సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పంద పత్రాలు గల్లంతు వ్యవహారం కలకలం రేపడంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. రఫేల్ ఒప్పంద పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చోరీకి గురికాలేదని, వాటి నకళ్లను మాత్రమే పిటిషనర్లు తమ దరఖాస్తుల్లో వాడారని మాత్రమే తాను సుప్రీం కోర్టు ఎదుట పేర్కొన్నానని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వివరణ ఇచ్చారు.
రఫేల్ యుద్ధ విమాన ఒప్పంద పత్రాలు చోరీ అయ్యాయని బుధవారం సర్వోన్నత న్యాయస్ధానంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. సున్నితమైన సమాచారం కలిగిన ఈ పత్రాలు మాయం కావడంపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రఫేల్ పత్రాలు చోరీకి గురయ్యాయని విపక్షాలు చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని కేకే వేణుగోపాల్ పేర్కొన్నారు. రఫేల్ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, ప్రశాంత్ భూషణ్లు తమ దరఖాస్తులో అనుబంధంగా ఒరిజినల్ పత్రాల ఫోటోకాపీలను వాడారని వేణుగోపాల్ పేర్కొన్నారు. కాగా అటార్నీ జనరల్ చోరీ అనే పదాన్ని వాడకుండా ఉండాల్సిందని అధికార వర్గాలు సైతం వ్యాఖ్యానించాయి. మరోవైపు ఈ పత్రాల ఆధారంగా కథనాలను ప్రచురించినందుకు అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేస్తామని ప్రభుత్వం ది హిందూ వార్తాపత్రికను హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment