న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు కలవరపెడుతున్నాయి. గత మూడేళ్లుగా సగటున ప్రతి రెండు రోజులకు ఐదుగురు చొప్పున బాలికలు అత్యాచారానికి గురౌతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం అత్యాచార ఘటనల్లో బాధితులు 46 శాతం మైనర్లే ఉన్నట్లు బుధవారం రాజ్యసభలో కేంద్ర హోం శాఖ ప్రకటించింది.
గత మూడేళ్లుగా అత్యాచార కేసుల్లో బాధితుల వివరాలను కేంద్రం వెల్లడించింది. దీని ప్రకారం 2013లో ఢిల్లీలో మొత్తం 1,636 రేప్ కేసులు నమోదు కాగా ఇందులో 757 కేసుల్లో బాధితులు మైనర్లుగా ఉన్నారు. 2014 లో నమోదైన 2,166 రేప్ కేసులకు గాను 1,004 కేసుల్లో బాధితులు మైనర్లుగా ఉన్నారు. ఇక ఈ సంవత్సరం అక్టోబర్ 31 నాటికే రాజధానిలో 1,856 అత్యాచార కేసులు నమోదు కాగా అందులో 824 కేసుల్లో బాధితులు 18 సంవత్సరాల లోపు వారని తెలిపారు.
అయితే ఢిల్లీలో అత్యాచారాల నిర్మూలనకు ఢిల్లీ పోలీసులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. మహిళల స్వీయ రక్షణకు శిక్షణ ఇవ్వడానికి చేపట్టిన కార్యక్రమం ద్వారా 2014 సంవత్సరంలో 17,699 మంది తర్ఫీదు పొందినట్లు తెలిపారు. అలాగే మహిళకు వ్యతిరేకంగా జరిగే నేరాలను విచారించడానికి మహిళా అధికారులనే వినియోగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ పరాతిభాయ్ చౌదరి రాజ్యసభలో తెలిపారు.