
అమెరికా అధ్యక్షుడు ఒబామా కంట కన్నీరు
అమెరికాలో పెచ్చుమీరుతున్న తుపాకీ సంస్కృతిపై దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా కన్నీరు పెట్టారు.
వాషింగ్టన్: అమెరికాలో పెచ్చుమీరుతున్న తుపాకీ సంస్కృతిపై దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా కన్నీరు పెట్టారు. మూడేళ్ల క్రితం కనెక్టికట్ 20 మంది ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ముష్కరుల తుపాకీ గుళ్లకు బలైన విషయాన్ని గుర్తు చేసుకుని ఏడ్చేశారు. ఆ చిన్నారులు గుర్తొచ్చిన ప్రతీసారి పిచ్చివాడినై పోతానన్నారు. చెక్కిళ్లపై నుంచి కన్నీరు కారుతుండగా.. తుపాకుల వినియోగాన్ని, తుపాకీ హింసను కట్టడి చేయాల్సిన అవసరం ఉందంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ విషయమై ముందుకు వెళ్లాల్సిందిగా కాంగ్రెస్ను డిమాండ్ చేయాలని మంగళవారం వైట్హౌస్ కార్యక్రమంలో అన్నారు. తుపాకుల అమ్మకాల కట్టడికి కాంగ్రెస్ వ్యతిరేకతను పట్టించుకోకుండా.. కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇవ్వాలని ఒబామా నిర్ణయించారు. గన్ లాబీ కాంగ్రెస్ను బందీగా చేసుకోగలదేమో కానీ అమెరికాను కాదని అన్నారు. ఈ కార్యక్రమానికి కాల్పుల బాధితులు హాజరయ్యారు.