98 మంది ఎమ్మెల్యేల ఆస్తులపై విచారణ
న్యూఢిల్లీ: ఏడుగురు లోక్సభ సభ్యులు, 98 మంది ఎమ్మెల్యేల ఆస్తుల్లో గణనీయమైన పెరుగుదలను గుర్తించామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధుల ఆస్తుల పెరుగుదలపై సీబీడీటీ ఆధ్వర్యంలోని ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు నిర్వహించింది. ఆ వివరాల్ని వెల్లడిస్తూ సోమవారం కోర్టుకు సీబీడీటీ పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించింది. ‘లోక్ ప్రహరి ఎన్జీవో సంస్థ ఇచ్చిన ప్రజాప్రతినిధుల ఎన్నికల అఫిడవిట్ వివరాలపై ఆదాయపు పన్ను శాఖ విచారించింది. ప్రజాప్రతినిధుల ఆస్తులు భారీగా పెరిగినట్లు ఆ విచారణలో ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయి’ అని పేర్కొంది.
ఈ అంశంపై మరింత లోతుగా విచారించి.. ఆ సభ్యుల ఆస్తులకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టు సమర్పిస్తామని తెలిపింది. ఆదాయపు పన్ను శాఖనివేదిక వివరాల్ని ఆర్టీఐ చట్టం కింద అందించలేమని అఫిడవిట్లో బోర్డు వెల్లడించింది. లక్నోలోని ఎన్జీఓ సంస్థ ‘లోక్ ప్రహరి’ ప్రజాప్రతినిధుల ఆస్తుల పెరుగుదలపై సుప్రీంను ఆశ్రయించింది. ఆ సంస్థ సుప్రీంకు 26మంది లోక్సభ, 11 మంది రాజ్యసభ సభ్యులతో పాటు 257 మంది శాససనసభ్యుల ఆస్తుల వివరాలను అందించింది.