
ఆ పాట కోసం నీళ్లు తాగలేదు!
‘అందరూ అనుకుంటున్నట్లు ‘ధృవ’లోని ‘పరేషానురా’ పాట కోసం వాటర్ మిలన్ డైట్ తీసుకోలేదు. అయితే ఆ పాట కోసం చాలా కేర్ తీసుకున్నా. పొట్ట ఉబ్బెత్తుగా ఉండకూడదని..’
టాలీవుడ్లో చేతి నిండా వరుస చిత్రాలతో బిజీగా దూసుకెళుతున్న కథానాయిక రకుల్ ప్రీత్సింగ్. రామ్చరణ్కు జోడీగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆమె నటించిన ‘ధృవ’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా రకుల్ పత్రికలవారితో పలు విశేషాలు పంచుకున్నారు.
♦ ‘అందరూ అనుకుంటున్నట్లు ‘ధృవ’లోని ‘పరేషానురా’ పాట కోసం వాటర్ మిలన్ డైట్ తీసుకోలేదు. అయితే ఆ పాట కోసం చాలా కేర్ తీసుకున్నా. పొట్ట ఉబ్బెత్తుగా ఉండకూడదని ఉదయం 9:30 నుంచి సాయంత్రం వరకూ నీళ్లు తాగేదాన్ని కాదు. మరీ దాహం వేస్తే నోరు తడుపుకునేదాన్ని. నీరసంగా ఉంటే ఒకటో, రెండో పుచ్చకాయ ముక్కలు తినేదాన్ని. అలా నాలుగు రోజులున్నా.
♦ ‘బ్రూస్లీ’ ఆశించని ఫలితం దక్కకపోయినా, తర్వాత ‘ధృవ’ కోసం నన్ను అడిగారు. ‘కిక్ 2’ సరిగ్గా ఆడకున్నా నాపై నమ్మకంతో సురేందర్రెడ్డిగారు ఈ అవకాశమిచ్చారు. అయినా, సినిమా జయాపజయాలు మా చేతుల్లో ఉంటాయా? హిందీలో షారుఖ్ ఖాన్, కాజోల్, సల్మాన్ ఖాన్, రాణీ ముఖర్జీ హిట్ పెయిర్ అంటారు. అలాగని వారు చేసిన చిత్రాలన్నీ హిట్ అయ్యాయా?
♦ నేను ఒక్క రాత్రిలో స్టార్ని కాలేదు. అందుకు చాలా టైమ్ పట్టింది. కానీ, షూటింగ్ పూర్తవగానే నేను మామూలు రకుల్లానే ఉంటా. ఇప్పుడు తెలుగు నేర్చుకుని తెలుగమ్మాయిని అయిపోయా. మా తమ్ముడు కూడా నటుడిగా సినీ రంగంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు కూడా నేర్చుకుంటున్నాడు.
♦ రాజమౌళిగారితో పని చేయాలన్నది నా డ్రీమ్. పూర్తి స్థాయి రొమాంటిక్ మూవీ చేయాలని ఉంది. ప్రస్తుతం మహేశ్, కార్తీ, నాగ చైతన్య, సాయిధరమ్ తేజ్ చిత్రాలకు కమిట్ అయ్యా. ‘విన్నర్’లో అథ్లెట్ పాత్రలో కనిపిస్తున్నా.
♦ రానున్న కొత్త ఏడాదిని గోవాలో ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోనున్నా’ అని రకుల్ ప్రీత్ చెప్పారు.