
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీత తేదీ ఖరారైంది. ఏడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ దోషులైన ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ ఠాకూర్ (31)లను ఈ నెల 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు మంగళవారం డెత్ వారెంట్లు జారీ చేసింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి సతీష్ కుమార్ అరోరా కోర్టు హాలులో డెత్ వారెంట్ను చదివి వినిపించారు. ఈ నేపథ్యంలో గత 15 ఏళ్లలో దేశంలో మరణశిక్షలు అమలు చేసిన వివరాలను పరిశీలిస్తే.. మొత్తం 400 మందికి కోర్టులు మరణశిక్షలు విధించగా అందులో కేవలం ఒక శాతం మందికి మాత్రమే శిక్షలు అమలైనట్టు జాతీయ నేర విభాగం (ఎన్సీఆర్బీ) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.
చదవండి: నిర్భయ దోషులకు 22న ఉరి
మరణశిక్ష కేసుల్లో దాదాపు 1200 మందికి అది ఆ తర్వాత జీవిత ఖైదుగా మారింది. నిర్భయ నిందితులకు ఈ నెల 22న ఉరిశిక్ష అమలు చేయనున్న నేపథ్యంలో ఎన్సీఆర్బీ గణాంకాలకు ప్రాధాన్యం ఏర్పడింది. కోర్టులో సుదీర్ఘకాల విచారణ, రాష్ట్రపతి అభ్యర్థనలు కారణంగానే శిక్షల అమలులో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. గత 15 ఏళ్లలో ఉరిశిక్ష అమలు పరిచింది నలుగురికి మాత్రమే. బాలికపై అత్యాచారం కేసులో పశ్చిమ బెంగాల్కు చెందిన ధనుంజయ్, ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో కీలక పాత్రధారి పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్, పార్లమెంట్పై దాడికి పాల్పడిన అఫ్జల్ గురు, 1993లో ముంబైలో జరిగిన వరుస బాంబుదాడులకు కారకుడైన యాకూబ్ మెమన్లకు మాత్రమే గత 15 ఏళ్లలో ఉరిశిక్ష అమలు పరిచారు. ఈ నెల 22న నిర్భయ దోషులకు ఉరితీస్తే ఈ సంఖ్య 8కి పెరుగునుంది.
Comments
Please login to add a commentAdd a comment