
ఏఆర్.రెహమాన్
కేరళ రాష్ట్రం ఇటీవల వరదలతో అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా అక్కడి ప్రజలు సర్వం కోల్పోయారు. వారిని ఆదుకోవడానికి పలు స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, పలువురు సినీ ప్రముఖులు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతు ఆర్థిక సాయాన్ని విరాళంగా అందిస్తున్నారు. నటుడు చిరంజీవి, మహేశ్బాబు, ప్రభాస్, రజనీకాంత్, కమల్హాసన్, సూర్య, విజయ్, విశాల్, విక్రమ్.. ఇలా పలువురు విరాళం అందించారు. తాజాగా సంగీత దర్శకుడు ఏఆర్.రెహమాన్ తన వంతు సాయంగా కోటి రూపాయలను ప్రకటించారు.
ప్రస్తుతం ఆయన అమెరికాలో తన బృందంతో సంగీత కచేరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమం ముగిసిన తర్వాత తన బృందంతో కలిసి కోటి రూపాయలను కేరళ ప్రజల సహాయార్థం అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తాన్ని త్వరలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా త్వరలో ఫ్లోరిడాలో కేరళ ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment