
హ్యూస్టన్: ‘ఉమ్మడి స్వప్నం.. ఉజ్వల భవిత’ పేరుతో టెక్సాస్ ఇండియా ఫోరం నిర్వహించిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమం విజయవంతమైంది. మోదీ నినాదాలతో, సాంస్కృతిక కార్యక్రమాల మధ్య అట్టహసంగా ప్రారభమైన కార్యక్రమం ఘనంగా ముగిసింది. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ఐక్యత ఈ కార్యక్రమం ద్వారా మరోసారి ప్రపంచం ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా మోదీ కేవలం ట్రంప్తో మాత్రమే కాక ఇతర అమెరికా నాయకులతో కూడా ఉల్లాసంగా గడిపారు. ముఖ్యంగా యూఎస్ సెనెటర్ జాన్ కార్నిన్తో సరదాగా సంభాషించారు. ఈ సందర్భంగా సెనెటర్ భార్యకు మోదీ క్షమాపణలు చెప్పారు. ఎందుకంటే ఆదివారం కార్నిన్ భార్య పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో మోదీ కార్నిన్ భార్యను ఉద్దేశిస్తూ.. ‘నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను. ఈ రోజు మీ పుట్టినరోజు.. కానీ అనివార్య కారణాల వల్ల ఈ రోజు మీ భర్త నాతో ఉండాల్సి వచ్చింది. అందుకు నన్ను క్షమించండి. ఇది మీకు ద్వేషాన్ని కలిగించవచ్చు’ అన్నారు. అంతేకాక వారిద్దరి జీవితాలు సంతోషంగా సాగాలని.. కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు మోదీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్లో తెగ ట్రెండ్ అవుతుంది.
Here is what happened when PM @narendramodi met Senator @JohnCornyn. pic.twitter.com/O9S1j0l7f1
— PMO India (@PMOIndia) September 23, 2019
ఐదు కుటుంబాలను భారత్కు పంపండి: మోదీ
అంతేకాక కార్యక్రమానికి హాజరైన భారతీయులను ఉద్దేశిస్తూ మోదీ.. ‘ఈ వేదిక మీదుగా నేను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల్ని ఓ చిన్న కోరిక కోరుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు.. ఆయ దేశాలకు చెందిన ఐదు కుటుంబాలను ఇండియా పర్యటనకు పంపండి’ అని కోరారు మోదీ.