
'మా ఇంటికి ఎప్పటికీ వెళ్లను'
లక్నో: దాద్రి ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ యువకుడు డానిష్ అక్లాఖ్ తిరిగి ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదంటున్నాడు. గత సెస్టెంబర్ 28న దాద్రి సమీపంలోని బిసడ గ్రామంలో గోవధ వదంతుల నేపథ్యంలో సుమారు వంద మంది స్థానికులు వీరి కుటుంబంపై దాడిచేశారు. ఈ ఘటనలో తండ్రి మహ్మద్ అక్లాఖ్(50) చనిపోగా, కుమారుడు డానిష్ అక్లాక్ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందాడు.
ఆ దుర్ఘటన నుంచి కోలుకున్న డానిష్ మాట్లాడతూ... మాపై దాడి చేసిన వాళ్లు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆ దాడి జరుగుతున్నప్పుడు.. 'ఈ రోజు నేను చచ్చిపోయినట్లే' అని భావించినట్లు తెలిపాడు. మా తప్పు లేకుండానే మమ్మల్ని కొట్టారు. అకారణంగా మమ్మల్ని కొట్టిన ఆ గ్రామానికి తాను వెళ్లనని అక్లాక్ పేర్కొన్నాడు. ఆ రోజు జరిగిన దాడిలో తల, గుండెపై, కంటిపై గాయాలయ్యాయని.. రెండు నెలల చికిత్స తర్వాత కోలుకున్నట్లు చెప్పాడు. ఆదివారం నాడు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇంటికి వెళ్లాడు. తమపై జరిగిన దాడి గురించి సీఎంకి వివరించాడు.
తన తండ్రిని చంపినవాళ్లలో 6౦-70 శాతం మంది తనకు తెలుసునని, స్కూళ్లో కూడా ఎప్పుడు తాను ఎవరితోనూ గొడవకు దిగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అతడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో విధులు నిర్వహిస్తున్న తన సోదరుడు సర్తాజ్తో కలిసి చెన్నైలో నివాసం ఉంటున్నాడు. చుట్టుపక్కల వారి నుంచి భయాందోళనలకు గురవుతున్నారా అని సర్తాజ్ని అడిగిన ప్రశ్నకు.. 'సారే జహాసే అచ్చా హిందుస్తాన్ హమారా' అని సమాధానమిచ్చాడు.