
సీఐసీపీసీ విడుదల చేసిన నిందితుడి ఫోటో
నరమాంస భక్షకుల పేరు వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కానీ వెనిజులాలోని ఓ నరమాంస భక్షకుడి చర్యలు గురించి తెలుసుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఇతగాడు ఒక వ్యక్తిని చంపి, శరీర భాగాలు భక్షించడమే కాదు.. అతని రక్తం, బూడిదతో బొమ్మలను కూడా చిత్రించిన వైనం కలకలం రేపింది. వెనిజులాలోని బార్లోవెంటో ప్రాంతంలో ఈ షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది.
బార్లోవొంటో ప్రాంతానికి చెందిన లూయిస్ అల్ఫ్రెడో గొంజాలెజ్ హెర్నాండెజ్ ఈ భయానక నేరానికి పాల్పడ్డాడు. పోలీసులు ఇతడిని అరెస్ట్ చేసిన అనంతరం విచారణలో నేరాన్ని ఒప్పుకున్నాడు. సైంటిఫిక్, పీనల్, క్రిమినల్ ఇన్వెస్టిగేటివ్ బాడీ (సిఐసిపిసి) నిందితుడి ఫోటోలు ఆన్లైన్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. సీఐసీపీసీ డైరెక్టర్ డగ్లస్ రికో ప్రకారం ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. బాధితుడే నిందితుడిని ఈ భయంకరమైన చర్య చేపట్టేందుకు (తనని చంపి, శరీర భాగాలు తిని, రక్తం, బూడిదతో పెయింటింగ్స్ వేసేందుకు) నియమించుకున్నాడట. దీనిపై దర్యాప్తు మొదలు పెట్టారు.
మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో ఇద్దరి పాత్రపై ఆరా తీస్తున్నారు. సంఘటనా స్థలంలో కొన్ని పెయింటింగ్స్ను, ఇతర శరీర అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఇతర వ్యక్తులకు చెందిన కొన్ని అనుమానాస్పద డాక్యుమెంట్లను కూడా కనుగొన్నారు. దీంతో కనిపించకుండా పోయిన వ్యక్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అలాగే ఈ చిత్రాలు మానవ అవశేషాల నుండి తయారు చేయబడినవో కాదో తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ అనాలిసిస్ నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment