
సునంద మృతిని 'సహజం'గా చెప్పాలన్నారు!!
సునందా పుష్కర్ మృతిని 'సహజం'గా చిత్రీకరించే ప్రయత్నాలు జరిగాయి. సాక్షాత్తు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ విభాగం అధినేతపైనే ఈ మేరకు ఒత్తిళ్లు వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. సునందా పుష్కర్ మృతిపై తాము చెప్పినట్లుగా నివేదిక ఇవ్వాలని ఉన్నతస్థాయి నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినట్లు డాక్టర్ సుధీర్ గుప్తా తెలిపారు. సునందా పుష్కర్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన ఫోరెన్సిక్ నిపుణుల బృందానికి ఆయన నేతృత్వం వహించారు.
నాటి కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య అయిన సునందా పుష్కర్ ఈ సంవత్సరం జనవరి 17వ తేదీన దక్షిణ ఢిల్లీలోని లీలా హోటల్ సూట్ నెం.345లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. రాత్రి 8 గంటలకు ఏఐసీసీ సమావేశం నుంచి తిరిగొచ్చిన తర్వాత శశిథరూర్ ఆమె మృతదేహాన్ని చూశారు. అయితే.. ఆమె మరణాన్ని సహజ మరణంగా చెప్పాలంటూ తనపై ఉన్నతాధికారుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చినట్లు డాక్టర్ సుధీర్ గుప్తా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు, చీఫ్ విజిలెన్స్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. డ్రగ్ పాయిజనింగ్ వల్లనే ఆమె మరణించారని, అది ఆత్మహత్య అయినా కావచ్చు, లేదా కావాలనే ఆమెకు ఆ మందు ఇచ్చి ఉండొచ్చని తాను ఇచ్చిన నివేదికకే కట్టుబడి ఉండటంతో ఇప్పుడు తనను టార్గెట్ చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
కాగా, సునందా పుష్కర్ పోస్టుమార్టం వివాదం పెద్దది కావడంతో దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఎయిమ్స్ డైరెక్టర్ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కోరారు.