
భోపాల్ : ఆన్లైన్ వీడియోగేమ్ పబ్జీకి బానిసైన ఓ 16 ఏళ్ల యువకుడు ప్రాణాలు విడిచిన ఘటన నీమచ్లో గత మంగళవారం జరిగింది. ఫర్ఖాన్ ఖురేషీ అనే యువకుడు అదేపనిగా 6 గంటలపాటు పబ్జీ ఆడాడు. దీంతో తీవ్ర గుండెనొప్పితో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ‘లంచ్ చేసిన తర్వాత మా తమ్ముడు ఆట మొదలుపెట్టాడు. సహచర ఆటగాళ్లపై తీవ్రంగా కోప్పడ్డాడు. గట్టిగట్టిగా కేకలు వేస్తూ.. అయిపోయింది. పేలిపోయింది. మీ వల్లే ఓడిపోయాను, ఇంకెప్పుడూ మీతో ఆడను అని ఇయర్ఫోన్స్ నేలకేసి కొట్టి ఏడ్వడం మొదలుపెట్టాడు. ఏడుస్తూ..కుప్పకూలిపోయాడు’ మృతుని సోదరి కన్నీరుమున్నీరైంది. తమ కుమారున్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయిందని ఫర్ఖాన్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటికే తమ కుమారుడు మరణించినట్టు వైద్యులు చెప్పారని అన్నారు.
‘ఫర్ఖాన్ని ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ, అప్పటికే అతని నాఢీ కొట్టుకోవడం ఆగిపోయింది. కరెంట్ షాక్తో అతన్ని బతికించే ప్రయత్న చేశాం. కానీ ఫలించలేదు’ అని డాక్టర్ అశోక్ జైన్ తెలిపారు. ఫర్ఖాన్ మంచి స్విమ్మర్ అని, అతనికి ఎలాంటి గుండె జబ్బులు కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ మాయదారి పబ్జీ తమ కుమారున్ని పొట్టనబెట్టుకుందని వాపోయారు. మృతుని సోదరుడు మహ్మద్ హషీమ్ కూడా పబ్జీకి బానిస. అతను రోజూ 18 గంటలు పబ్జీ ఆడతాడు. అయితే, సోదరుని మరణంతో ఉలిక్కిపడిన హషీమ్.. తన మొబైల్ నుంచి ఆ గేమ్ని డిలీట్ చేశాడు. ఇక విపరీతంగా వీడియో, ఆన్లైన్ గేమ్లు ఆడటం కూడా వ్యసనం లాంటిదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment