
బంగ్లదేశ్కు 500 మిలియన్ డాలర్ల సాయం
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రక్షణ శాఖ రంగం బలోపేతానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 500 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నాలుగురోజుల భారత్ పర్యటనలో భాగంగా ఇవాళ భారత్-బంగ్లాదేశ్ మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అనంతరం ఇరు దేశాల ప్రధానమంత్రులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
కీలకమైన పౌర అణు సహకారం, రక్షణ ఒప్పందాలు సహా దాదాపు 22 ఒప్పందాలపై భారత్, బంగ్లాదేశ్లు సంతకం చేశాయని ఆయన వెల్లడించారు. ఉగ్రవాద నిరోధం, భద్రతా సహకాంపై చర్చించామని, బంగ్లాదేశ్కు భారత్ సుదీర్ఘ కాలం నమ్మదగిన మిత్రదేశమని మోదీ అన్నారు. బంగ్లాదేశ్ కోరుకుంటే భద్రతా రంగంలో తమ సాయం ఎప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు. కాగా అంతకు ముందు కోల్కతా-ఖుల్నా-ఢాకా (బంగ్లాదేశ్) బస్సు సర్వీసును అధికారులు ప్రారంభించారు.