
సాక్షి, న్యూఢిల్లీ : ఫోన్లో మాట్లాడుతూ, మెసేజ్లు చేస్తూ వాహనాలు నడిపే వారు ప్రమాదాలను గుర్తించడానికి, అడ్డంకులను దాటడానికి 204 శాతం ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు ఒక ఐఐటీ బాంబే పరిశీలనలో తేలింది. దేశంలో జరిగే ప్రమాదాలకు ప్రధాన కారణాలు మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ఫోన్ చూస్తూ వాహనాలు నడపడం. 2016 సంవత్సరానికి గాను రోడ్డు ప్రమాదాల బారిన పడి 2,138 మంది మరణించినట్లు రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
ఈ నివేదిక పరిశీలించిన అనంతరం ఈ ప్రమాదాలకు కారణాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఐఐటీ-బీ విద్యార్థులు వారి ఇనిస్టిట్యూట్ ఓ పరిశోధనను నిర్వహించారు. మూడు రకాల వయసులకు చెందిన 100 మంది లైసెన్స్ కలిగిన డ్రైవర్లను తమ పరిశోధన కోసం ఎన్నుకున్నారు. అనంతరం ఆ డ్రైవర్లందరిని ఐదు దశలల్లో దాదాపు 3.5 కి.మీ దూరం ప్రయాణం చేయించారు. మార్గమధ్యలో కొన్ని అడ్డంకులను ఏర్పాటు చేశారు. ఆగి వున్న వాహనం, ప్రమాదకరమైన మలుపులు వంటి వాటిని ఉంచారు.
కొందరికి ఫోన్లు ఇచ్చి మాట్లాడుతూ వాహనం నడపమని చెప్పగా, మరికొందరిని మామాలుగా వాహనాలను నడపమని చెప్పారు. ఈ పరిశీలనలో అడ్డంకుల వచ్చిన సమయంలో వాటిని గమనించడానికి మాములుగా వాహనాలు నడుపుతున్న వారికంటే ఫోన్ వాడుతూ వాహనం నడుపుతున్నవారు 204 శాతం ఎక్కువ సమయాన్ని తీసుకున్నట్లు విద్యార్థులు గుర్తించారు.
ఫోన్ వాడుతున్నవారిలో ఒక రకమైన బద్ధకం ఏర్పడి వారు తమ చుట్టూ జరుగుతున్న వాటిని పట్టించుకోక పోవడమే ఇలా జరగడానికి ప్రధాన కారణం. వారి దృష్టి అంతా ఫోన్ మీదనే ఉండటంతో ప్రమాదాలను, ముందస్తు హెచ్చరికలను గమనించడానికి మిగితా వారితో పోల్చినప్పుడు ఫోన్ మాట్లాడేవారు అధిక సమయాన్ని తీసుకుంటున్నారని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment