⇒ టీచర్ని 22 సార్లు కత్తెరతో పొడిచిన వైనం
⇒ ఉదయం 9 గంటలకు అంతా చూస్తుండగానే ఘోరం
⇒ విలవిల్లాడుతూ అక్కడే ప్రాణాలు విడిచిన యువతి
⇒ దాడికి పాల్పడింది ఓ రిటైర్డ్ ఎస్సై కొడుకు
⇒ పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించిన స్థానికులు
న్యూఢిల్లీ:
మూడు నెలల కిందట..
చెన్నైలోని ఓ రైల్వేస్టేషన్.. పట్టపగలు.. అందరూ చూస్తుండగానే ఓ యువతిని ఉన్మాది కత్తితో విచక్షణరహితంగా పొడిచి చంపాడు!
నేడు..
దేశ రాజధాని.. ఉదయంపూట.. మరో ఘోరం! ఓ రాక్షసుడు అమ్మాయిని అతి కిరాతకంగా చంపేశాడు!! వెంట తెచ్చుకున్న కత్తెరతో రెండున్నర నిమిషాల్లో ఏకంగా 22 సార్లు పొడిచి దారుణంగా హతమార్చాడు. వాడు అలా దాడి చేస్తున్న సమయంలో చుట్టూరా జనం ఉన్నా.. ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. వారిలో ఒక్కరు ధైర్యం చేసినా ఆ అమ్మాయి బతికేదేమో పాపం!! ఆ ఉన్మాది ఓ రిటైర్డ్ ఎస్సై కొడుకు కావడం గమనార్హం. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీలో రికార్డయింది. ఆ వీడియో క్లిప్ మీడియా, సోషల్ మీడియాలో విసృ్తతంగా ప్రచారం కావడంతో కేంద్రం కదిలింది. ఢిల్లీ పోలీసుల నుంచి నివేదిక కోరింది.
అసలేం జరిగింది?
ఆమె పేరు కరుణ కుమార్. వయసు 21 సంవత్సరాలు. ఢిల్లీలోని నావెల్ రిచెస్ స్కూళ్లో టీచర్గా పనిచేస్తోంది. వరుసకు సోదరైన నేహా కూడా అదే స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. మంగళవారం ఉదయం 9 గంటలకు ఎప్పట్లాగే ఇద్దరూ కలసి పాఠశాలకు బయల్దేరారు. నార్త్ ఢిల్లీలోని బురారీలో లేబర్చౌక్కు చేరుకున్నారు. ఉన్మాది సురేందర్(34) మరో వ్యక్తితో కలసి బైక్పై వచ్చి ఒక్కసారిగా కరుణపై విరుచుకుపడ్డాడు. కిందకు తోసేసి కత్తెరతో విచక్షణరహితంగా పొడిచాడు. కరుణ విలవిల్లాడుతూ సాయం కోసం అర్థించింది. ఆ సమయంలో ఓ వ్యక్తి సురేందర్ను ఆపేందుకు కొద్దిగా ముందుకు వచ్చాడు. కానీ తనపైనా దాడి చేస్తాడేమోనన్న భయంతో వెనక్కి తగ్గాడు.
వెంట ఉన్న నేహాను ఉన్మాది కత్తెరతో బెదిరించడంతో పక్కన నిలబడి గట్టిగా కేకలు పెట్టింది. రెండున్నర నిమిషాల వ్యవధిలో ఆ ఉన్మాది... కరుణ ముఖం, గొంతు, గుండెపై 22 సార్లు పొడిచి పారిపోయాడు. తర్వాత అక్కడున్నవారు ఆమెను సివిల్లైన్స్లోని శుశ్రుత హాస్పిటల్కు తీసుకువెళ్లారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు సరైన వివరాలు చెప్పడం లేదంటూ కరుణ కుటుంబీకులు ఆసుపత్రి ముందు గంటసేపు ధర్నాకు దిగారు. అదనపు డీసీపీ ఈశా పాండే వచ్చి వారిని సముదాయించడంతో ఆందోళన విరమించారు.
పట్టుకొని చితకబాదిన స్థానికులు
కరుణను చంపి పారిపోతున్న సురేందర్ను కొద్దిదూరంలో స్థానికులు పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. అతడి తలకు తీవ్ర గాయం కావడంతో తొలుత అరుణ అసఫ్ అలీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తర్వాత అక్కడ్నుంచి ఎల్ఎన్జేపీ హాస్పిటల్కు తీసుకెళ్లారు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 320 (హత్య) కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గతంలోనే పోలీసులకు ఫిర్యాదు
సురేందర్ ఢిల్లీలో ఓ రిటైర్డ్ ఎస్సై కొడుకు. ఇతడికి పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం భార్యతో విడాకుల కేసు నడుస్తోంది. గత ఏడాదిన్నర నుంచి కరుణ వెంట పడుతున్నాడు. దీంతో ఆమె కుటుంబం పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. గతంలో సురేందర్కు చెందిన కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో కరుణ ట్రెయినింగ్ తీసుకుంది. అప్పట్నుంచే సురేందర్ తనను ప్రేమించాలంటూ కరుణను వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు
ఆగ్రాలో సమీప బంధువు ఒకరు చనిపోవడంతో కరుణ తల్లిదండ్రులు ఆగ్రా వెళ్లి మంగళ వారం ఉదయమే ఢిల్లీకి తిరిగి వచ్చారు. వచ్చీరాగానే కరుణ మరణవార్త తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘‘మా బంధువు చనిపోవడంతో భర్తతో కలసి ఆగ్రా వెళ్లాం. ఉదయమే వచ్చాం. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. నా బిడ్డ ఎంతో కష్టపడేది. నెలకిందటే ఆ స్కూల్లో టీచర్గా చేరింది. ఇంకా పై చదువులు చద వాలనుకుంటోంది’’ అంటూ కరుణ తల్లి రామ్ బేటీ గుండెలవిసేలా విలపించింది.
ఆమె తండ్రి నరేశ్కు సంత్నగర్లో ఓ చిన్న బ్యాగుల షాపు ఉంది. దాంతో నెలకు వచ్చే రూ.10 వేలతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దూరవిద్య ద్వారా బీఏ పూర్తి చేసిన కరుణ.. టీచర్గా వస్తున్న రూ.5 వేల జీతంతో తన తండ్రికి అండగా నిలిచింది. తన ఇద్దరు సోదరులు మనీశ్, హిమాన్షులను చదివిస్తోంది. ‘‘సురేందర్ మా అక్కను వేధించడంతో మేం గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశాం. అతడి తల్లిదండ్రులు వచ్చి క్షమాపణలు చెప్పారు. రాజీ కుదిరింది. ఇంతలోనే ఇలా చంపేశాడు’’ అని మనీశ్ తెలిపాడు.
ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నాం..
కరుణ, తాను ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నామని సురేందర్ పోలీసులకు తెలిపాడు. పెళ్లి ప్రతిపాదనను ఆమె కుటుంబం తిరస్కరించిందని, మరొకరితో పెళ్లి చేయాలని చూస్తున్నారని వివరించారు. ‘‘కరుణ మరో వ్యక్తితో కలసి ఉన్న ఫొటోను ఓ వ్యక్తి సురేందర్కు ఫోన్లో పంపాడు. దాంతో అతడు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చు’’ అని పోలీసులు తెలిపారు. దాడి సమయంలో సురేందర్తోపాటు బైక్ వచ్చిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.