
కేసీఆర్ ఒప్పందం.. మహా దగా, మహా మోసం
మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సీఎం కేసీఆర్ కుదుర్చుకున్న ప్రస్తుత ఒప్పందాల్లో కొత్తదనం లేదని టీకాంగ్రెస్ విమర్శించింది.
హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సీఎం కేసీఆర్ కుదుర్చుకున్న ప్రస్తుత ఒప్పందాల్లో కొత్తదనం లేదని టీకాంగ్రెస్ విమర్శించింది. ఒప్పందాల అంశంపై టీకాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, దాసోజు శ్రవణ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం కిరణ్ కుమార్, అప్పటి మహారాష్ట్ర సీఎం మధ్య కుదిరిన ఒప్పందమే ఇది అని చెప్పారు. అయితే తుమ్మడిహట్టి వద్ద ప్రాణహితపై 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ కట్టాలని గత ఒప్పందం కాగా, కేసీఆర్ ఒప్పందంలో ఆ ఎత్తును 4 మీటర్లకు తగ్గించడంతో తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
కేసీఆర్ కుదుర్చుకున్న ఒప్పందం మహా దగా, మహా మోసం అని, తెలంగాణను ముంచే ఒప్పందం అంటూ వారు మండిపడ్డారు. ఒక ఎకరం ఆయకట్టు పెరగకుండా ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని మాత్రం రూ.50 వేల కోట్లు పెంచారని, అందుకే ఇది దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని పేర్కొన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి చీకటి రోజు అని, మహారాష్ట్రకు మేలు జరిగేలా తెలంగాణకు నష్టం జరిగేలా ఒప్పందం కుదిరిందంటూ టీకాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.