్తామని తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుందని తలసాని ధీమా వ్యక్తం చేశారు.