సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయి: వైఎస్ జగన్
న్యూఢిల్లీ: దేశ చరిత్రలో ఇలాంటి అన్యాయం ఎక్కడా జరుగలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటి అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కనివినీ ఎరుగని విధంగా రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోంది అని వైఎస్ జగన్ అన్నారు. చరిత్రలో అసెంబ్లీ ఆమోదం తెలిపిన తర్వాతనే రాష్ట్రాల ఏర్పాటు జరిగాయని ఆయన తెలిపారు.
ఎప్పుడూ లేనట్టుగా మొట్టమొదటిసారిగా.. బిల్లును వెనక్కి పంపించినా, అసెంబ్లీలో తిరస్కరిస్తూ తీర్మానం చేసినా.. అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది అని వైఎస్ జగన్ తెలిపారు. సమైక్యంగా రాష్ట్రాన్ని ఉంచాలని చేసిన విజ్క్షప్తిని రాష్ట్రపతి సుదీర్ఘంగా విన్నారని జగన్ తెలిపారు.
'నాకు దేవుడి మీద పూర్తిగా నమ్మకం ఉంది. చాలా మంది రాజకీయవేత్తలను కలిశాం. పార్టీ అధినేతలను కలిశాం. ప్రతిపక్ష పార్టీలన్ని రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మద్దతు తెలుపుతాయని చాలా గట్టిగా నమ్మకం నాకు ఉంది అని వైఎస్ జగన్ తెలిపారు. అడ్డగోలుగా కాంగ్రెస్ విభజనకు పాల్పడితే.. ప్రతిపక్షాలన్ని గట్టిగా బుద్ది చెప్పుతాయన్నారు.
బిల్లు అనేది పార్లమెంట్ కు వస్తుందో రాదో ఖచ్చితంగా చెప్పలేను. ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పగలను. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయి. ఇరువై రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తోంది. కాంగ్రెస్ ఇంటికి పోవాల్సిందే అని వైస్ జగన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా ఓటు వేస్తామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.