
స్టార్వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన నటి శృతీహాసన్ కొంత కాలంగా నటనకు దూరంగా ఉంటున్నారు. కమలహాసన్, సారిక వంటి నట దిగ్గజాల వారసురాలైన ఈ సంచలన నటి బాలీవుడ్లో నటనకు శ్రీకారం చుట్టినా, తమిళ, తెలుగు భాషల్లో క్రేజీ కథానాయకిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో దక్షిణాదికి ఒక మంచి కమర్షియల్ కథానాయకి లభించిందని అందరూ భావించారు. ఇతర అగ్రనాయికలకు పోటీ అనే స్థాయికి చేరిన శ్రుతీహాసన్ సడన్గా సినిమాలకు దూరం అయ్యారు.
ఇటీవల ఈ బ్రేక్కు కారణాలను వెల్లడించారు. నటన మాత్రమే తనకు ముఖ్యం కాదని, ఇతరత్రా చాలా ఉన్నాయని అప్పట్లో పేర్కొన్న శ్రుతీహాసన్ తాజాగా ఈ గ్యాప్ గురించి ఒక స్పష్టమైన వివరణ ఇచ్చారు. లండన్కు చెందిన మైఖెల్ అనే వ్యక్తి ప్రేమలో పడ్డట్టు, ఆయనతో పెళ్లికి సిద్ధం కావడంతోనే నటనకు దూరం అయ్యారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇటీవల చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈ బ్యూటీ అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తన గ్యాప్ గురించి చాలా మంది చాలా రకాలుగా చర్చించుకుంటున్న విషయం తెలుసన్నారు. అలాంటి వారికి చెప్పేదేమిటంటే తన గురించి తాను పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంత సమయం అవసరం అయ్యిందన్నారు. తన బలం, బలహీనత తెలుసుకోవడానికే ఈ గ్యాప్ తీసుకున్నానని చెప్పారు. ప్రస్తుతం తానేమిటో క్లియర్గా అర్థం చేసుకున్నానని, ఇకపై తన నుంచి అభిమానులు అధిక చిత్రాలను ఆశించవచ్చని శ్రుతిహాసన్ అన్నారు. ఈ బ్యూటీ చిన్న గ్యాప్ తరువాత నటనకు రెడీ అయిపోయారు. ప్రస్తుతం ఒక హిందీ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే తండ్రితో కలిసి నటిస్తున్న శభాష్నాయుడు చిత్ర షూటింగ్ మొదలవుతుందని శ్రుతీహాసన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment