
కశ్మీర్లో గవర్నర్ పాలన
శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో శనివారం రాత్రి గవర్నర్ పాలన విధించారు. ఈమేరకు కేంద్ర హోంశాఖ ప్రతినిధి ఢిల్లీలో ప్రకటించారు. జమ్మూకశ్మీర్ రాజ్యాంగం కింద తనకు సంక్రమించిన అధికారం ప్రకారం గవర్నర్ .. రాష్ట్రపతి ఆమోదంతో గవర్నర్ పాలన విధించి ఉత్తర్వులు జారీ చేశారని, ఇది ఈ నెల 8 నుంచి అమల్లోకి వచ్చిందని రాజ్భవన్ ప్రతినిధి తెలిపారు. సీఎం సయీద్ అనారోగ్యంతో కన్నుమూయడం, కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియకు సమయం పట్టనుండటంతో రాజ్యాంగ శూన్యతను నివారించేందుకు గవర్నర్ పాలన అనివార్యమైంది.
తండ్రి మరణం నేపథ్యంలో రాష్ట్రంలో ప్రకటించిన నాలుగు రోజుల సంతాప దినాలు పూర్తికాకుండానే కొత్త సీఎంగా పగ్గాలు చేపట్టేందుకు సయీద్ కుమార్తె, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ విముఖత వ్యక్తం చేయడంతో గవర్నర్ పాలన విధించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆమె సీఎం పదవి చేపట్టేందుకు 28 మంది పీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ను కలసి ఇప్పటికే మద్దతు తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ సయీద్ గురువారం మరణించడం తెలిసిందే.
మరోవైపు ఆదివారంతో సంతాపం దినాలు ముగియనుండటంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని పీడీపీ సంకీర్ణ భాగస్వామి అయిన బీజేపీ తెలిపింది. నూతన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తమ మధ్య భేదాభిప్రాయాలు, షరతులు లేవని పీడీపీ, బీజేపీలు అంతకుముందు పేర్కొన్నాయి. కాగా, రాష్ట్రంలో గవర్నర్ పాలన ఇంకా విధించనప్పుడు జమ్మూకశ్మీర్ను ఎవరు పాలిస్తున్నారో అర్థం కావట్లేదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.