
గాంధీజీ సమాధి వద్ద నివాళులర్పిస్తున్న ట్రంప్ దంపతులు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ మంగళవారం ఢిల్లీలోని రాజ్ఘాట్లో జాతిపిత మహాత్మాగాంధీ స్మారక స్థలాన్ని సందర్శించారు. మహాత్ముడి సమాధి దగ్గర పుష్పగుచ్ఛాలను ఉంచి, పూలతో అర్చించి నివాళులర్పించారు. అనంతరం ట్రంప్ సందర్శకుల పుస్తకంలో గాంధీజీని కొనియాడుతూ సందేశాన్ని రాశారు. ‘‘మహాత్ముడి ఆలోచనల నుంచి రూపు దిద్దుకున్న అత్యంత అద్భుతమైన సార్వభౌమ భారత్కు అమెరికా ప్రజలు బలమైన మద్దతు ఇస్తారు. ఇది నాకు దక్కిన అపూర్వమైన గౌరవం’’అని ఆ పుస్తకంలో రాశారు.
ట్రంప్ సబర్మతి ఆశ్రమం సందర్శించినప్పుడు మహాత్ముడి ప్రస్తావన లేకుండా సందేశం రాయడంతో ట్విట్టర్లో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్ అసలు గాంధీ పేరు విన్నారా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాజ్ఘాట్లో ట్రంప్ రాసే సందేశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సందేశం దగ్గర ట్రంప్తో పాటు మెలానియా కూడా సంతకాలు చేశారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్రంప్ను రాజ్ఘాట్కు తోడ్కొని వెళ్లారు.
రాజ్ఘాట్ వద్ద మొక్కను నాటుతున్న ట్రంప్, మెలానియా
Comments
Please login to add a commentAdd a comment