
వాషింగ్టన్: ఆరు ముస్లిం దేశాలపై విధించిన ప్రయాణ నిషేధ ఉత్తర్వులు ఆదివారం ముగియనున్న నేపథ్యంలో మరో దఫా ‘ట్రావెల్ బ్యాన్’కు అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతోంది. కొన్ని మార్పులతో కూడిన కఠిన నియంత్రణలకు ఈసారి చోటు కల్పించేలా అధ్యక్షుడు ట్రంప్ కసరత్తు చేస్తున్నారు. అమెరికాతో సరిపడినంత సమాచారం పంచుకోని, తగిన భద్రతా చర్యలు తీసుకోని దేశాలపై సరికొత్త ఆంక్షలు విధించాలని అంతర్గత భద్రతా వ్యవహారాల శాఖ ట్రంప్కు సిఫార్సు చేసింది. ఈ నిబంధనలు దేశాన్ని బట్టి మారతాయని అధికారులు చెప్పారు.
కొన్ని దేశాల పౌరుల తనిఖీని మరింత కఠినతరం చేసేలా తాజాగా ప్రతిపాదించామని ఆ శాఖ మంత్రి ఇలేన్ డ్యూక్ సలహాదారు మైల్స్ టేలర్ వెల్లడించారు. కొత్త విధానం ద్వారా ప్రభావితమయ్యే దేశాలేవో ప్రకటించని అధికారులు...దీనిపై ఎలా ముందుకు సాగాలో ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. వలసదారుల గుర్తింపునకు సంబంధించి ఆయా దేశాలు అమెరికాతో సమాచారం పంచుకుంటున్నాయా? వచ్చే వారితో అమెరికా భద్రతకు ముప్పు పొంచి ఉందా? దేశాలు తమ పౌరులకు బయోమెట్రిక్ సమాచారంతో కూడిన పాస్పోర్టులను జారీచేశాయా? లాంటి ప్రాతిపదికనే సిఫార్సులు చేసినట్లు టేలర్ చెప్పారు. తొలి ట్రావె ల్ బ్యాన్ కన్నా బాగా సమాలోచనలు జరిపి సిఫార్సులను రూపొందించామని తెలిపారు