
సాక్షి, ముంబై: ముంబై తీరంలో పవన్హన్స్ సంస్థకు చెందిన హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరు గల్లంతయ్యారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓఎన్జీసీకి చెందిన ఐదుగురు అధికారులు, ఇద్దరు పైలట్లు సహా ఏడుగురితో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. జుహూలోని పవన్ హన్స్ విమానాశ్రయం నుంచి శనివారం ఉదయం 10.20 గంటలకు ఓఎన్జీసీకి చెందిన డీజీఎం స్థాయి అధికారులు సహా ఐదుగురు సిబ్బంది, ఇద్దరు పైలట్లతో హెలికాప్టర్ టేకాఫ్ అయ్యింది.
10.30 గంటల సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే ఓఎన్జీసీ, కోస్ట్గార్ట్, నేవీ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గాలింపు చర్యల అనంతరం డహాణు సమీపంలో హెలికాప్టర్ అవశేషాలను గుర్తించారు. ఐదు మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన ఇద్దరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా, ఓఎన్జీసీకి ముంబై తీరంలో కీలకమైన చమురు నిక్షేపాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment