
బీజింగ్ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో మంగళవారం పాకిస్తాన్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై భారత్ మెరుపు దాడులు నిర్వహించి వందలాది ఉగ్రవాదులను మట్టుబెట్టడంపై చైనా స్పందించింది. పాక్లోని జైషే అతిపెద్ద ఉగ్రవాద శిబిరంపై భారత్ వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు మంగళవారం ఉదయం వేయి కేజీల బాంబులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కాగా పుల్వామా దాడి నేపథ్యంలో నెలకొన్న పరిస్ధితిపై చైనా వ్యాఖ్యానిస్తూ భారత్, పాక్లు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది.
భారత్ అంతర్జాతీయ సహకారం ద్వారా ఉగ్రవాదంపై పోరాటాన్ని కొనసాగించాలని చైనా కోరింది. జైషే చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ డిమాండ్ను తోసిపుచ్చిన చైనా తాజాగా మెరుపు దాడులపైనా తనదైన శైలిలో స్పందించింది. దక్షిణాసియాలో భారత్, పాకిస్తాన్ రెండూ కీలక దేశాలని, ఇరు దేశాల మధ్య మెరుగైన సంబంధాలు దక్షిణాసియా ప్రాంతంలో పరస్పర సహకరానికి, ఈ ప్రాంతంలో శాంతి, సుస్ధిరతకు దారితీస్తాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధ లు కంగ్ పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్లు మరింత సంయమనంతో వ్యవహరిస్తూ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి పలు చర్యలు చేపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment