
ముంబై: దేశ వ్యాప్తంగా ఆందోళనకు కేంద్రబిందువైన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై చర్చించేందుకు బాలీవుడ్ నటులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వాంచింది. ముంబైలోని గ్రాండ్ హయత్లో జరగనున్న ఈ సమావేశంలో సీఏఏపై నెలకొన్న అపోహలు, వాస్తవాలను చర్చిస్తామని తెలిపింది. ఈ మేరకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్, బీజేపీ వైస్ ప్రెసిడెంట్ జయా పాండే ఆదివారం ఓ ప్రకటన ద్వారా వారికి ఆహ్వానం పలికారు. కాగా సీఏఏ, ఎన్ఆర్సీలను కొందరు బాలీవుడ్ నటులు మద్దతిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చట్టాలపై దేశ వ్యాప్తంగా ప్రచారం నిర్వహించి, ప్రజలకు అవగహన కల్పించేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగానే బాలీవుడ్ నటులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని భావిస్తోంది.
బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ ప్రభుత్వ విధానాలకు మద్దతు తెలుపుతుండగా, అనురాగ్ కశ్యప్, స్వరా భాస్కర్, సిద్ధార్థ్ వంటి నటులు సీఏఏ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా జామియా ఇస్లామియాలో బహిరంగ సభలకు నటి స్వరా భాస్కర్ హాజరయ్యారు. బీజేపీ దేశ వ్యాప్తంగా సీఏఏకి సంబంధించిన అవగాహన కలిగించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అధ్వర్యంలో లక్ష మందికి పైగా బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులతో గువాహటిలో శనివారం ర్యాలీ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment