ప్రియుడి చేతిలో అత్యాచారానికి గురై, అనుమానాస్పద స్థితిలో మంటలంటుకుని తీవ్రంగా గాయపడిన బాలిక(16) బుధవారం చనిపోయింది.
న్యూఢిల్లీ: ప్రియుడి చేతిలో అత్యాచారానికి గురై, అనుమానాస్పద స్థితిలో మంటలంటుకుని తీవ్రంగా గాయపడిన బాలిక(16) బుధవారం చనిపోయింది. వంద శాతం కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుఝామున తుదిశ్వాస విడిచింది. దీంతో ఆకుటుంబం విషాదంలో మునిగిపోయింది.
అటు బాధిత బాలిక కనీసం మాట్లాడలేని స్థితిలో ఉండడంతో మేజిస్ట్రేట్ ఆమెను స్టేట్ మెంట్ ను రికార్డు చేయలేకపోయారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో బాధిత బాలిక ఆత్మహత్య చేసుకుందా.. లేక ప్రియుడే ఆమెను అత్యాచారంచేసి, హత్య చేశాడా అనే అంశంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.
కేసు పూర్వాపరాల్లోకి వెళితే గ్రేటర్ నోయిడా పరిధిలో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో కాలిన గాయాలతో కనిపించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అజయ్ కుమార్ (18)ని అరెస్ట్ చేశారు.
అయితే తన కుమార్తెను రేప్ చేసి, కిరోసిన్ పోసి నిప్పటించాడని బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తోంటే.. తనకే పాపం తెలియని నిందితుడు అజయ్ అంటున్నాడు. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నిస్తే..కాపాడబోయానని.. అందుకే తన చేతికి గాయాలయ్యాయని వాదించాడు.
గత రెండు సంవత్సరాలుగా బాధిత బాలిక, అజయ్ కుమార్ మధ్య ప్రేమ వ్యవహారం ఉందనీ పోలీసులంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఏప్రిల్ లో వీరిద్దరూ ఒకసారి పారిపోయినట్టు తెలిపారు. తమ విచారణ కొనసాగుతుందనీ...పోస్ట్ మార్టం నివేదిక తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు.