
డెహ్రాడూన్: హిమాలయాలకు సమీపంలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని పెనుభూకంపం అతలాకుతలం చేయనుందా? రాష్ట్రంలో గత రెండేళ్లుగా స్వల్పస్థాయిలో సంభవిస్తున్న భూకంపాలు దీన్నే హెచ్చరిస్తున్నాయా? అంటే నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. ఉత్తరాఖండ్లో త్వరలోనే అత్యంత భారీ భూకంపం విధ్వంసం సృష్టించనుందని ఆ రాష్ట్ర విపత్తు ఉపశమనం, నిర్వహణా కేంద్రం (డీఎంఎంసీ) చీఫ్ పీయూష్ రౌతేలా తెలిపారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 8 కిపైగానే నమోదవ్వొచ్చని చెప్పారు.
2015, జనవరి 1 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో 51 సార్లు భూమి స్వల్పంగా కంపించిందనీ, వీటిని హెచ్చరికలుగానే పరిగణించాల్సి ఉంటుం దన్నారు. ఉత్తరాఖండ్లో గత 200 ఏళ్లుగా ఒక్క భారీ భూకంపం కూడా రాలేదన్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాలు అత్యంత తీవ్రమైన భూకంపాలు సంభవించే జోన్–5లో ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 1803లో చివరిసారిగా సంభవించిన భారీ భూకంపంతో ఉత్తరాఖండ్ అతలాకుతలమైందన్నారు. రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో భూకంపం వస్తే ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలైన ముస్సోరీలో 18 శాతం, నైనిటాల్లో 14 శాతం భవనాలు నేలమట్టమవుతాయని స్పష్టం చేశారు. ఇక్కడి భవనాల్లో చాలావరకూ 1951కి ముందే నిర్మితమమైనవే.