సుప్రీంకోర్టు తీర్పు సబబే | There is nothing wrong with imposing term limits on governors | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు తీర్పు సబబే

Published Sun, Apr 13 2025 3:19 AM | Last Updated on Sun, Apr 13 2025 3:19 AM

There is nothing wrong with imposing term limits on governors

గవర్నర్లకు కాల పరిమితి విధించడం తప్పేమీ కాదు

సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితిని గవర్నర్లు కల్పించారు

ఇటీవలి కాలంలో ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారు

న్యాయ నిపుణుల స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: శాసనసభ ఆమోదించిన బిల్లులపై తమ నిర్ణయం వెలువరించే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్‌లకు కాల పరి­మితిని ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును న్యాయ నిపుణులు స్వాగతి­స్తున్నారు. రాష్ట్రపతికి, గవర్నర్లకు కాలపరిమితి విధించడం తప్పేమీ కాదని స్పష్టంచేస్తున్నారు. 

ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందేనని, ఇందుకు రాష్ట్రపతి, గవర్నర్లు అతీతులు కాదంటు­­న్నారు. బిల్లుల విషయంలో గవర్నర్లు చేస్తున్న అసాధారణ, రాజకీయ జాప్యం వల్ల ప్రజాస్వామ్య మనుగడ ప్రమాదంలో పడకుండా సుప్రీంకో­ర్టు తీర్పు రక్షిస్తుందని పేర్కొంటున్నారు. ఇది చారిత్రక తీర్పుగా అభివర్ణిస్తున్నారు.

ప్రజా తీర్పును గవర్నర్లు అడ్డుకోలేరు
చట్టసభలు ఆమోదించిన బిల్లుల విషయంలో నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని గవర్న­ర్లను, మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతిని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా సమర్థిస్తున్నా. చట్టసభల నిర్ణ­యాల్లో ప్రజల ప్రయోజనాలే ప్రతిబింబిస్తుంటాయి. చట్టస­భలు తీసుకునే నిర్ణయాలను రాష్ట్రపతి చేత నామినేట్‌ అయ్యే ఓ గవర్నర్‌ తన ఇష్టానుసారం అడ్డుకోవడం సబబు కాదు. ఇది రా­జ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు తీర్పు చరిత్రలో ఓ మైలు­రాయిగా నిలిచిపోతుంది. – సీవీ నాగార్జునరెడ్డి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది

ఇది సరైన తీర్పే
సుప్రీంకోర్టు సరైన తీర్పే ఇచ్చింది. గవ­ర్నర్లు రాజ్యాంగబద్ధంగా నడుచుకోకపో­వ­డం, ప్రతి­పక్ష పార్టీలు అధికారంలో ఉన్న­చోట ఆ ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం చేస్తు­న్నారు. ఇటీవల గవర్నర్లు రాష్ట్ర ప్రభు­త్వా­లను రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. పరిధులు దాటుతున్నారు. రాజ్యాంగ విలువలకు, సంప్రదా­యా­లకు తిలోదకాలిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలను పట్టించుకో­వడం లేదు. గవర్నర్ల తీరుతో సుప్రీంకోర్టు విధిలేని పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా తాజా తీర్పునిచ్చింది. – సీవీ మోహన్‌రెడ్డి, సీనియర్‌ న్యాయవాది

న్యాయ సమీక్ష తప్పేమీ కాదు
చట్టసభల ఆమోదం పొందిన బిల్లుల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతికి నిర్దిష్ట గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేక కోణంలో చూడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగానికి లోబడే సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. తన వద్దకు వచ్చే బిల్లుల విషయంలో నిర్ణయానికి సంబంధించి రాష్ట్రపతికి ఇప్పటివరకు నిర్దిష్ట గడువు అంటూ లేదు. గడువు లేదన్న నెపంతో ఏళ్ల తరబడి ఆ బిల్లులను అలా పెండింగ్‌లో పెట్టుకుంటామంటే ఎలా? ప్రజల ఆకాంక్షలు ఏం కావాలి? శాసనసభ చేసిన బిల్లు­లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే అందులో రాష్ట్ర­పతి, గవర్నర్లు జోక్యం చేసుకోవచ్చు. 

అలాగే ఆ బిల్లులు ఏకపక్షంగా, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే కోర్టులు జోక్యం చేసుకుంటాయి. గవర్నర్ల తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నప్పుడు, వారి నిర్ణయాలు రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కోర్టులు న్యాయ సమీక్ష చేయడం తప్పేమీ లేదు. సుప్రీంకోర్టు అదే చేసింది.– చిత్తరవు నాగేశ్వరరావు, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement